విశాఖపట్నం: సభ్యసమాజం తలదించుకునేలా తూర్పుగోదావరి జిల్లా మండపేటలో దళిత విద్యార్థినిపై మార్చి 3న సామూహిక లైంగిదాడికి పాల్పడిన దుర్మార్గులను కఠినంగా శిక్షించాలని ఆలిండియా దళిత్ రైట్స్ ఫెడరేషన్ (ఏఐడీఆర్ఎఫ్) డిమాండ్ చేసింది. ఆధిపత్య కులదురంహకారంతో దళిత యువతిపై ఆఘాయిత్యానికి ఒడిగట్టిన నిందితులు వల్లూరి మురళీకృష్ణ(55), సుంకర సత్యనారాయణ(వెంకన్న), మొలకల వీరబాబు (చిన్నా), చామంతి మధులను చట్టప్రకారం కఠిన శిక్షలు విధించాలని ఏఐడీఆర్ఎఫ్ జాతీయ అధ్యక్షుడు కందుల ఆనందరావు డిమాండ్ చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇలాంటి ఘోరాలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు.
దిశ చట్టం లాంటివి ఎన్ని చేసినా మహిళలపై ఆగడాలు ఆగడం లేదని దళిత సేన రాష్ట్ర అధ్యక్షుడు పాల్తేటి పెంటారావు ఆవేదన వ్యక్తం చేశారు. దళిత యువతిపై సామూహిక లైంగిక ఘటనను ఆయన తీవ్రంగా ఖండించారు. చట్టాలను సక్రమంగా అమలు చేయకపోవడం వల్ల నేరస్తులకు ఎలాంటి భయం కలగడం లేదని అన్నారు. దళిత సేన రాష్ట్ర ఉపాధ్యక్షుడు గొల్ల మాల అప్పారావు మాట్లాడుతూ, దళిత యువతిపై సామూహిక అత్యాచారం చేసిన నలుగురు మృగాలను వెంటనే ఎన్కౌంటర్ చేయాలని డిమాండ్ చేశారు. దళిత మహిళలపై ఇటువంటి ఘోరాలు అధికమవుతున్నా ప్రధాన మీడియా స్పందించకపోవడం బాధాకరమన్నారు. ఈ సమాజంలో దళిత మహిళల ప్రాణాలకు ఏమాత్రం విలువ లేదా అంటూ ఆవేదనగా ప్రశ్నించారు.
నిందితులను పట్టుకున్నాం
దళిత విద్యార్థినిపై లైంగికదాడి ఘటనలో నలుగురు నిందితులను అరెస్గ్ చేసినట్టు తూర్పుగోదావరి జిల్లా డీఎస్పీ రాజగోపాలరెడ్డి తెలిపారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితులపై నిర్భయ, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు మండపేట పోలీసులు నమోదు చేసినట్టు వెల్లడించారు. నిందితులను కాపాడాలని చూస్తే సహించబోమని మాజీ ఎంపీ హర్షకుమార్ హెచ్చరించారు. నిందితులను చంపేయాలని బాధితురాలు తనతో చెప్పిందన్నారు.