లఖ్నవూ, దిల్లీ: జాతీయ పౌర పట్టిక (ఎన్ఆర్సీ)పై ముస్లింలు అభద్రతకు లోనవుతున్న దృష్ట్యా ఆ ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలని భాజపా మిత్రపక్షమైన అకాలీదళ్ సూచించింది. తాము సహచర మైనారిటీల (ముస్లిం) అభద్రతను బాగా అర్థం చేసుకోగలమని పార్టీ నేత, రాజ్యసభ సభ్యుడు నరేష్ గుజ్రాల్ చెప్పారు. ముస్లిం శరణార్థులకూ పౌరసత్వం ఇవ్వాలని ఒక వార్తాసంస్థతో మాట్లాడుతూ చెప్పారు.
* పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా పశ్చిమ బెంగాల్, అసోం, మహారాష్ట్రల్లో నిరసనలు కొనసాగాయి. ఉత్తర్ప్రదేశ్లో అంతర్జాలంపై మళ్లీ నిషేధం విధించారు.
* సీఏఏ, ఎన్ఆర్సీ, ఎన్పీఆర్లపై జనవరి 1 నుంచి వారం రోజులపాటు దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వివిధ వామపక్షాల నేతలు సంయుక్త ప్రకటనలో తెలిపారు.
* ప్రాంతీయంగా దేశాల మధ్య భౌగోళిక, రాజకీయపరమైన భేదాలను పెంచేలా ఉన్న సీఏఏను ఉపసంహరించుకోవాలని దక్షిణాసియా దేశాలకు చెందిన 14 మంది ప్రముఖులు ఒక ప్రకటనలో కోరారు.
తప్పుదోవ పట్టిస్తున్న విపక్షం: అమిత్షా
సీఏఏపై విపక్షం ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తోందని, తద్వారా దిల్లీలో వాతావరణాన్ని కలుషితం చేస్తోందని కేంద్ర హోం మంత్రి అమిత్షా ఆరోపించారు. చీలిక పీలికలైన (టుకడే టుకడే) విపక్షాలను ఓడించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు.
(Courtesy Eenadu)