తిరువనంతపురం రీజియన్ టాప్
న్యూఢిల్లీ : సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) 12వ తరగతి పరీక్షా ఫలితాల్లో బాలికలు పైచేయి సాధించారు. ఈ ఏడాది విద్యార్థుల ఉత్తీర్ణత శాతం 88.78గా తన అధికారిక వెబ్సైట్లో ప్రకటించింది. గత ఏడాదితో పోలిస్తే 5.38 శాతం ఉత్తీర్ణత పెరిగినట్టు పేర్కొంది. బాలికలు 92.15 శాతం, బాలురు 86.19 శాతం ఉత్తీర్ణులైనట్టు వివరించింది. బాలుర కంటే బాలికలు 5.96 శాతం ఎక్కువగా ఉత్తీర్ణులయ్యారు. ట్రాన్స్ జెండర్ విద్యార్థులు 66.67 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. 38,686 మంది విద్యార్థులు 95 శాతం మార్కులు సాధించారని, 1,57,934 మంది 90 శాతం కంటే ఎక్కువ సాధించారని సీబీఎస్ఈ తెలిపింది.
జవహర్ నవోదయ విద్యాలయాలు (జేఎన్వీ), కేంద్రీయ విద్యాలయాలు వరుసగా 98.70, 98.62 శాతం ఉత్తీర్ణత సాధించినట్టు పేర్కొంది. తిరువనంతపురం రీజియన్ అత్యధికంగా 97.67 శాతం ఉత్తీర్ణత సాధించినట్టు తెలిపింది. ఆ తరువాత బెంగళూరు 97.05, చెన్నై 96.17 శాతం ఉత్తీర్ణత సాధించాయి. విద్యార్థులు తమ పరీక్షా ఫలితాలను ఆన్లైన్లో సీబీఎస్ఈ.ఎన్ఐసీ.ఇన్.లో చూడవచ్చని తెలిపింది. లేదా రోల్ నెంబర్తో వెబ్ పేజ్లోకి లాగిన్ కావాలని సూచించింది. మూడు సబ్జెక్టులలో పరీక్షలకు హాజరైన విద్యార్థులకు, రెండు సబ్జెక్టుల్లో వచ్చిన మార్కుల సగటును పరీక్షలు నిర్వహించని సబ్జెక్టులకు కేటాయిస్తామని తెలిపింది.
గతంలో నిర్వహించిన పరీక్షలు, ఇంటర్నల్ అసెస్మెంట్లో మార్కుల ఆధారంగా ఫలితాలను సిద్ధం చేస్తామని జూన్ 26న సీబీఎస్ఈ బోర్డ్ సుప్రీంకోర్టుకు తెలిపింది. పరిస్థితులు అనుకూలించిన అనంతరం ఫలితాలను మెరుగుపరుచుకునేందుకు 12వ తరగతి విద్యార్థులకు తిరిగి పరీక్షలకు హాజరయ్యేందుకు అవకాశమిస్తామని కూడా బోర్డు స్పష్టం చేసింది. ఫలితాలను జులై 13న విడుదల చేయనున్నట్టు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ (హెచ్ఆర్డీ) ప్రకటించిన సంగతి తెలిసిందే.
చరిత్ర చదువుతా: దివ్యాన్షి జైన్
ఢిల్లీ యూనివర్సిటీలో చరిత్ర చదవాలనుకుంటున్నట్టు టాపర్ దివ్యాన్షి జైన్ తెలిపింది. లక్నోకుచెందిన 18 ఏళ్ల దివ్యాన్షి వందకు వంద మార్కులతో టాపర్గా నిలిచింది. ఫస్ట్ ర్యాంక్ సాధిస్తానని అస్సలు ఊహించలేదని ఆనందాన్ని వ్యక్తం చేశారు. చరిత్ర గురించి లోతుగా అధ్యయం చేయాలను కుంటున్నట్టు చెప్పింది. తమ కూతురు వందశాతం మార్కులు సాధించడం గర్వంగా ఉందని ఆమె తల్లిదండ్రులు తెలిపారు.
Courtesy: NT