– ఏ వార్త ఇవ్వాలన్నా ప్రభుత్వ అధికారుల ఆమోదం తప్పనిసరి
– లేదంటే వేధింపులు, నిర్బంధాలు
– ప్రభుత్వ ప్రెస్ నోట్లే దిక్కు!
– అంతర్జాతీయ వార్తలతో పేజీలు నింపాల్సిన పరిస్థితి
కాశ్మీర్ లైఫ్, కాశ్మీర్ టైమ్స్, గ్రేటర్ కాశ్మీర్, కాశ్మీర్ ఏజ్, అబ్జర్వర్, రైజింగ్ కాశ్మీర్…మొదలైన దినపత్రికలు, ఇతర టీవీ వార్తా ఛానల్స్, వెబ్ పోర్టల్స్ చీకటిరోజుల్ని అనుభవిస్తున్నాయి. కేంద్రం విధించిన ‘సెన్సార్షిప్’కు విలవిల్లాడుతున్నాయి. రాష్ట్ర రాజకీయాల్ని, వార్తల్ని తెలిపేందుకు ప్రభుత్వ అధికారుల అనుమతి ఉండాల్సిందే. లేదంటే వేధింపులు, నిర్బంధాలు విధిస్తున్నారు. దీంతో మీడియా అంతా ట్రాఫిక్ సమస్యలపై, అభివృద్ధి పథకాలపై వార్తల్ని. రాసుకుంటున్నాయి. దినపత్రికల ముందు పేజీల్ని…అంతర్జాతీయ వార్తలతో నింపుకోవాల్సి వస్తోంది.
జమ్మూకాశ్మీర్ ప్రజల్ని తీవ్రంగా ప్రభావితం చేసిన అంశాలు ఆర్టికల్ 370 రద్దు, రాష్ట్ర విభజన. దేశం యావత్తు దీని గురించి మాట్లాడుకుంటోంది. ప్రపంచ వ్యాప్తంగా కూడా ఇదొక ముఖ్యాంశమైంది. కానీ జమ్మూ కాశ్మీర్లోని స్థానిక దినపత్రికలు, టీవీ ఛానల్స్ మాత్రం రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల్ని తెలియజేసే అవకాశం లేకుండా పోయింది. రాష్ట్ర ప్రభుత్వ అధికారులు విడుదలజేసే ప్రెస్ నోట్లను తీసుకోవటం తప్ప, మరో అవకాశం లేకుండా చేశారని పాత్రికేయులంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో అక్కడి స్థానిక పత్రికలు, మీడియా ఛానళ్లు అన్నీ కూడా అంతర్జాతీయ వార్తలకు ప్రాధాన్యత ఇవ్వటం మొదలుపెట్టాయి. మొదటి పేజీల్లో, టీవీ ముఖ్యాంశాల్లో ఎక్కువగా అంతర్జాతీయ వార్తలే ఉంటున్నా యి. సమాచార, రవాణా వ్యవస్థలు లేకుండాజేసి… మీడియాను నియంత్రించే ఎత్తుగడ అమలుజేస్తున్నారని పాత్రికేయులంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
60 రోజులుగా ఇదే పని..
ఆగస్టు 5 నుంచీ కాశ్మీర్లో పరిస్థితులు తారుమారు అయ్యాయి. పౌరులే కాదు, పాత్రికేయులు సైతం స్వేచ్ఛగా తిరిగే పరిస్థితి లేదు. టెలిఫోన్, ఇంటర్నెట్ సేవలు, సామాజిక మాధ్యమం, మొబైల్ ఫోన్లు…పనిచేయటం ఆగిపోయి 60 రోజులవుతోంది. కేవలం ప్రభుత్వ అధికారులు మాత్రమే మీడియాకు బ్రీఫింగ్స్ ఇస్తున్నారు. ప్రెస్ నోట్లను విడుదల చేస్తున్నారు. ప్రతిపక్ష పార్టీల నాయకులెవరూ మీడియాతో మాట్లాడకుండా వారి వారి ఇండ్లల్లోనే ఖైదు చేశారు. ”ప్రపంచవ్యాప్తంగా ఏం జరుగుతోందో మాకు తెలుస్తోంది. కానీ, ఇక్కడ…కాశ్మీర్లో ఏం జరుగుతోందో తెలియటం లేదు. ఏ వార్తా పత్రిక చదివినా, అందులో అంతర్జాతీయ వార్తలే ఉంటున్నాయి”అని శ్రీనగర్వాసి అజీజ్ అహ్మద్ వాపోయాడు. ఇంటర్నెట్ సేవల్ని నిలిపివేయటంతో, వార్తా వెబ్పోర్టలన్నీ ‘బ్లాంక్’ అయిపోయాయి. ఈ చర్యను వ్యతిరేకిస్తూ ‘కాశ్మీర్ టైమ్స్’ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అనురాధా భాసిన్ సుప్రీంకోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది. శ్రీనగర్ నుంచి పత్రికను నడపలేని పరిస్థితి వచ్చిందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. కచ్చితత్వంతో కూడిన వార్తలు ఇవ్వాలంటే, స్థానిక రాజకీయ, అధికార వర్గాలతో పత్రికా రిపోర్టర్లు నిత్యం మాట్లాడాల్సి ఉంటుంది. మొబైల్ ఫోన్లు పనిచేయక పోవటంతో రిపోర్టర్లు వార్తల్ని సేకరించలేకపోతున్నారు.
అధికారుల అనుమతి ఉంటేనే : మ్యాగజైన్ జర్నలిస్టు తాహీర్ భట్
మా కండ్ల ముందు ఒక రోడ్డు ప్రమాదం జరిగినా దాన్ని వార్తగా ఇవ్వలేకపోతున్నాం. ఎందుకంటే ఈ వార్త ఇవ్వాలంటే ప్రభుత్వ అధికారుల అనుమతి తీసుకోవాల్సి వస్తోంది. నాలుగురోజుల క్రితం ల్యాండ్లైన్ ఫోన్లు పనిచేయటం మొదలైంది. వార్తా సేకరణకు ఇది కొంతమేరకే దోహదపడుతుంది. ఇక్కడున్న మరో సమస్య, మేం చేసే ఫోన్కాల్స్ను ప్రభుత్వ అధికారులు ఎత్తటం లేదు. వారి అనుమతుంటేగానీ వార్తను తీసుకురాలేం. ఇదీ మా అవస్త. ఏదైనా ఘటన జరిగితే…24 గంటల తర్వాత ఇక్కడి ప్రజలకు చేరుతోంది.
అసలు వార్తలు వదిలి
జమ్మూకాశ్మీర్లో అత్యంత జనాదరణ పొందిన దినపత్రికగా ‘గ్రేటర్ కాశ్మీర్’కు గుర్తింపు ఉంది. తమకు వ్యతిరేకంగా వార్తలు రాస్తోందని ఈ ఏడాది ఫిబ్రవరి 23 నుంచి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటనలు నిలిపివేసింది. ఇప్పుడు పూర్తిస్థాయిలో సమాచార వ్యవస్థ అందుబాటు లో లేకుండా పోవటం ఆ పత్రికపై మరింత ప్రభావం చూపింది. సోషల్మీడియాలో, ఇటు వెబ్పోర్టల్లో అసలు వార్తల్ని పెట్టలేని పరిస్థితి. సంస్థ ఆర్థికంగా సమస్యల్లో చిక్కుకుందని ఆ పత్రికా విలేకర్లు ఆవేదన చెందుతున్నారు. ట్రాఫిక్ సమస్యలు, అభివృద్ధి పథకాల గురించి రాస్తూ కాలం గడుపుతున్నామని చెప్పారు.
Courtesy Navatelangana…