నూతన విద్యా విధానాన్ని వ్యతిరేకించిన సిపిఐ(ఎం)
కేంద్రానికి వ్యతిరేకంగా నిరసన తెలపాలని పిలుపు
న్యూఢిల్లీ : నరేంద్ర మోదీ సర్కారు తీసుకొచ్చిన కొత్త విద్యా విధానాన్ని సిపిఐ(ఎం) వ్యతిరేకించింది. మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ పేరు మార్చడాన్ని కూడా ఖండించింది. రాజ్యాంగం ప్రకారం విద్య ఉమ్మడి జాబితాలోని అంశమని, వివిధ రాష్ట్రాల అభ్యంతరాలు, వ్యతిరేకతను పట్టించుకోకుండా, ఏకపక్షంగా నూతన విద్యా విధానాన్ని కేంద్రం రుద్దడం రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమేనని సిపిఐ(ఎం) పొలిట్ బ్యూరో ఒక ప్రకటనలో విమర్శించింది. నూతన విద్యా విధానంపై పార్లమెంట్లో చర్చించాలని డిమాండ్ చేసింది. కొత్త విద్యా విధానాన్ని అమలులోకి తేవడానికి ముందు దీనిపై సమగ్ర చర్చకు వీలుగా పార్లమెంటు ముందుంచాలని సూచించింది.
విద్యావేత్తలు, ఉపాధ్యాయులు, విద్యార్థుల సలహాలను, అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా నూతన విద్యా విధానం ముసాయిదా తయారు చేసిందని ఆరోపించింది. భారతీయ విద్యను మరింత కేంద్రీకరణ, కాషాయీకరణ, వ్యాపారీకరణ చేయాలన్న ఉద్దేశంతో బీజేపీ నేతృత్వంలోని మోదీ సర్కారు తీసుకున్న ఈ ఏకపక్ష చర్య విద్యా విధానాన్ని నాశనం చేస్తుందని పొలిట్ బ్యూరో అభిప్రాయపడింది. కేంద్ర ప్రభుత్వం చర్యకు వ్యతిరేకంగా నిరసన తెలపాలని సిపిఐ(ఎం) పొలిట్బ్యూరో పిలుపునిచ్చింది.