మిర్యాలగూడలో ప్రణయ్ ఇంటి దగ్గర పత్రికా ప్రకటన
రాష్ట్రీయ దళిత సేన పేరుతో అమారాప్రసాద్ (వరప్రసాద్) ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో చేసిన ఆరోపణలన్నీతీవ్రంగా ఖండిస్తున్నాం. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కు ఊడిగంచేసే ‘రాష్ట్రీయ దళితసేన’ పేరుతో ఏర్పడిన రాష్ట్రీయ దళారిసేన ‘దళితులతోనే దళితుల కన్ను పొడిచే అగ్రకుల దళారితనాన్ని మానుకోవాలి. కుల ప్రాతిపదిక పై దళితులకు రిజర్వేషన్లు కొనసాగరాదని, దళితులు కులాతీత హిందువులుగా మారాలని ప్రభోదిస్తున్న ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ దళితుల రిజర్వేషన్లకే ఎసరు పెట్టబోతున్నారు. ఆ కుట్రలో బాగంగానే దళితులను మత ప్రాతిపదికపై విభజించే పన్నాగం పన్నుతున్నారు. నిజానికి మారుతీరావ్ ప్రణయ్ను హతమార్చడానికి ప్రాతిపదిక కులవిక్షేగాని, మతవివక్ష కాదు. ‘‘వికలాంగుడైనా భిక్షగాడైనా వైశ్యుడై ఉంటే తన బిడ్డ ప్రేమ వివాహాన్ని అంగీకరించేవాడినని, వేరే కులస్తుడు చక్కగా ఉన్నా ధనికుడైనా నిమ్నకులస్తుడు కనుక అతన్ని పెళ్లాడితే తన పరువు దిగజారిపోతుందని’’ పరువు హత్యకు నిర్వచనం చెప్పిన మారుతీరావ్ కులదరుహంకారాన్ని ఖండించడానికి ముందుకురాని రాష్ట్రీయ దళారి సేనకు దళిత సేన అనే పదాన్ని వాడే నైతిక హక్కులేదని హెచ్చరిస్తున్నాం. మతం ఏదైనా కులం పేరిట దళితులను వివక్షకు గురిచేయటం ; దాడులు, దౌర్జన్యాలు, హత్యలకు పాల్పడటాన్నినేరంగా పరిగణించి శిక్షించడమే ఎస్సీ, ఎస్టీ చట్టం యొక్క ఆంతర్యం. ఈ అసులు విషయాన్ని పక్కదారి పట్టించి మత వివాదాన్ని రెచ్చగొట్టి దళితుల పేరిట, దళితులకు అన్యాయం చేస్తే ఊరుకునేదిలేదు. గతంలో 1991లో చుండూరు దళితుల మీద జరిగిన నరమేధంలో కూడా ఇలాంటి మత వివాదాన్ని సృష్టించి, కోర్టు విచారణను తప్పుదారి పట్టించాలని చూసిన వారు భంగపడినట్లే, ఈ రాష్ట్రీయ దళారిసేనకు కూడా భంగపాటు తప్పదు. నిజమైన దళితులు, సామాజిక ప్రజాస్వామ్యశక్తులు ప్రణయ్ సహచరి అమృతకు, ప్రణయ్ కుటుంబానికి భరోసా యిస్తారు తప్ప ఇలా ద్రోహం తలపెట్టరు. తలపెట్టేవారు దళిత ద్రోహులేతప్ప దళితులు కారు. ఇలాంటి కరుకుతలు కూస్తూ, అగంతకులను ఇంటిమీడకు పంపి బెదిరింపు లేఖలు ఇంట్లో పడవేస్తూ బాధితులమీదే బండలు వేయాలని చుస్తున్నవారిని అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము.
ప్రణయ్ హత్య జరిగి (సెప్టెంబర్ 14) ఏడాది గడిచిపోయినా ఇంతవరకు కేసు విచారణ మొదలు కాకపోవడం ; చుండూరు, లక్షింపేటలో ప్రత్యేక కోర్టులు ఏర్పాటుచేసినట్లు మిర్యాలగూడలో కూడా ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేయాలనీ ఎన్ని విన్నపాలు చేసినా పట్టించుకోకపోవడంతో బైలుపై బైటకు వచ్చిన మారుతీరావు మాఫియా గ్యాంగ్ ఇలాంటి ఆగడాలకు దిగుతోంది. కనుక బాధితుల్ని బద్నాం చేస్తున్న మారుతీరావు లాంటి బద్మాష్లను బైలు రద్దు చేసి జైల్లో పెట్టాలని డిమాండ్ చేస్తున్నాము.
పత్రికా సమావేశంలో పాల్గొన్న ప్రతినిధులు :
- ఉ. సాంబశివరావ్ (ఉ.సా), బహుజన ప్రతిఘటన వేదిక (బి.ఆర్.ఎఫ్) రాష్ట్ర కో-ఆర్డినేటర్
- బండారి లక్ష్మయ్య, కుల అసమానతా నిర్మూనా పోరాట సమితి (కె.ఎ.ఎన్.పి.ఎస్) అఖిల భారత కన్వీనర్
- డా. రాజు, సామాజిక ఉద్యమ నాయకులు, మిర్యాలగూడ.
- గడ్డం సదానందం, కుల నిర్మూలన ఉద్యమం, రాష్ట్ర కన్వీనర్.
- ప్రొ. పద్మజా షా, ఓ.యూ – జర్నలిజం.
- కె. పర్వతాలు, బహుజన కమ్యూనిస్టు పార్టీ (బి.సి.పి) రాష్ట్ర అద్యక్షులు.
- ఎస్.పి. నాయుడు, సామాజిక కార్యకర్త.
- జ్వాల వెంకటేశ్వర్లు, మానవ హక్కుల వేదిక (హెచ్.ఆర్.ఎఫ్).
- అమృత, ప్రణయ్ సహచరి.
- పి. బాలస్వామి, ప్రణయ్ తండ్రి.