– బీహార్లో మళ్లీ పెరుగుతున్న బాలల అక్రమరవాణా
– అప్పుల ఊబిలో కూరుకుపోయిన తల్లిదండ్రులకు ఎర
– చూసీ చూడనట్టు వ్యవహరిస్తున్న పాలకులు.. పోలీసులు
పాట్నా : వెనుకబడిన రాష్ట్రాల్లో ముందువరుసలో ఉండే బీహార్లో బాలల అక్రమరవాణా మళ్లీ పెరిగిపో తున్నది. లాక్డౌన్ కాలంలో రవాణా సదుపాయాలు లేక మధ్యలో కొంతకాలం స్తబ్దుగా ఉన్న ఈ అక్రమ రవాణా.. అంతర్రాష్ట్రాల మధ్య రాకపోకలు మొదలవడంతో అడ్డూ అదుపులేకుండా సాగుతున్నది. గతనెల 19న, ఈనెల 7, 12 న బీహార్లోని పలు ప్రాంతాల్లో ఈ తరహా కార్యకలాపాలు సాగిస్తున్న పలు ముఠాల గుట్టును స్వచ్ఛంద సంస్థల సాయంతో పోలీసులు రట్టు చేశారు. ఒకవైపు పేదరికం.. మరోవైపు మహమ్మారి తీసుకొచ్చిన సంక్షోభంతో ఇప్పటికే ఆర్థికంగా చితికిపోయి ఉన్న తల్లిదండ్రులకు ఎరవేస్తూ.. వారి పిల్లలను రాజస్తాన్, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, ఢిల్లీలలో ఉన్న ఫ్యాక్టరీలలో పని చేయించుకోవడానికి ఎత్తుకెళ్తున్నారు. దీంతో బడిలో ఉండాల్సిన భవిష్యత్ భారతం.. ఫ్యాక్టరీలు, రోడ్లపై వెట్టిచాకిరి చేస్తున్నది. బీహార్లోని వరద ప్రభావిత ప్రాంతాలైన గయ, ఖటిహార్, ముంగర్, మధుబణి వంటి జిల్లాల్లోని వందలాది గ్రామాల్లో బాలల అక్రమరవాణా కార్యకలాపాలు యధేచ్ఛగా కొనసాగుతున్నాయి. గయ జిల్లాలోని పలు గ్రామాల్లో అయితే 12-18 ఏండ్ల లోపు బాల బాలికలను చూద్దామన్న కనబడటం లేదని బాలకార్మిక నిర్మూలనపై పనిచేస్తున్న కార్యకర్తలు చెబుతున్నారు. తీవ్ర దారిద్య్రంలో కొట్టుమిట్టాడుతున్న ఈ పిల్లల తల్లిదండ్రులు.. వీరిని నెలకు రూ. 2 నుంచి రూ. 3 వేలకు దళారులకు అప్పగిస్తున్నారు. ఈ దళారులు వీరిని గుజరాత్, ఢిల్లీ, మహారాష్ట్ర, కోల్కతా వంటి నగరాలకు తీసుకెళ్లి.. అక్కడ కర్మాగారాల్లో పనులకు పెడుతున్నారు.
ఫ్యాక్టరీలలోనే గాక రోడ్ల పక్కన ఉండే దుకాణాలు, టీ కొట్లు, తోపుడు బండ్లమీద అమ్మకాలకు వీరినే ఉంచుతారు. వీరిని తీసుకుపోవడానికి కూడా రాజస్తాన్, గుజరాత్, ఢిల్లీల నుంచి ప్రత్యేక బస్సు సర్వీసులు వస్తాయి. ఒక్కో బస్సుకు రూ. 2 లక్షల నుంచి రూ. 3 లక్షల దాకా వెచ్చించే దళారులు.. పిల్లల తల్లిదండ్రులకు నెలకు వేయి రూపాయల నుంచి రెండువేల దాకా ఇస్తారు.
నిరుపేదలైన తల్లిదండ్రులకు డబ్బులు ఆశజూపి వారి పిల్లలను వేరే రాష్ట్రాలకు తీసుకుపోతుంటారు. 12-14 ఏండ్లలోపు ఉన్న పిల్లలకు 18 ఏండ్లు పైబడి ఉన్నవారని నకిలీ ఆధార్ కార్డులు తయారుచేసి.. లేబర్ ఆఫీసర్లకు అనుమానం రాకుండా వారికి లంచాలు ముట్టజెప్పడంలో దళారులు ఆరితేరారు. బస్సుల్లోనే గాక రైళ్లలోనూ బాలల అక్రమరవాణా కొనసాగుతున్నది.
లాక్డౌన్ కు ముందు ఢిల్లీ నుంచి బీహార్కు నడిచే రైళ్లలో ఈ తరహా కార్యకలాపాలు ఎక్కువగా జరిగేవని బీహార్లో బాలల అక్రమరవాణా, బాల కార్మిక వ్యవస్థకు వ్యతిరేకంగా పనిచేస్తున్న సురేశ్ కుమార్ తెలిపారు. వలసకార్మికులు ఇంకా పూర్తి స్థాయిలో పట్టణాలకు చేరుకోకపోవడంతో ఫ్యాక్టరీలు, నిర్మాణ సంస్థల్లో కూలీల కొరత అధికంగా ఉన్న నేపథ్యంలో దళారులు బీహార్లోని బాలలపై కన్నేశారని ఆయన చెప్పారు. చిన్నారులను తీసుకెళ్లేవాళ్లు కూడా అదే ప్రాంతానికి చెందినవారనీ, బాధితుల తల్లిదండ్రుల పేదరికం కారణంగా వారిని వేరే ప్రాంతాలకు పంపిస్తుంటారని అన్నారు. ఇలా పిల్లలను తీసుకెళ్లేవారిని పోలీసులకు పట్టించినా ఉపయోగం ఉండదనీ.. వారు మళ్లీ రాజకీయ నాయకులు, అధికారుల అండతో బయటకు వచ్చి తిరిగి అవే పనులు చేస్తుంటారని సురేశ్ తెలిపారు.
తీవ్ర కరువు, అతివష్టి, భూకంపాలు, మానవసంక్షోభం వంటివి బీహార్లోని వెనుకబడిన, వరద ప్రభావిత ప్రాంతాల్లో నిత్యం కనిపిస్తుంటాయనీ, పాలకులు ఈ ప్రాంతాన్ని పదే పదే నిర్లక్ష్యం చేస్తుండటంతో పేదలు వారి పిల్లలను పనుల్లోకి పంపడమో, అమ్ముకోవడమో చేస్తున్నారని వివరించారు. ఇకనైనా దీనికి అడ్డుకట్ట వేయాలని ఆయన పాలకులను కోరారు.
Courtesy: NT