- పూర్తిస్థాయిలో మంజూరవని బోధన రుసుం
- రూ.వెయ్యి కోట్లు దాటిన బకాయిలు
- మంజూరైన వాటికి నిలిచిన చెల్లింపులు
రాష్ట్రంలో వివిధ కోర్సులు చేస్తున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ విద్యార్థులందరికీ ఈ విద్యాసంవత్సరాని(2019-20)కి సంబంధించి బోధన రుసుం, ఉపకారవేతనాలు ఇంకా మంజూరు కాలేదు. దీంతో విద్యార్థుల చదువులు భారంగా మారాయి. కరోనా కారణంగా ఇప్పటికే కుటుంబపెద్దల ఉపాధిపై తీవ్ర ప్రభావం పడింది. ఈ నేపథ్యంలో బోధన రుసుం, ఉపకారవేతనాలు మంజూరవకపోవడంతో పరిస్థితి గోరుచుట్టుపై రోకలిపోటులా మారిందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణలో గత విద్యాసంవత్సరాల్లో పలు కోర్సులు చదివిన వారిలో సగం మందికి బోధన రుసుం మంజూరు కాలేదు. ప్రస్తుత విద్యాసంవత్సరమూ అదే పరిస్థితి నెలకొని బకాయిలు భారీగా పెరిగాయి. కొందరు విద్యార్థులకు బోధన రుసుం, ఉపకారవేతనాలు మంజూరైనా అవి చేతికందని పరిస్థితి తలెత్తింది. సంక్షేమ శాఖలు ఆ విద్యార్థులకు సంబంధించిన దరఖాస్తులను పరిశీలించి చెల్లింపునకు టోకెన్లు మంజూరు చేశాయి. అయినా.. వివిధ కారణాలతో అవి ఖజానా కార్యాలయాల్లోనే నిలిచిపోయాయి. 2019-20 విద్యాసంవత్సరానికి రాష్ట్రంలో 12.73 లక్షల మంది విద్యార్థులు బోధన రుసుం, ఉపకారవేతనాల కోసం దరఖాస్తు చేశారు. వీరికి ప్రభుత్వం రూ.1,988 కోట్లను మంజూరు చేయాల్సి ఉంది. ప్రభుత్వం మొత్తం డబ్బును మంజూరు చేయకపోవడంతో విద్యార్థులు చదువులకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
బకాయిలు విడుదల చేయాలి
– గౌరు సతీష్, తెలంగాణ ప్రైవేటు జూనియర్ కళాశాలల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు
ప్రభుత్వం 2019-20 విద్యాసంవత్సరానికి సంబంధించి ఇంతవరకు బోధన రుసుం మంజూరు చేయకపోవడంతో విద్యార్థులు కళాశాలల ఫీజులను చెల్లించడం లేదు. దీంతో మేం కళాశాలలో పనిచేసే అధ్యాపకులకు వేతనాలను చెల్లించని పరిస్థితి నెలకొంది.
Courtesy Eenadu