- తల్లిదండ్రులు కూలీలైతే పిల్లల పరిస్థితి ఏంటి?..
- గిరిజన ప్రాంతాల్లో పేదల గురించి ఆలోచించారా?
- ఆన్లైన్ చదువుపై సర్కారును నిలదీసిన హైకోర్టు
హైదరాబాద్, ఆగస్టు 27 : దూరదర్శన్/టీశాట్ ద్వారా పాఠ్యాంశాలు బోధిస్తే విద్యార్థులకు వచ్చే సందేహాలు ఏవిధంగా నివృత్తి చేయగలరని హైకోర్టు ధర్మాసనం ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ‘‘గణితంలో విద్యార్థికి సందేహం కలిగితే, టీవీని అడిగి తీర్చుకోగలడా?’’ అని నిలదీసింది. తల్లిదండ్రులు ఇద్దరూ వ్యవసాయ కూలీలు అయితే విద్యార్థులకు వచ్చే సందేహాలు ఎలా తీర్చగలరని నిలదీసింది. ఆన్లైన్ తరగతులు నిర్వహిస్తూ టర్మ్ ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ దాఖలైన పలు వ్యాజ్యాలను సీజే రాఘవేంద్రసింగ్ చౌహాన్ నేతృత్వంలోని ధర్మాసనం గురువారం మరోసారి విచారించింది. ప్రభుత్వం తరఫున స్పెషల్ జీపీ సంజీవ్కుమార్ వాదనలు వినిపిస్తూ.. సెప్టెంబరు 1 నుంచి ఆన్లైన్ క్లాసులు నిర్వహించాలని ప్రభుత్వం తలపెట్టిందన్నారు.
ప్రభుత్వ పాఠశాలలో ఎల్కేజీ, యూకేజీ ఉండవని, 1-5 తరగతుల విద్యార్థులకు వారంలో మూడు రోజులు రోజుకు 30-45 నిమిషాలపాటు, 6-8 తరగతుల విద్యార్థులకు వారానికి ఐదురోజులపాటు రోజుకు రెండున్నర గంటలు, 9-12 తరగతుల పిల్లలకు రోజుకు 3 గంటలు చొప్పున టీశాట్ ద్వారా పాఠ్యాంశాలు బోధిస్తారని, లెవల్-1, లెవల్-2 కింద స్మార్ట్ఫోన్, ల్యాప్ట్యాప్ ద్వారా పాఠ్యాంశాలు బోధిస్తున్నట్లు తెలిపారు. అయితే ఉపాధ్యాయులతో విద్యార్థులకు మాట్లాడే అవకాశం ఉండదన్నారు. ఇంటరాక్షన్ సెషన్ లేనప్పుడు విద్యార్థులకు వచ్చే సందేహాలు ఎలా నివృత్తి అవుతాయని ధర్మాసనం ప్రశ్నించింది. సందేహాలు నివృత్తి చేయడానికి స్థానిక ఉపాధ్యాయులు అందుబాటులో ఉంటారని స్పెషల్ జీపీ వివరించారు.
గురువుకు సేవలు చేశా: సీజే
ఈ వాదనలపై స్పందించిన సీజే.. మీరు ఏ స్కూల్లో చదువుకున్నారని స్పెషల్ జీపీని అడిగారు. ప్రభుత్వ పాఠశాలలో చదివినట్లు ఆయన బదులిచ్చారు. సీజే మాట్లాడుతూ.. ‘‘నేను రాజస్థాన్లో చదివాను. సందేహ నివృత్తి కోసం మా గురువు ఇంటికి వెళ్ళి గురుదక్షిణగా ఆమ్లెట్ వేయడం, మార్కెట్ నుంచి చికెన్ తెచ్చి ఇవ్వడం వంటి పనులు చేశాను’’ అని వ్యాఖ్యానించారు. ‘‘గిరిజన ప్రాంతాల్లోని విద్యార్థుల పరిస్థితేంటి? ఎంతమందికి స్మార్ట్ఫోన్లు, టీవీలు అందుబాటులో ఉంటాయి’’ అని సీజే ప్రశ్నించారు. ఆన్లైన్లో పాఠ్యాంశాలు బోధించే సమయంలో విద్యుత్ కోతలు ఉండకుండా ట్రాన్స్కోతో సంప్రదించి చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్జీపీ చెప్పారు. పలు కాలనీలలో ప్రభుత్వ పాఠశాలలే లేని దృష్ట్యా ఈ సమస్యకు పరిష్కారం ఏమిటని సీజే ప్రశ్నించారు.
అవకాశాలు లేని విద్యార్థులకు అవకాశం ఉన్న విద్యార్థులతో జతచేసి(పెయిరింగ్) అభ్యాసం చేయడానికి చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్జీపీ చెప్పారు.దీనిపై జస్టిస్ విజయ్సేన్రెడ్డి కల్పించుకుంటూ.. తరగతిలోని విద్యార్థుల్లో మూడో వంతు మందికి రోజు విడిచి రోజు సామాజిక దూరం పాటిస్తూ భౌతికంగా తరగతులు ఎందుకు నిర్వహించరాదని ప్రశ్నించారు. కోర్టు ఆదేశిస్తే ఆ విధంగా చేస్తామని ఎస్జీపీ చెప్పారు. తాము అలాంటి ఆదేశాలు ఇవ్వలేమని, ప్రభుత్వ నిర్ణయాల్లో తాము జోక్యం చేసుకోబోమని, అయితే సలహాపూర్వకంగా మాత్రమే చెబుతున్నామని సీజే అన్నారు.
విద్యార్థులను ఖాళీగా ఉంచరాదు
9-12 తరగతుల విద్యార్థులకు సిలబస్ తగ్గించినట్లు సీబీఎ్సఈ తరఫు న్యాయవాది ఛాయాదేవి కోర్టుకు తెలిపారు. 1-8 తరగతుల విద్యార్థులు ఇంటివద్ద ఖాళీగా కూర్చోనివ్వడం కంటే ఏదో ఒకటి నేర్పించడం మంచిదన్నారు. ఈ దశలో కల్పించుకున్న సీజే.. పేరెంట్స్ అసోసియేషన్లతో సంప్రదించారా? అని ప్రశ్నించారు. ‘‘ఆన్లైన్ తరగతులు జరుగుతున్నప్పుడు పిల్లలను కుదురుగా ఉంచడం సాధ్యం కాదు. 1-5, 6-8, 9-12 తరగతులకు ఏకకాలంలో పాఠ్యాంశాలు బోధిస్తే ఎలా సాధ్యం అవుతుంది’’ అని ప్రశ్నించారు.
జీవోని ఖాతరు చేయని ప్రైౖవేటు పాఠశాలలు
టర్మ్ ఫీజులకు సంబంధించి ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ ప్రైవేటు పాఠశాలలు ఖాతరు చేయడం లేదని పిటిషనర్ తరఫు న్యాయవాది అన్నారు. పిల్ విచారణ పూర్తయ్యేవరకు విద్యార్థుల అడ్మిషన్లు రద్దు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఈ వాదనలపై కల్పించుకున్న సీజే.. జీవోను ఉల్లంఘించిన పాఠశాలలపై ఏం చర్యలు తీసుకున్నారని స్పెషల్ జీపీని ప్రశ్నించారు. వాస్తవిక వివరాలతో నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. అదేవిధంగా విద్యార్థుల తల్లిదండ్రులపై ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేయాల్సి వచ్చిందో చెప్పాలని, పూర్తి వివరాలను సెప్టెంబరు 17లోగా కోర్టు ముందుంచాలని ధర్మాసనం స్పష్టం చేసింది.
Courtesy Andhrajyothi