– దానికీ ఎన్పీఆర్కూ లింక్ లేదు : షా
న్యూఢిల్లీ: ప్రధాని మోడీ అన్నది నిజమే, దేశవ్యాప్త ఎన్నార్సీపై కేంద్ర క్యాబినెట్ ఏనాడూ చర్చించలేదంటూ హౌంమంత్రి అమిత్షా వివరణ ఇచ్చారు. జాతీయ జనాభా పట్టిక(ఎన్పీఆర్)కూ జాతీయ పౌర పట్టిక(ఎన్నార్సీ)కూ లింక్ ఉండదని అమిత్షా తెలిపారు. ఎన్పీఆర్ కోసం సేకరించిన సమాచారాన్ని ఎన్నార్సీ కోసం వినియోగించామని అమిత్షా తెలిపారు. ఎన్పీఆర్, ఎన్నార్సీ వేర్వేరు ప్రక్రియలని, ఆ రెండింటి మధ్య లింకేమీ ఉండదని ఆయన అన్నారు. ఏఎన్ఐకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఎన్నార్సీపై వివరణ ఇచ్చారు. 2014లో తాము అధికారం చేపట్టిననాటి నుంచీ దేశవ్యాప్త ఎన్నార్సీపై తమ ప్రభుత్వం ఏనాడూ చర్చించలేదని ప్రధాని మోడీ ఆదివారం ఢిల్లీలో ఓ కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా ఎన్నార్సీని చేపడ్తామని పలు సందర్భాల్లో అమిత్షా చేసిన ప్రకటనల్ని ఉటంకిస్తూ ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి. ఇద్దరిలో ఎవరి మాటలు వాస్తవమంటూ సూటిగా ప్రశ్నించాయి. ఈ నేపథ్యంలో అమిత్షా తన గత వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. జనాభా లెక్కలు పదేండ్లకోసారి జరిగేవేనని అమిత్షా అన్నారు.
ఎన్నార్సీను యూపీఏ ప్రభుత్వమే ప్రారంభించిందన్నారు. ఎన్పీఆర్ వల్ల సంక్షేమ పథకాలకు ప్రణాళికలు రూపొందిం చుకోవచ్చునని అమిత్షా తెలిపారు. ఎన్పీఆర్ను తమ రాష్ట్రాల్లో చేపట్టమని కేరళ, బెంగాల్ ముఖ్యమంత్రులు ప్రకటించడంపైనా అమిత్షా స్పందించారు. రాష్ట్రాలు వీటిని రాజకీయం చేయడం తగదని ఆయన అన్నారు. దేశంలోని మైనారిటీలెవరూ తమ పౌరసత్వం కోల్పోరని పార్లమెంట్లో తాను స్పష్టం చేశానంటూ అమిత్షా తన తాజా ఇంటర్వ్యూలో సమర్థించుకున్నారు.
ఎన్పీఆర్ను కూడా నిలిపివేయండి
– ఎన్నార్సీని అమలు చేయబోమన్న ముఖ్యమంత్రులకు సీపీఐ(ఎం) విజ్ఞప్తి
న్యూఢిల్లీ: ఎన్నార్సీని వ్యతిరేకించిన ముఖ్యమంత్రులు తమ రాష్ట్రాల్లో జాతీయ పౌర పట్టిక(ఎన్పీఆర్) ప్రక్రియను నిలిపివేయాలని సీపీఐ(ఎం) పొలిట్బ్యూరో విజ్ఞప్తి చేసింది. ఎన్పీఆర్ ప్రక్రియ కోసం రూ.8500 కోట్లు కేటాయిస్తూ కేంద్ర క్యాబినెట్ మంగళవారం నిర్ణయం తీసుకున్నదని పొలిట్బ్యూరో గుర్తు చేసింది. ఎన్పీఆర్ కోసం పౌరులు తమ తల్లిదండ్రుల పుట్టిన తేదీ, ప్రదేశంతోపాటు
అదనంగా 21 వివరాలు ఇవ్వాల్సి ఉంటుందని పొలిట్బ్యూరో తెలిపింది. ఇప్పుడు సేకరిస్తున్న డేటాలో చాలావరకు 2010 ఎన్పీఆర్ కోసం తీసుకోలేదని గుర్తు చేసింది. 1955 పౌరసత్వ సవరణ చట్టం కింద 2003, డిసెంబర్ 10న వాజ్పేయి ప్రభుత్వం ఎన్పీఆర్ కోసం నిబంధనలను రూపొందించింది. ఇప్పుడు చేపట్టే ఎన్పీఆర్ ప్రక్రియ ఎన్ఆర్సీని అమలులోకి తేవడంలో మొదటి దశ అని పొలిట్బ్యూరో పేర్కొన్నది. మోడీ ప్రభుత్వం అధికారం చేపట్టిన వెంటనే 2014, జులై 23న ఈ రెండింటికీ లింక్ చేసినట్టు తెలిపింది. దీనిపై రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు హౌంశాఖ సహాయ మంత్రి రాతపూర్వక వివరణ ఇచ్చారని పొలిట్బ్యూరో స్పష్టం చేసింది.
ఎన్పీఆర్ కింద సేకరించిన డేటా ఆధారంగా భారత జాతీయ పౌర రిజిస్టర్(ఎన్ఆర్ఐసీ)ను తయారు చేయాలని మోడీ ప్రభుత్వం నిర్ణయిం చిందని తెలిపింది. ఓవైపు ప్రధాని మోడీ అబద్ధాలు చెబుతుండగా, మరోవైపున ఎన్నార్సీకి ఎన్పీఆర్ పునాది అన్నది స్పష్టమవుతోందని పొలిట్బ్యూరో పేర్కొన్నది. ఇప్పటివరకూ కనీసం 12మంది ముఖ్యమంత్రులు తమ రాష్ట్రాల్లో ఎన్ఆర్సీని అమలు చేయమని తేల్చి చెప్పారు. కేరళ, బెంగాల్ ముఖ్యమంత్రులు తమ రాష్ట్రాల్లో ఎన్పీఆర్ను కూడా చేపట్టమని తెలిపారని పొలిట్బ్యూరో గుర్తు చేసింది.
(Courtesy: NT)