పెందుర్తి, ఆగస్టు 28: రాష్ట్రంలో దళితుల మీద దాడులు ఆగడం లేదు. విశాఖ నగర పరిధిలోని సుజాతానగర్లో ఉన్న సినీ నిర్మాత నూతన్కుమార్నాయుడు ఇంట్లో శుక్రవారం ఓ దళిత యువకుడికి శిరోముండనం చేయించిన ఘటన సంచలనం రేపింది. బాధితుడు కర్రి శ్రీకాంత్(20) తెలిపిన వివరాలు.. నిర్మాత నూతన్ ఇంట్లో గిరిప్రసాద్నగర్కు చెందిన శ్రీకాంత్ 4 నెలలుగా పనిచేస్తున్నారు. ఇటీవల మానేశారు.
ఈ నేపథ్యంలో నూతన్ ఇంటి భద్రతా సిబ్బంది శుక్రవారం శ్రీకాంత్ను పిలిపించారు. పని ఎందుకు మానేశావని ప్రశ్నించారు. అనంతరం గతంలో ఈ ఇంటికి వచ్చిన బ్యూటీషియన్ సెల్ఫోన్ హ్యాక్ చేసి అసభ్యంగా ప్రవర్తించావంటూ శ్రీకాంత్ను దుర్భాషలాడారు. అంతటితో ఆగకుండా సమీపంలోని క్షురకుడిని పిలిపించి శిరోముండనం చేశారు. ఆ సమయంలో నూతన్ భార్య అక్కడే ఉన్నారని బాధితుడు తెలిపారు. శిరోముండనం ఘటనపై శ్రీకాంత్ పెందుర్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా, నూతన్కుమార్ 2014లో అసెంబ్లీ ఎన్నికల్లో ‘జై సమైక్యాంధ్ర పార్టీ’ తరఫున పెందుర్తి నుంచి పోటీ చేశారు. బిగ్బాస్ షోలో పాల్గొన్నారు. ప్రస్తుతం సినీ, రాజకీయ రంగాల్లో కొనసాగుతున్నారు.