- ముఖ్యమంత్రి ఉత్సవ విగ్రహం!
- సర్వాధికారాలు లెఫ్టినెంట్ గవర్నర్వే
- ఎల్జీతో కలిసి చక్రం తిప్పనున్న కేంద్రం!
శ్రీనగర్ : గతంలో జమ్మూకశ్మీరు రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తి ఉన్నప్పుడు పాలనా వ్యవహారాలలో ముఖ్యమంత్రికి విశేషాధికారాలు ఉండేవి. కేంద్రం నిరుడు ఆర్టికల్ 370లోని నిబంధనలను రద్దు చేసింది. అనంతరం జమ్మూకశ్మీరు పునర్విభజన చట్టాన్ని ఆమోదించి ఆ రాష్ట్రాన్ని జమ్మూకశ్మీరు, లద్దాఖ్ కేంద్రపాలిత ప్రాంతాలుగా ఏర్పాటు చేసింది. ప్రస్తుతం అక్కడ ఎన్నికైన ప్రజా ప్రభుత్వం లేదు. రాష్ట్రపతి తరఫున లెఫ్టినెంట్ గవర్నర్ పాలిస్తున్నారు. రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విడగొట్టాక కేంద్రం పాలనా వ్యవహారాలకు సంబంధించిన నియమనిబంధనలను ప్రకటించింది. దీని ప్రకారం జమ్మూకశ్మీరు యూటీ ముఖ్యమంత్రి ఒక డమ్మీ అవుతారు.
ఐఏఎస్, ఐపీఎస్ వంటి అఖిలభారత సర్వీసులు, పోలీసు వ్యవస్థ, ఏసీబీ విభాగాలపై అధికారాలన్నీ లెఫ్టినెంట్ గవర్నర్కు దఖలుపడ్డాయి. కేంద్రం నోటిఫై చేసిన నిబంధనలు ముఖ్యమంత్రి, కేబినెట్ మంత్రుల అధికారాలకు పెద్ద కత్తెర వేశాయి. వారికి ఏ పాత్ర లేకుండా చేశాయి. సీఎం పదవి అలంకారప్రాయంగా మారనున్నది. జమ్మూకశ్మీరు పోలీసు శాఖలోని కానిస్టేబుల్ని కూడా బదిలీ చేసే అధికారం సీఎంకు ఉండదు. లెఫ్టినెంట్ గవర్నరే సర్వాధికారి అయ్యారు. కేంద్రం ప్రకటించిన కొత్త నిబంధనల ప్రకారం శాంతి భద్రతలకు సంబంధించిన ప్రతిపాదనలను హోం శాఖ ముఖ్యకార్యదర్శి సీఎస్ ద్వారా లెఫ్టినెంట్ గవర్నర్కు నివేదిస్తారు. వాటిపై ఎల్జీ నిర్ణయం తీసుకుంటారు. 47వ నిబంధన ప్రకారం ఏదైనా విషయమై జేకే కేబినెట్కు, ఎల్జీకి మధ్య విభేదాలు తలెత్తితే రాష్ట్రపతి నిర్ణయమే అంతిమం అవుతుంది. అటువంటి పరిస్థితులలో మంత్రిమండలి నిర్ణయాలను ఎల్జీ నిలుపుదల చేయొచ్చు. జమ్మూకశ్మీరు ప్రభుత్వ చీఫ్ సెక్రెటరీ, డీజీపీ నియామకాలలో ఎల్జీ ముందుగా కేంద్రానికి నివేదించాలి.
Courtesy Andhrajyothi