- సమ్మె వల్లే నిలిపివేశారంటున్న యూనియన్లు
- అక్టోబరు జీతాల్లో కోత వేయాలని సర్క్యులర్
- పండగ వేళ 48 వేల కుటుంబాల్లో ఆందోళన
హైదరాబాద్, అక్టోబరు: ఆర్టీసీ కార్మికులకు సెప్టెంబరు వేతనాలు 7వ తేదీ గడిచిపోయినా చేతికందలేదు. పండుగ ముందు వేతనాలు రాకపోవడంతో ఈసారి కార్మిక కుటుంబాల్లో సంతోషం కరువైంది. మరో పక్క ఉన్న ఉద్యోగాలనే పీకేస్తామంటూ ప్రభుత్వం బెదిరిస్తోంది. ఫలితంగా 48 వేల ఉద్యోగ, సిబ్బంది కుటుంబాలు తీవ్ర ఆందోళన, ఆవేదనలో పడిపోయాయి. సాధారణంగా ప్రతి నెలా 1వ తేదీకల్లా కార్మికులకు వేతనాలు అందేవి. కానీ… గత నాలుగు నెలలుగా వేతనాలు ఆలస్యంగా అందుతున్నాయి. ప్రతి నెలా 6, 7 తేదీల వరకు అందడం లేదు. జూలై నెల వేతనాల్లో తీవ్ర జాప్యం జరగడంతో అప్పట్లో కార్మికులు ధర్నాలకు దిగారు. అయినా… మార్పు లేదు. ఆర్టీసీ అధికారులు, సిబ్బందికి వేతనాల కింద ప్రతి నెలా రూ.110 కోట్ల మేరకు చెల్లించాల్సి ఉంటుంది.
బస్ భవన్ నుంచి అనుమతి రాగానే… డిపోలవారీగా కార్మికుల వేతనాలు బ్యాంకు ఖాతాల్లో పడిపోవాలి. కానీ… ఇప్పటివరకు బస్ భవన్ నుంచి డిపోలకు ఆదేశాలు వెళ్లలేదు. ఈసారి కావాలనే వేతనాలను నిలిపివేసినట్లు కార్మిక యూనియన్లు ఆరోపిస్తున్నాయి. ఈ నెల 5 నుంచి అన్ని కార్మిక యూనియన్లు సమ్మెను చేపట్టాయి. దీంతో వేతనాలు ఇవ్వకుండా యాజమాన్యం నిలుపుదల చేసిందని విమర్శిస్తున్నాయి. కనీసం దసరా పండుగ ఉన్నందునైనా వేతనాలు ఇస్తే బాగుండేదని కార్మిక వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అయితే… అక్టోబరు నెల వేతనాల్లో కోతలు విధించాలంటూ ఇప్పటికే యాజమాన్యం సర్క్యులర్ జారీ చేసింది. సమ్మె కాలాన్ని మినహాయించి, వేతనాలు చెల్లించాలంటూ ఆదేశించింది.
Courtesy Andhrajyothi…