– ఏకతాటిపై నిలిచిన ఆరు రాజకీయపార్టీలు
శ్రీనగర్ : జమ్ముకాశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తి పునరుద్ధరణ కోసం ఆరు రాజకీయ పార్టీలు కలసి పీపుల్స్ అలయెన్స్గా ఏర్పడ్డాయి. నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ) అధ్యక్షుడు డాక్టర్ ఫరూక్ అబ్దుల్లా అధ్యక్షతన గురువారం నాడిక్కడ జరిగిన సమావేశంలో ఈ నూతన కూటమిని ఏర్పాటు చేయాలని నిర్ణయించాయి. సమావేశం అనంతరం జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దులా మాట్లాడుతూ, 2019 ఆగస్టు 4కి ముందున్న పరిస్థితిని పునరుద్ధరించేంతవరకు తాము పోరాటం సాగిస్తామని చెప్పారు. జమ్మూ కాశ్మీర్ ప్రజల హక్కులను అన్నిటిని తిరిగి సాధించేందుకు ఈ కూటమి రాజ్యాంగ బద్ధంగా పోరాడుతుందని తెలిపారు. సమావేశంలో పీపుల్స్ డెమెక్రటిక్ పార్టీ (పీడీపీ) అధినేత మెహబూబా ముఫ్తి, పీపుల్స్ కాన్ఫరెన్స్ (పీసీ) చీఫ్ సజాద్ లోన్, సీపీఐ(ఎం) నేత మహ్మద్ యూసుఫ్ తరిగామి పాల్గొన్నారు. శ్రీనగర్లోని గుప్కర్ రోడ్లో ఉన్న అబ్దుల్లా నివాసంలో ఈ సమావేశం జరిగింది.
Courtesy nava telangana