- నేడు శాసనమండలికి బిల్లులు
- వ్యతిరేకించాలని తెదేపా నిర్ణయం
అమరావతి: పరిపాలన వికేంద్రీకరణ- మూడు రాజధానులు, సీఆర్డీఏ చట్టం రద్దు బిల్లులను రాష్ట్ర శాసనసభ మంగళవారం మరోసారి ఆమోదించింది. తెదేపా సభ్యులు బడ్జెట్ ప్రసంగాన్ని బహిష్కరించడంతో.. ఆ సమయానికి సభలో లేరు. గతంలోనూ ఈ బిల్లులను శాసనసభ ఆమోదించినా, మండలి వ్యతిరేకించింది. వాటిని సెలెక్ట్ కమిటీలకు పంపాలని కోరింది. నాటి గందరగోళం మధ్యే బిల్లుల్ని సెలెక్ట్ కమిటీకి పంపుతున్నట్లు మండలి ఛైర్మన్ ఎం.ఎ.షరీఫ్ ప్రకటించారు. ఇది కోర్టుకు కూడా వెళ్లింది. ఈ నేపథ్యంలో.. మళ్లీ అవే బిల్లుల్ని యథాతథంగా శాసనసభలో ప్రవేశపెట్టి, ఆమోదం పొందడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఆ బిల్లులు బుధవారం మండలికి వెళ్లనున్నాయి. మళ్లీ ఆ బిల్లుల్ని వ్యతిరేకించాలని తెదేపా నిర్ణయించింది. ఓటింగ్ జరుగుతుందని.. పార్టీ ఎమ్మెల్సీలకు విప్ జారీచేసింది.
పలు బిల్లులకు ఆమోదం
తెలంగాణతో సమానంగా మన రాష్ట్రంలోనూ పెట్రోల్, డీజిల్ ధరల్ని సవరించేందుకు వీలుగా ఏపీ వ్యాట్ సవరణ బిల్లు, పురపాలక, నగరపాలక సంస్థల్లో ఎన్నికల నిర్వహణ సమయాన్ని 27 నుంచి 18 రోజులకు కుదిస్తూ తెచ్చిన మున్సిపల్ కార్పొరేషన్స్ చట్టం-1965 సవరణ బిల్లు, అక్రమ మద్యం, నాటుసారా, గంజాయి, ఇసుక అక్రమ రవాణాను అరికట్టేందుకు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఏర్పాటుచేస్తూ ఏపీ ఆబ్కారీ చట్టం, మద్యనిషేధ చట్టాల్లో మార్పులు చేస్తూ ·తెచ్చిన రెండు బిల్లులు, ధర్మకర్తల నియామకానికి చిన్న దేవాలయాల మాదిరిగానే ప్రధాన దేవాలయాలకూ దరఖాస్తులు స్వీకరించాల్సి ఉండగా, దీనికి మినహాయింపునిస్తూ తెచ్చిన సవరణ బిల్లు, తదితర బిల్లులను శాసనసభ ఆమోదించింది.
Courtesy Eenadu