– జేఎన్యూటీఏ, జేఎన్యూఎస్యూ డిమాండ్
– విద్యార్థులపై ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు
– న్యూఢిల్లీ బ్యూరో
జేఎన్యూ వీసీ తక్షణమే రాజీనామా చేయాలని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ (జేఎన్యూటీఏ), జవహర్లాల్ నెహ్రూ యూనివర్శిటీ స్టూడెంట్ యూనియన్ (జేఎన్యూఎస్యూ)లు డిమాండ్ చేశాయి. విద్యార్థులపై ఢిల్లీ పోలీసులు జరిపిన లాఠీచార్జ్ను ఖండిస్తూ జేఎన్యూటీఏ మంగళవారం ఆందోళన చేపట్టిం ది. ఈ ఆందోళనలో ప్రొఫెసర్లు, విద్యార్థులు పాల్గొన్నారు. వీసీకి వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ”జేఎన్యూ వీసీ తప్పనిసరిగా వెళ్లిపోండి” పేరుతో జరిగిన ప్రదర్శనలో తొలుత ప్రొఫెసర్లు, విద్యార్థులు పాల్గొన్నారు. అనంతరం గంగాదాబా వద్ద నిరసన కార్యక్రమం చేశారు. ఈ సందర్భంగా జేఎన్యూటీఏ అధ్యక్ష, కార్యదర్శులు డీకే లోబియల్, సుర్జీత్ మంజుందర్ మాట్లాడుతూ జేఎన్యూ వీసీ వైఫల్యం చెందారని ప్రభుత్వం అంగీకరించిందని తెలిపారు. విద్యార్థులపైనా, ప్రొఫెసర్లపైనా అతి క్రూరంగా పోలీసులు చేసిన దాడిని జేఎన్యూటీఏ ఖండిస్తోందని అన్నారు. విద్యార్థులు తమ సమస్యలపై ఆందోళన చేస్తున్నప్పుడు వారితో చర్చించాల్సింది పోయి, వారిని పోలీసులతో నియంత్రించాలనుకోవడం అనాలోచిత చర్య అని విమర్శించారు. ఇప్పటికైనా జేఎన్యూ ప్రతిష్టను కాపాడాలని సూచించారు. తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించలేని వర్శిటీ వైస్ఛాన్స్లర్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
ఫీజుల పెంపును వెనక్కి తీసుకోవాలి: ఐషీ ఘోష్, జేఎన్యూఎస్యూ, ప్రెసిడెంట్
యాజమాన్యం పెంచిన ఫీజులన్నీ వెనక్కి తీసుకోవాలని జేఎన్యూఎస్యూ అధ్యక్షురాలు ఐషీఘోష్ డిమాండ్ చేశా రు. మంగళవారం యూనివర్సిటీలోని ఫ్రీడమ్ స్క్యేర్ వద్ద జేఎన్యూఎస్యూ నేతలు విలేకరుల సమావేశం నిర్వహిం చారు. సోమవారం ఘటనలో తీవ్రంగా గాయపడిన విద్యార్థులను మీడియాకు ముందుకు తెచ్చారు. ఐషీ ఘోష్ మాట్లాడుతూ తాము 23 రోజులుగా ఆందోళన చేపడుతు న్నామనీ, కానీ యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ చర్చలకు రాలేదని విమర్శించారు. జేఎన్యూ విద్యార్థులను అతి క్రూరంగా ఢిల్లీ పోలీసులు కొట్టారని, విద్యార్థినీలను మగ పోలీసులు దాడి చేశారని మండిపడ్డారు. అరెస్టు చేసిన విద్యార్థులను నేరుగా స్టేషన్కు తీసుకెళ్లలేదనీ, రెండు గంటల సేపు బయట తిప్పారని చెప్పారు. ఫీజుల పెంపును పూర్తిస్థాయిలో వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. వీసీ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థు లపై దాడి చేసిన పోలీసులను ప్రశ్నించాల్సిన మీడియా, విద్యార్థులను ప్రశ్నిస్తుందని, ఇది ఎంతవరకు సమంజస మ ని ఎద్దేవాచేశారు. గాయపడిన విద్యార్థుల్లో ఒకరు మాట్లా డుతూ ”నన్ను ఢిల్లీ పోలీసులు బారికేడ్లపైకి విసి రారు. లైట్లు ఆపివేసిన తరువాత విద్యార్థులను కొట్టారు. నా నడుము, చేయి, వేళ్లు తీవ్రంగా గాయపడ్డాయి” అని అన్నారు.
వికలాంగ విద్యార్థులపై పోలీసుల అమానుషం
వికలాంగ విద్యార్థులను సైతం కొట్టారని జేఎన్యూ విజువల్లీ చాలెంజ్డ్ స్టూడెంట్ ఫోరం విమర్శించింది. ఢిల్లీ పోలీసులు వికలాంగ విద్యార్థులను కూడా తీవ్రంగా కొట్టారని జేఎన్యూఎస్యూ కౌన్సిలర్ శశిభూషన్ పాండ్య చెప్పారు. పోలీసులు అమానవీయంగా కొట్టారని తెలిపాడు. తాను ఢిల్లీ పోలీసుల వద్దకు అంధ విద్యార్థిని తీసుకెళ్తే, దానికి పోలీసులు మీరు అంధులైతే నిరసనకు ఎందుకు వచ్చారని దౌర్జన్యం చేసినట్టు శశిభూషన్ తెలిపారు. ఆ అంధ విద్యార్థి ఛాతి, కడుపు పైన తన్ని, రోడ్డుపై ఈడ్చి పడేశారు.
విద్యార్థులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు
ఆందోళన చేసిన విద్యార్థులపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్ 186, 353, 332, 188, 147, 148, 149, 151, 34 కింద కేసుతో పాటు ప్రజా ఆస్తి నష్టానికి సంబంధించిన కేసు నమోదు చేశారు. అలాగే సోమవారం విద్యార్థుల ఆందోళనపై కృష్ణ ఘర్ పోలీస్ స్టేషన్లో 186, 353 సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. విద్యార్థులను కొట్టి మళ్లీ విద్యార్థులపైనే కేసు నమోదుచేయడం పట్ల తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. అసలు ప్రజా ఆస్తి నష్టం ఎక్కడ వాటెళ్లిందో పోలీ సులు చెప్పలేదు. రోడ్డు మీద ఆందోళన చేస్తే ప్రజా ఆస్తికి నష్టం ఎలా కలుగుతుందని జేఎన్యూఎస్యూ నేతలు ప్రశ్నిస్తున్నారు. ప్రజాస్వామ్య దేశంలో ప్రజాస్వామ్య యుతం గా ఆందోళన చేస్తే కేసులు నమోదు చేయడమా? అని ప్రశ్నించారు.
ట్విట్టర్లో ”టాక్స్పేయర్స్ విత్ జేఎన్యూ” అత్యధిక ట్రెండింగ్
జేఎన్యూ విద్యార్థుల పోరాటానికి ట్విట్టర్ వేదికగా అపూర్వ మద్దతు లభించింది. మంగళవారం ”టాక్స్పేయర్స్ విత్ జేఎన్యూ” యాస్ ట్యాగ్ అత్యధిక ట్రెండింగ్ అయింది. నేను టాక్స్ చెల్లిస్తున్నా. నా టాక్స్ డబ్బులు జేఎన్యూలో విద్యకు, పరిశోధన వంటి వాటికి ఖర్చు చేయాలని నేను కోరుకుంటున్నాను. నా పన్ను డబ్బు ప్రజారోగ్యం, రోడ్లు, రవాణా కోసం ఖర్చు చేయాలని నేను కోరుకుంటున్నాను” వంటి ట్విట్లతో టాక్స్పేయర్స్ విత్ జేఎన్యూ యాస్ ట్యాగ్తో ట్రెండింగ్ జరిగింది.
దాడి అమానుషం:ఐద్వా, సీపీఐ(ఎం) ఢిల్లీ రాష్ట్ర కమిటీ ఖండన
జేఎన్యూ విద్యార్థులపై పోలీసుల లాఠీచార్జిని, ఐద్వా, సీపీఐ(ఎం) ఢిల్లీ రాష్ట్ర కమిటీ, వికలాంగుల హక్కుల జాతీయ సంస్థ(ఎన్పీఆర్డీ) తీవ్రంగా ఖండించాయి. ఫీజుల పెంపును వెనక్కి తీసుకోవా లని, యూనివర్సిటీలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితికి కారణమైన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి. ఎం.జగదీశ్కుమార్లాంటి వ్యక్తికి యూనివర్సిటీకి వీసీగా కొనసాగే హక్కు లేదని స్పష్టం చేశాయి. గత మూడు నెలలుగా జేఎన్యూ విద్యార్థులు జరుపుతున్న ఆందోళనపై యూనివర్సిటీ పాలకవర్గం, బీజేపీ-ఆర్ఎస్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తున్నాయని విమర్శించాయి. అందరికీ విద్యను డిమాండ్ చేస్తూ ప్రజాస్వామికంగా ఆందోళనకు దిగిన విద్యార్థులపైకి పెద్దఎత్తున పోలీసులను దించడం చూస్తే కేంద్ర ప్రభుత్వం ఎంతగా భయపడుతున్నదో అర్థమవుతున్నదనీ, ఓ అంధ విద్యార్థి తన పరిస్థితి విన్నవించినా వినకుండా పోలీసులు ఆయనపై లాఠీలు జులిపించారు. దీనిపై ఢిల్లీ పోలీసులు బేషరతుగా క్షమాపణ చెప్పాలని ఐద్వా డిమాండ్ చేసింది. ఆందోళన సందర్భంగా వేధింపులకు గురైన విద్యార్థినులు ముందుకు వచ్చి ఫిర్యాదు చేస్తే వారికి అండగా ఉంటామని ఐద్వా తెలిపింది.
Courtesy NavaTelnagana…