– కార్పొరేట్లకు మోడీ సర్కార్ ఊడిగం
– ఆరేండ్లలో గల్లంతయిన తొమ్మిది మిలియన్ల ఉద్యోగాలు : డీవైఎఫ్ఐ ”ఉపాధి హక్కు” సదస్సులో జయతీ ఘోష్
ఉపాధి కల్పనతోనే యువతకి ఆర్థిక జవసత్వం వస్తుందని ప్రముఖ ఆర్థిక వేత్త, ప్రొఫెసర్ జయతీ ఘోష్ అన్నారు. కేంద్రంలో మోడీ సర్కార్ ఆశ్రిత పెట్టుబడిదారీవర్గాలు, బడా కార్పొరేట్ వర్గాలకు మాత్రమే ఊడిగం చేస్తున్నదని విమర్శించారు. సాధారణ ప్రజానీకాన్ని బీజేపీ సర్కారు పట్టించుకున్న పరిస్థితే లేదని విమర్శించారు. భారతదేశం నుంచి బహుళజాతుల కంపెనీలు అధికం శాతం రెవెన్యూ ఆర్జిస్తున్నాయని, కానీ అవే కంపెనీలు కనీస స్థాయి పన్నులు కూడా ప్రభుత్వానికి చెల్లించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్ఎన్సీలు సరైన స్థాయి పన్ను చెల్లిస్తే, దేశంలో అనేక సమస్యలకు ముగింపు పలకొచ్చని విశ్వాసం వ్యక్తం చేశారు. అధికారిక గణాంకాల ప్రకారం 2011-2018 మధ్య ఆరేండ్లలో తొమ్మిది మిలియన్ల ఉద్యోగాలను కోల్పోయమని ఆందోళన వ్యక్తం చేశారు. నోట్ల రద్దు, జీఎస్టీ వంటి ఏకపక్ష నిర్ణయాలతో ఆర్థిక తిరోగమనం నెలకొందని వివరించారు. దీంతో పెద్ద ఎత్తున దేశంలో ఉపాధికి గండి పడిందన్నారు. సోమవారం ఢిల్లీలోని గాలిబ్ ఆడిటోరియంలో భారత ప్రజాతంత్ర యువజన సంఘం (డీవైఎఫ్ఐ) ఆధ్వర్యంలో ‘ఉపాధి హక్కు’పై జాతీయ కన్వెన్షన్ జరిగింది. ఈ కన్వెన్షన్లో జయతీఘోష్ ప్రారంభోపన్యాసం చేశారు. దేశంలో గ్రామీణ, పట్టణ ప్రాంతాలనే తేడా లేకుండా ఉపాధి పడిపోయిందని స్పష్టం చేశారు. యువత పెద్ద ఎత్తున ఉద్యోగాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిణామాల కారణంగా, యువత తీవ్రమైన ఆక్రోశంతో ఉందని చెప్పారు. ఇప్పుడున్న ఆర్థిక విపత్కర పరిస్థితులను ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం తక్షణం కొన్ని చర్యలు చేపట్టాలని సూచించారు. గ్రామీణ ఉపాధి హామీ పథకంలో వేతనాలు పెంచాలన్నారు. దాన్ని పట్టణ ప్రాంతాలకు విస్తరించాలని తెలిపారు. జీడీపీలో కేవలం 0.2 శాతం మాత్రమే నరేగాకి ఖర్చు చేస్తున్నారని, ఇది ఏమాత్రం సరిపోవటం లేదని అన్నారు. ప్రజాసేవలపై ప్రభుత్వం నిధులు కేటాయించేందుకు సిద్ధపడటం లేదని విమర్శించారు. ప్రజాసేవ రంగం ఉపాధిని సృష్టిస్తుందని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో ఏడు మిలియన్ల ఉద్యోగ ఖాళీలు ఉన్నాయని, వాటిని ఖాళీలను భర్తీ చేయాలని సూచించారు.
ఎంఎన్సీలకు పన్ను రాయితే, దేశ ఆదాయానికి గండి
బహుళజాతి కార్పొరేట్లకు సంబంధించిన పన్ను రాయితీ వల్లనే కూడా దేశ ఆదాయానికి గండి పడుతుందని చెప్పారు. భారతదేశం నుంచి ఫేస్బుక్, గూగుల్, అమెజాన్ వంటి మల్టీ నేషనల్ కంపెనీలు భారీగా రెవెన్యూ పొందుతున్నాయని, కానీ ఆయా సంస్థలు పన్ను చెల్లించటం లేదని వివరించారు. ఒక్క ఫేస్బుక్.. తన ఆదాయంలో 12శాతం ఇండియా నుంచే ఆర్జిస్తుందని ఉదాహరించారు. ఎంఎన్సీ వల్ల గ్లోబల్ మార్కెట్ లాభం పొందుతుందని, కానీ దేశానికి ఎటువంటి లాభం లేదని అన్నారు. ఆయా సంస్థలు దేశానికి పన్ను చెల్లిస్తే, అనేక సమస్యలకు పరిష్కారం దొరుకుతుందన్నారు.
సదస్సు డిమాండ్లు..
‘ప్రభుత్వ రంగంలో ఖాళీలను వెంటనే భర్తీ చేయాలి. ఎస్సీ, ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలి. రిటైల్ రంగంలో ఎఫ్డీఐలను ఆపాలి. కనీస వేతనం రూ. 20 వేలు ఇవ్వాలి. ప్రభుత్వ రంగాన్ని విస్తరించాలి. ప్రయి వేట్ రంగాన్ని ఆపాలి. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. అసంఘటిత రంగం కార్మికులకు సామాజిక భద్రత కల్పించాలి. బ్యాంకుల ప్రైవేటీకరణ ఆపాలి. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ తప్పనిసరి చేయాలి. ఎస్సీ, ఎస్టీ, ముస్లీం రిజర్వేష్లను ప్రయివేట్ రంగంలోకి విస్తరించాలి” అనే డిమాండ్లతో కూడిన డిక్లరేషన్ను సదస్సు ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ సదస్సులో ప్రొఫెసర్ ఆర్.రామ్ కుమార్, ఏఐఏడబ్య్లూయూ జాతీయ నేత విక్రమ్ సింగ్, నియతి సింగరాజు, టిఐఎస్ఆర్ స్కాలర్ సుబిన్ దినీష్ తదితరులు మాట్లాడారు. డీవైఎఫ్ఐ జాతీయ అధ్యక్ష, కార్యదర్శులు మహ్మద్ రియాజ్, అభరు ముఖార్జీ, డివైఎఫ్ఐ జాతీయ ఉపాధ్యక్షులు ప్రీతి శేఖర్, మీనాక్షి ముఖార్జీ, బల్బీర్ ప్రశ్మర్, బాలవేలన్, రహీమ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అధ్యక్ష, కార్యదర్శులు జి.రామన్న, ఎం. సూర్యరావు, ఎ.విప్లవ్ కుమార్,ఎ. విజరుకుమార్, బీరెడ్డి సాంబశివ పాల్గొన్నారు.
Courtesy Navatelangana..