- ఆధ్యాత్మిక క్లాసులు, పెట్టుబడులంటూ వసూళ్లు
- గత డిసెంబరులో జైలుకు.. విడుదలైనా అదే దందా
- తాను చెబితే సమస్యలన్నీ మాయమని మోసం
- 2024లో దేశానికి తానే ప్రధానివుతానని డబ్బా
హైదరాబాద్ సిటీ, డిసెంబరు : జైల్లో చిప్పకూడు తిన్నా ఆ దొంగ బాబా బుద్ధి మారలేదు! ఆధ్యాత్మికత ముసుగేసుకొని అమాయకులైన భక్తులపై వల విసిరాడు! తనకు అమ్మవారు సాక్షాత్కరించిందంటూ తాను ఏది కోరుకుంటే అది నెరవేరేలా వరమిచ్చిందంటూ వారిని నిండా ముంచాడు. ఆధ్యాత్మిక క్లాసులంటూ ఫీజులు.. స్టార్ట్పల్లో పెట్టుబడి పెట్టండంటూ మునుపటి లాగే కోట్లలో వసూలు చేశాడు. గత డిసెంబరులో అరెస్టుకు ముందు ఒక్క ఏడాదిలో రూ.60కోట్లు దోచుకున్న బురిడీ బాబా ఈ ఏడాది ఇప్పటివరకు రూ.40కోట్లు కొల్లగొట్టాడు! ఈ రకంగా రెండేళ్లలోనే భక్తుల నుంచి రూ.100కోట్లు స్వాహా చేశాడు. ఏపీలోని నెల్లూరు జిల్లాకు చెందిన గిరీశ్ కుమార్ (34) దందా ఇదీ! బుధవారం ఎస్ఆర్ నగర్ పోలీసులు అతడిని అరెస్టు చేశారు. గిరీశ్ సింగ్ మాటకారి. అమాయకులను మోసగించేందుకు మాటే అతడి ఆయుధం! నిండా 35 ఏళ్లు లేకున్నా, చక్కగా ముచ్చట్లు చెప్పడంలో తల నెరిసిన వృద్ధులను మించిపోయాడు! చిన్నప్పుడేతల్లి చనిపోవడంతో సూళ్లూరుపేటలోని అమ్మమ్మ ఇంట్లో పెరిగాడు. ఇంటర్తో చదువు మానేశాడు. ఇంటిపక్కనే ‘బాలాత్రిపుర సుందరీదేవి’ ఆలయం ఉండటంతో అక్కడికి వెళ్లి ఆధ్యాత్మిక ప్రవచనాలు వినేవాడు.
ఆ జ్ఞానాన్నే మోసాలకు ఆధారం చేసుకున్నాడు. స్వామీజి అవతారం ఎత్తి తనకు బాలాత్రిపుర సుందరీదేవి దర్శనమిచ్చిందని, తాను అమ్మవారికి సమస్యలు చెబితే తీరుస్తుందని నమ్మించి డబ్బులు వసూలు చేసేవాడు. 2012లో మాదాపూర్లో ఏఎ్సఆర్సీ కేంద్రాన్ని స్థాపించాడు. అక్కడ భక్తులకు ఆధ్యాత్మిక ప్రవచనాల క్లాసులు చెప్పేవాడు. ఒక్కో క్లాస్కు వారి స్థాయిని బట్టి రూ. 10వేల నుంచి రూ. 2లక్షల దాకా వసూలు చేసేవాడు. తర్వాత భక్తుల సమస్యలను బట్టి వివిధ రకాల ఆధ్యాత్మిక తరగతులను కుబేర ప్రియ, అమృత ప్రక్రియ, కల్యాణ ప్రక్రియ, సంతాన ప్రక్రియగా విభజించాడు. వాటికిలక్షల్లో ఫీజు వసూలు చేసేవాడు. 2024లో దేశానికి తానే ప్రధానినవుతానని డబ్బా కొట్టుకునేవాడు. కొన్నాళ్లకు 30 స్టార్ట్పలను ప్రారంభించానని.. అందులో రూ.1100 నుంచి రూ.66వేల దాకా పెట్టుబడి పెట్టొచ్చని.. ఒకరు, నలుగురిని.. ఆ నలుగురు మరో నలుగురి చొప్పున చేర్చుకుంటూ వెళితే కోట్లలో కమిషన్ వస్తుందని నమ్మించాడు. భక్తుల నుంచి లక్షల్లో వసూలు చేశాడు. కొందరైతే రూ.2కోట్ల నుంచి రూ.4కోట్లదాకా పెట్టుబడి పెట్టారు. ఇలా గత ఏడాది భక్తుల నుంచి ఆన్లైన్ ద్వారానే రూ. 60 కోట్లు కొల్లగొట్టాడు. ఆ డబ్బునంతా 16 బ్యాంకుల్లో జమచేశాడు.
రోల్స్ రాయిస్, జాగ్వా కార్లు.. విదేశాల్లో జల్సా
గత ఏడాది డిసెంబరు 24న రాచకొండ పోలీసులకు చిక్కిన గిరీశ్ కటకటాలపాలయ్యాడు. తనకున్న డబ్బు, పలుకుబడితో ఇలా జైలుకు వెళ్లి.. అలా బెయిల్పై బయటకు వచ్చాడు. ఆ వెంటనే మళ్లీ తన దందాను ప్రారంభించాడు. గత ఏడాది రూ.60కోట్లు కొల్లగొట్టిన గిరీశ్.. ఈ ఏడాది రూ.40కోట్లు మూటగట్టుకున్నాడు. ఆ డబ్బుతో ఖరీదైన కార్లు కొనేవాడు. విదేశాల్లో జల్సాలు చేసేవాడు. రూ.2కోట్లతో రోల్స్ రాయిస్ పాథో, హ్యూమర్, జాగ్వార్ వంటి ఖరీదైన కార్లు కొనుగోలు చేసి, లగ్జరీ జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
(Courtesy Andhrajyothi)