- సెప్టెంబరు లోపు నిర్వహించాలి
- యూజీసీ కమిటీ సవరణ మార్గదర్శకాల జారీ
దిల్లీ, హైదరాబాద్: వివిధ కోర్సుల్లో చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు ఆఖరి సెమిస్టర్ పరీక్షలను సెప్టెంబరులోపు జరపాలని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆదేశించింది. గతంలో ఆ పరీక్షలను జులైలో నిర్వహించాలని సూచించిన యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ).. తాజాగా వాటిని సెప్టెంబరులో జరపాలని చేసిన సూచనలతో ఈ నిర్ణయం తీసుకుంది. తుది పరీక్షలు నిర్వహించడం తప్పనిసరి అని యూజీసీ పేర్కొంది. దీంతో ఆఖరి సెమిస్టర్ పరీక్షల నిర్వహణ విషయంలో కొనసాగుతున్న ప్రతిష్టంభనకు తెరపడింది. కరోనాపై తాజా పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని పరీక్షల నిర్వహణకు సంబంధించి మార్గదర్శకాల్లో సవరణలు చేయాలని ఇటీవలే కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి రమేష్ పొఖ్రియాల్ యూజీసీకి సూచించిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో.. సోమవారం ప్రత్యేకంగా భేటీ అయిన కమిషన్ సవరించిన మార్గదర్శకాలను విడుదల చేసింది. దీని ప్రకారం రాష్ట్రాలు ఇక తప్పనిసరిగా పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుంది.
వాటిలోని ముఖ్యాంశాలు ఇవీ…
* చివరి సెమిస్టర్ విద్యార్థులకు సెప్టెంబరు పూర్తయ్యేలోపు విశ్వవిద్యాలయాలు పరీక్షలు నిర్వహించాలి. ఆఫ్లైన్, ఆన్లైన్ పద్ధతుల్లో లేదా రెండింటి కలయికగా పరీక్షలు జరుపుకోవచ్చు. బ్యాక్లాగ్ సబ్జెక్టులు ఉంటే పరీక్షలు నిర్వహించాలి. వాటిని కూడా పైవిధానంలో జరపాలి.
* ఒకవేళ సెప్టెంబరులో పరీక్షలకు, ఏదైనా ఒక సబ్జెక్టు పరీక్షకు హాజరుకాలేని విద్యార్థులకు మరోసారి ప్రత్యేకంగా పరీక్షలు నిర్వహించాలి. ఇది 2019-20 విద్యార్థులకు ఈ ఒక్కసారి మాత్రమే అవకాశం ఇవ్వాలి.
* మిగిలిన సెమిస్టర్ల వారికి గత ఏప్రిల్లో సూచించినట్లుగా అంతర్గత పరీక్షలు, గత సెమిస్టర్ పరీక్షల మార్కులను పరిగణనలోకి తీసుకొని గ్రేడ్లు ఇచ్చుకోవచ్చు.
Courtesy Eenadu