విశాఖపట్నం: నర్సీపట్నంలో దళిత యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. అగ్ర కులానికి చెందిన అమ్మాయిని ప్రేమించాడన్న కారణంతో దళిత యువకుడిని కిరాతంగా హత్య చేశారు. దుప్పటిలో చుట్టి పడేసిన యువకుడి మృతదేహాన్ని నర్సీపట్నం పెద్ద చెరువులో సోమవారం సాయంత్రం గుర్తించారు. మృతుడిని నర్సీపట్నంకు చెందిన గారా కిశోర్గా గుర్తించారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని ఏరియా ఆసుపత్రికి తరలించారు.
కిశోర్ను పోలీసులే చంపి చెరువులో పడేశారని మృతుడి బంధువులు ఆరోపిస్తున్నారు. ఓ హోంగార్డ్ కుమార్తెను కిశోర్ ప్రేమించాడని, ఆ వ్యవహారంలోనే అతడిని చంపేశారని వాపోతున్నారు. కొట్టి చంపిన తర్వాత చెరువులో పడేశారని అంటున్నారు. కిశోర్ మరణానికి కారకులైనవారిని శిక్షించాలని డిమాండ్ చేస్తూ దళితులు మంగళవారం నర్సీపట్నం పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టారు. రోడ్డుపైనే బైఠాయించి నిరసన తెలిపారు. కిశోర్ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కాగా, ఘటనపై పట్టణ సీఐ స్వామినాయుడు మాట్లాడుతూ కిశోర్ తల్లిదండ్రులు ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.