యూఎ్ససీఐఆర్ఎఫ్ విమర్శలు తోసిపుచ్చిన భారత్
వాషింగ్టన్ : భారత్లో మైనారిటీలు దాడులకు గురవుతున్నారని అమెరికా అంతర్జాతీయ మతస్వేచ్ఛ కమిషన్ (యూఎ్ససీఐఆర్ఎఫ్) విమర్శించింది. పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) తర్వాత మైనారిటీల్లో ఆందోళన పెరిగిందని, ఆ తర్వాత పరిస్థితులు వేగంగా దిగజారిపోయాయని వ్యాఖ్యానించింది. భారత ప్రభు త్వం పార్లమెంట్లో తనకున్న మెజారిటీని వినియోగించుకుంటూ.. మత స్వేచ్ఛకు తిలోదకాలిస్తోందని, ప్రత్యేకించి ముస్లింలను లక్ష్యంగా చేసుకుంటోందని పేర్కొంది. ప్రత్యేక ఆందోళన దేశాల(సీపీసీ) జాబితాలో భారత్ను చేర్చింది. 2019-20లో జరిగిన పరిణామాలను దృష్టిలో పెట్టుకుని ఈ కమిషన్ 14 దేశాలను సీపీసీలో చేరుస్తూ మంగళవారం వార్షిక నివేదికను విడుదల చేసింది. సీపీసీ దేశాల్లో మయన్మార్, చైనా, ఎరిట్రియా, ఇరాన్, ఉత్తర కొరియా, పాకిస్థాన్, సౌదీ అరేబియా, తజికిస్థాన్, తుర్కమెనిస్థాన్, భారత్, నైజీరియా, రష్యా, సిరియా, వియత్నాం ఉన్నాయి. అమెరికా ఈ దేశాలపై ఆంక్షలు విధించాలని కమిషన్ ప్రతిపాదించింది.
ఈ ఏడాది ఫిబ్రవరిలో ఎన్నార్సీ, ఎన్పీఆర్కు వ్యతిరేకంగా ఢిల్లీలో జరిగిన అల్లర్లను కూడా తన నివేదికలో ప్రస్తావించింది. తొమ్మిది మంది సభ్యులతో కూడిన కమిషన్లో ఇద్దరు మాత్రం భారత్ను సీపీసీలో చేర్చడాన్ని వ్యతిరేకించారు. ‘‘భారత్ అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. ఆ దేశంలో సీఏఏకి వ్యతిరేకంగా ఆందోళనలు జరిగినా.. అణచివేతలు లేవు. పైగా.. కొన్ని రాష్ర్టాల ప్రభుత్వాలు, హక్కుల సంఘాలు మైనారిటీలకు అండగా నిలిచాయి. వంచక దేశాల సరసన భారత్ను చేర్చడం సరికాదు. చైనా, ఉత్తర కొరియా మాదిరిగా భారత్లో నియంతృత్వ పోకడలు లేవు’’ అని సభ్య కమిషనర్లు గ్యారీబౌర్ (అమెరికా), టెన్జిన్ దోర్జీ (టిబెట్) ఆ నివేదికలో అభిప్రాయపడ్డారు. కాగా.. 1998 లో పురుడుపోసుకున్న యూఎ్ససీఐఆర్ఎఫ్ సభ్యులకు భారత్ దాదాపు దశాబ్దానికిపైగా వీసాలు ఇవ్వలేదు. గతంలో కూడా భారత్ ఈ కమిషన్ను విమర్శించింది. సీఏఏ అనేది తమ అంతర్గత విషయమని తేల్చిచెప్పింది. కాగా.. గుజరాత్ ఆస్పత్రుల్లో కరోనా రోగుల చికిత్సలో ముస్లింలను వేరు చేస్తున్నారంటూ యూఎ్ససీఐఆర్ఎఫ్ ఇటీవల వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీనికి భారత్ గట్టి సమాధానం ఇచ్చింది. వెబ్సైట్లలో కథనాలను గుడ్డిగా నమ్మి వ్యాఖ్యలు చేయడం సరికాదని ఆ కమిషన్కు హితవు పలికింది. తాజా నివేదికను కూడా భారత్ తోసిపుచ్చింది.
Courtesy Andhrajyothi