- వరంగల్లో పోలీసుల అత్యుత్సాహం..
- ఐదుగురు మహిళా కండక్టర్లకు గాయాలు
- ఇరువర్గాల మధ్య తీవ్రంగా తోపులాట
- రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు, నిరసనలు
- ఆర్టీసీ సమ్మెకు వీఆర్వో, వీఆర్ఏల మద్దతు
ఆర్టీసీ కార్మికుల సమ్మె ఆరో రోజుకు చేరింది. అటు ప్రభుత్వం, ఇటు కార్మికులు పట్టు వీడడం లేదు. దీంతో పరిష్కారం కనుచూపు మేరలో కనిపించడం లేదు. ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా పలు సంఘాలు సంఘీభావాన్ని ప్రకటించాయి. కార్మికులను ప్రభుత్వం రెచ్చగొడుతోందని సమ్మెను మరింత ఉధృతం చేస్తామని అశ్వత్ధామ రెడ్డి హెచ్చరించారు.
అది హన్మకొండలోని అదాలత్ అమరవీరుల జంక్షన్. వందల సంఖ్యలో ఆర్టీసీ కార్మికులు ర్యాలీగా అక్కడికి చేరుకున్నారు. ప్లకార్డులు చేతబట్టి.. తమ న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించాలని బిగ్గరగా నినాదాలు చేస్తున్నారు. అంతలో అక్కడికి కాజీపేట ఏసీపీ కే నర్సింగరావు ఆధ్వర్యంలో బిలబిలమంటూ పెద్ద సంఖ్యలో చేరుకున్న పోలీసులు వారిని అడ్డుకున్నారు. కార్మికులు ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. నినాదాలను ఆపలేదు. పోలీసులు మాత్రం ముందుకే కదిలారు. ర్యాలీని అడ్డుకున్నారు. కార్మికుల్లో కొందరు వారిని తప్పించుకొని అమర వీరుల స్థూపం వద్దకు దూసుకుపోయారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. దీన్ని నిరసిస్తూ అక్కడే బైఠాయించిన మహిళా కండక్టర్లను పోలీసులు తోసేశారు. దీంతో ఐదుగురు మహిళా కండక్టర్లకు ఎముకలు విరిగాయి! బాధతో గిలగిలా కొట్టుకుంటున్నా పోలీసులు శాంతించలేదు. అరెస్టు పేరుతో కార్మికులను ఈడ్చుకెళ్లారు. ఆర్టీసీ సమ్మెలో భాగంగా గురువారం ఆరో రోజు వరంగల్ రణరంగాన్నే తలపించింది. ర్యాలీ భగ్నం చేయాలనే తాపత్రయంతో పోలీసులు చూపిన అత్యుత్సాహం ఆందోళనకర పరిస్థితులకు దారితీసింది.
అప్పటిదాకా కార్మికుల ‘నినాదాల’తో హోరెత్తిన ఆ ప్రాంతం.. గాయాల పాలైన వారి అరుపులు, కేకలతో దద్దరిల్లింది! తోకల ఉమాదేవి, జల్ల రజిత, అవిరినేని సుజాత, మాధవి, కోమల, సుమలత అనే కండక్టర్ల పట్ల పోలీసులు అనుచితంగా ప్రవర్తించారని తోటి కార్మికులు ఆరోపించారు. తోపులాటలో తీవ్రంగా గాయపడిన ఉమాదేవి, రజిత, మాధవి, కోమల, సుజాతలను వెంటనే ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ఈ ర్యాలీని భగ్నం చేసిన పోలీసులు 60మంది కార్మికులను అదుపులోకి తీసుకున్నారు. సుబేదారి పోలీస్ స్టేషన్లో 11మందిపై కేసు నమోదు చేశారు. అనంతరం పూచీకత్తుపై విడిచిపెట్టారు. రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ కార్మికుల సమ్మె ఆరో రోజు మరింత ఉధృతమైంది. గురువారం రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో పోలీసులు, కార్మికులకు మధ్య తోపులాటలు జరిగాయి. నిరసన ప్రదర్శన నిర్వహిస్తున్న కార్మికులను అడ్డుకునే క్రమంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా వంటావార్పు, ధర్నాలు, అర్ధనగ్న ప్రదర్శనలు, ర్యాలీలు, రాస్తారోకోలతో కార్మికులు నిరసన తెలిపారు. అన్ని డిపోల వద్ద భారీగా పోలీసులను మోహరించారు. ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని 29 డిపోల వద్ద కార్మికులు ధర్నాలు నిర్వహించారు. కొత్తగూడెంలో పోలీసులు 20మంది ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ నాయకులను అదుపులోకి తీసుకున్నారు. దివ్యాంగులు బస్సులను శుభ్రం చేస్తూ నిరసన తెలిపారు.
- ఆదిలాబాద్ డిపో ఎదుట కార్మికులు పెద్ద ఎత్తున ధర్నా చేశారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. నిర్మల్లోనూ ఆర్టీసీ కార్మికులు ర్యాలీ, నిరసన ప్రదర్శనను పోలీసులు అడ్డుకున్నారు.
- నిజామాబాద్ జిల్లాలో సుమారు 425కు పైగా బస్సులు రోడ్డెక్కాయి.
- కామారెడ్డిలో ఆర్టీసీ కార్మికుల సమ్మెకు బీజేపీ, ఉపాధ్యాయ, విద్యార్థి, ప్రజా సంఘాలు సంఘీభావం తెలిపాయి. కామారెడ్డిలో కార్మికులు వంటావార్పు, మానవహారం, ధర్నాలతో నిరసన తెలిపారు.
- ఉమ్మడి మెదక్ జిల్లాలో ఆర్టీసీ కార్మికులు భిక్షాటన చేస్తూ నిరసన తెలిపారు. అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు.
- ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సుమారు 5వేల మంది కార్మికులు విధులు బహిష్కరించి శాంతియుతంగా సమ్మె చేస్తున్నారు.
- ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికుల సమ్మె ఉధృతంగా సాగింది.
- ఉమ్మడి మహబూబ్నగర్లో కాంగ్రెస్ ఓబీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు కత్తి వెంకటస్వామి మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెకు మద్దతుగా మంత్రులు హరీశ్రావు, శ్రీనివా్సగౌడ్లు బయటకు రావాలని డిమాండ్ చేశారు.
courtesy andhra jyothy