– విద్యాపరమైన వివక్ష , ప్రభుత్వాల నిర్లక్ష్యం
– కిస్లే సోషల్ రీసెర్చ్ కలెక్టివ్ పరిశోధనలో వెల్లడి
పుట్టి పెరిగిన గ్రామాలను విడిచి ఉపాధి వెతుక్కుంటూ సుదూర పట్టణాలకు వలస వెళ్లిన కుటుంబాలు దుర్భర పరిస్థితుల్లో జీవిస్తున్నట్టు ఓ పరిశోధనలో వెల్లడైంది. సొంత దేశంలోనే స్థానికేతరులుగా పరాయీకరణకు గురవుతున్న వలస
బతుకులపై ప్రత్యేక కథనం..
న్యూఢిల్లీ: వలస కుటుంబాల చిన్నారులు దేశంలోని పలు నగరాల్లో సామాజిక ఒంటరితనం, విద్యాపరమైన వివక్ష, అధికారుల నిర్లక్ష్యానికి గురవుతున్నారు. కిస్లే సోషల్ రీసెర్చ్ కలెక్టివ్ తమిళనాడు, ఢిల్లీ, డెహ్రాడూన్లలో నిర్వహించిన పరిశోధనలో వలస చిన్నారుల పట్ల సామాజిక చిన్నచూపుపై విస్తుగొలిపే విషయాలు వెల్లడయ్యాయి. ఈ సర్వే బృందం సభ్యులు కూడా దినసరి కూలీల కుటుంబాలకు చెందినవారు కావడంతో వారు చెబుతున్న బాధలు వింటూ కన్నీటి పర్యంతమయ్యారు.
ఈ ఏడాది ప్రారంభంలో వాయువ్య ఢిల్లీలోని నీలోతీ ప్రాంతంలో పాత వస్తువులు సేకరించేవారి(రాగ్పికర్స్) పిల్లలు, వలస కుటుంబాల చిన్నారులను పరిశోధకులు ఇంటర్వ్యూ చేశారు.
రాగ్పికర్స్ చిన్నారులు పాత వస్తువుల చెత్త కుప్పల మీదే కాలం వెళ్లదీయడం కనిపించింది. అన్న,పానీయాలు కూడా అక్కడే. వారికి రక్షణగా తల్లిదండ్రులు కూడా లేని దుస్థితి. కుటుంబంలోని పెద్ద పిల్లలు చిన్నారులకు రక్షణగా ఉంటున్నారు. కనీస వసతులులేని మురికివాడల్లో ఇండ్లు అద్దెకు తీసుకొని జీవిస్తున్నారు. స్నానాల గదులు, టాయిలెట్లు కూడా లేని ఇరుకు గదులు. ఒక్కో గదికి రూ.1500 నుంచి రూ.2000 వరకూ అద్దె చెల్లిస్తున్నారు.
వారి నివాసాలకు సమీపంలో జరుగుతున్న నిర్మాణ పనుల్లో 14 ఏండ్ల బాలిక కూలీగా పని చేయడాన్ని పరిశోధకులు చూశారు. కొన్నిరోజుల తర్వాత పరిశోధకుల బృందం వెళ్లి చూస్తే ఆ బాలిక కనిపించలేదు. ఏమైందని ఆరా తీస్తే ఆ బాలికపై కొందరు లైంగిక దాడికి పాల్పడ్డట్టు తెలిపారు. దానిపై పోలీసులకు ఫిర్యాదు చేయకుండా కాంట్రాక్టర్ అడ్డుకున్నారు. మైనర్ బాలికతో పని చేయించినందుకు ఇరుక్కుంటానన్న ఆలోచనతో ఆ కుటుంబాన్నే వారి సొంతూరికి పంపించాడు.
ఈ ఏడాది వేసవిలో తమిళనాడు, ఢిల్లీ, ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్లో 329మంది వలస చిన్నారులను పరిశోధకులు ఇంటర్వ్యూ చేశారు. వీరంతా రోజు కూలీలు, కాజువల్ కార్మికుల పిల్లలు. అయితే, డెహ్రాడూన్లోని కుటుంబాల్లో ఎక్కువభాగం సుదీర్ఘంగా నివాసాలేర్పర్చుకొని ఉంటున్నవారే. డెహ్రాడూన్ మినహాయించి మిగతా చోట్ల చిన్నారులంతా చెత్త కుప్పల పక్కన ఖాళీ ప్రాంతాల్లో ఆడుకుంటున్నారు.
ఢిల్లీలోని 38 శాతంమంది బాలికలు మాత్రం తాము బయటకు రావడంలేదని చెప్పారు. ఢిల్లీలో మహిళలపై లైంగిక దాడుల భయం వారిని అలా కట్టడి చేసింది. పబ్లిక్ పార్కులు, ఆట స్థలాల్లోకి స్థానికులు తమను అనుమతించడంలేదని 40 శాతం మంది తెలిపారు.
స్థానికుల చిన్నారులతో ఆడుకునేందుకు కూడా అనుమతించడంలేదని 70 శాతంమంది తెలిపారు. ఢిల్లీ, తమిళనాడులాంటి చోట్ల 85శాతం, 87 శాతంగా ఈ పరిస్థితి ఉన్నట్టు తెలిపారు. ఢిల్లీలోని 50 శాతం చిన్నారులు తమపై స్థానికులు దాడులకు పాల్పడ్డట్టు తెలిపారు.
మరోవైపు ఈ చిన్నారుల పట్ల అధికారుల నిర్లక్ష్యం, విద్యా సంస్థల్లో వివక్షను పరిశోధకులు గుర్తించారు. తమిళనాడులో వలస చిన్నారుల కోసం ప్రత్యేకంగా హిందీ మీడియం పాఠశాలలు ఏర్పాటు చేశారు. వాటిలో ఉపాధ్యాయులు చెప్పే పాఠాలు భాషాపరమైన సమస్యల వల్ల తమకు అర్థం కావడంలేదని 50 నుంచి 75 శాతంమంది చిన్నారులు తెలిపారు. ఢిల్లీలో ఉపాధ్యాయులు తమ పట్ల శ్రద్ధ చూపడంలేదని 61.5 శాతం చిన్నారులు తెలిపారు.
మొత్తంగా వలస కుటుంబాలు దుర్భరమైన జీవితాలను గడుపుతున్నట్టు తేలింది. మూడు ప్రాంతాల్లోనూ ఈ కుటుంబాలకు కనీస వసతులు లేవని స్పష్టమైంది. ఆరోగ్య రక్షణ లేదని 80 శాతంమంది తెలిపారు. వైద్యం కోసం భారీగా ఖర్చు చేయాల్సి వస్తోందని తెలిపారు. డెహ్రాడూన్లో దాదాపు సగం చిన్నారులు అక్కడే జన్మించినవారు.
అయితే, వీరిలోనూ 25 శాతంమంది తమపై స్థానికులు దాడులకు పాల్పడుతున్నట్టు తెలిపారు. తమిళనాడులో హింసాత్మక దాడుల గురించి ఎవరూ ప్రస్తావించలేదు. కారణం, వారి నివాసాలన్నీ పోలీసుల పహారా కింద ఉండటం. పాఠశాలల్లో ఉపాధ్యాయులు మాత్రం తమ పట్ల వివక్ష చూపుతున్నట్టు చిన్నారులు తెలిపారు. తమిళనాడులో వీరి కోసం ఏర్పాటైన పాఠశాలల నిర్వహణలో అశ్రద్ధ కనిపిస్తోంది. ఢిల్లీలో మౌలిక వసతులు బాగున్నా.. వివక్ష, హింస, అవమానాలను ఎదుర్కొంటున్నారు. పేదరికం వల్ల, స్థిరమైన జీవనోపాధి లేనందునే సుదూర ప్రాంతాలకు వలస వెళ్తున్న దుస్థితి. అలాంటి వారిపై అమానవీయ దాడులు జరిగినా స్థానికులు పట్టించుకునే సందర్భాలు అరుదు. ప్రభుత్వమే వలస కుటుంబాల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని పరిశోధకులు సూచించారు.
(Courtesy: NT)