[avatar user=”[email protected]” size=”thumbnail” align=”right”]-B.భాస్కర్ [/avatar]
బాబాసాహెబ్ అంబేద్కర్ మనవడు ప్రకాష్ అంబేద్కర్ ఈ లోక్ సభ ఎన్నికల్లో మహారాష్ట్రలో చేసిన ప్రయోగం దేశంలో అద్బుత సామాజిక మార్పుకు శ్రీకారం చుట్టనున్నది. సుమారు 200 దళిత, బహుజన విస్మృత, పీడిత సంస్థలతో కలిసి వీ.బీ.ఏ ని స్థాపించారు. అంతేకాదు ఎం.ఐ.ఎంతో కలిసి మైనారిటీ ఆదివాసీ దళిత బహుజన విస్మృత శక్తుల కూటమిని ఏర్పరిచారు. రాహుల్ గాంధీ ఒకపక్క గుళ్ళూ, గోపురాలూ తిరుగుతూ జంధ్యం ధరిస్తారని ప్రచారం చేయించుకుంటూ కాంగ్రేస్ ను హిందూత్వ “బీ టీమ్”గా మార్చిన వేళ ప్రకాష్ అంబేద్కర్ చేస్తున్న ప్రయోగం” బాబాసాహెబ్ అంబేద్కర్ సామాజిక- పీడితుల ఐక్యతా స్పూర్థిని ముందుకు తీసుకెళ్ళటానికి, దేశానికి సరైన దృష్టికోణాన్ని చూపటానికి దోహద పడింది.
మహారాష్ట్రలో 15 ఏళ్ళలో తొలి ముస్లిం ఎంపీ: “వంచిత్ బహుజన ఆఘాడీ” (vanchit bahujan aghadi) అసదుద్దీన్ ఓవైసీ ఏ.ఐ.ఎం,ఐ.ఎం సంఘటన మహారాష్ట్రలో ఈ లోక్ సభ ఎన్నికల్లో ఒక అద్బుతాన్ని సాధించింది. మహారాష్ట్రలో గత 15 ఏళ్ళలో తొలిసారిగా ఒక ముస్లిం ఎంపీని గెలిపించింది. మహారాష్ట్ర హిందూ ప్రముఖులను కించపరుస్తూ ఏప్రిల్ నెలలో ఔరంగాబాద్ లో ఒక వీడియో బయటకు వచ్చింది. ఎం.ఐ.ఎం. దీనిని వైరల్ అయ్యేలా చేసిందని హిందూత్వశక్తులు ఆరోపించాయి. మాజీ శివసేన నాయకుడు నేడు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన హర్షవర్థన్ జాదవ్ దీనికి ప్రతిగా మరొక వీడియోని విడుదలచేశాడు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రావు సాహెబ్ కు జాదవ్ అల్లుడు. హిందూ నేతలను అవమాన పరిచినందుకు ఎం.ఐ.ఎం క్షమాపణ చెప్పాలని లేదంటే ఆ పార్టీ కార్యాలయాలని ధ్వంసం చేస్తామనీ ఆయన హెచ్చరించారు. ఔరంగాబాద్ లో ఎం.ఐ.ఎం. వంచిత బహుజన అఘాడీ కూటమి తరపున పోటీ చేస్తున్న మాజీ జర్నలిస్ట్ ఇంతియాజ్ జలీల్ తనపై వచ్చిన ఆరోపణలని ఖండిస్తూ, శాంతిని ఆకాంక్షిస్తూ ప్రతిగా తనొక వీడియోను విడుదల చేశారు. ఈ నియోజకవర్గంలో మతతత్వ ద్వేషాన్ని రెచ్చగొట్టి ఎన్నికల్లో గెలవటానికి హిందూత్వ శక్తులు కుట్ర పన్నారని, నేరస్తులని గుర్తించి వారిని కఠినంగా శిక్షించాలని ఆయన పోలీసులకు విఙ్ఞప్తి చేశారు. ఫలితంగా జాదవ్ పోలీసులకు క్షమాపణ చెప్పాల్సిన పరిస్తితి ఏర్పడింది. ఇంతియాజ్ జలీల్ కార్యాచరణ, ఖాకీల బాధ్యతాయుత స్పందన మరోపక్క మెజారిటీ మతతత్వవాదులకు చెమటలు పట్టించాయి. ఎన్నికలు ముగిశాయి మే 23న ఫలితాలు వచ్చాయి. ఇంతియాజ్ జలీల్, సిట్టింగ్ శివసేన ఎం.పీ పై 4492 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు. హర్షవర్థన్ భారీగా ఓట్లను చీల్చటం కూడా జలీల్ కు లభించింది. ఔరంగాబాద్ చారిత్రకంగా మత ఉద్రిక్తతల ప్రాంతం. ఇక్కడ 30% మంది ముస్లింలు నివశిస్తున్నారు. దీనితో 1980ల నుండీ శివసేన నిరుధ్యోగ యువతను ఆకట్టుకొని క్రమంగా ఈ ప్రాంతాన్ని తన కంచుకోటగా చేసుకుంది. “మైనారిటీ బూచి”ని చూపించి వరుస ఎన్నికల్లో విజయాలు సాధించింది. మహారాష్ట్రలో శివసేన, బీజేపీ కలిసి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే.
బహుళ,బహుజన ఐక్య సంఘటనే ప్రత్యామ్నాయం: 2019 ఎన్నికలు అమెరికా అధ్యక్ష ఎన్నికల తరహాలో జరిగాయనీ, అందువల్లనే మోడీ లాభ పడ్డారనీ విశ్లేషకులు రాస్తున్నారు. అయితే స్థానిక పార్లమెంటరీ నియోజకవర్గ అంశాలూ ఈ ఎన్నికల్లో పనిచేశాయని ఔరంగాబాద్ లో జలీల్ విజయం నిరూపించింది. పార్లమెంటరీ ప్రజాస్వామ్య విశిష్టతను ఈ పట్టణం నిలబెట్టింది. మహారాష్ట్రలో 15ఏళ్ళుగా ముస్లిం లోక్ సభ సభ్యుడే లేని పరిస్థితికి 2019 చరమ గీతం పాడింది. అలాగే దళిత బహుజన మైనారిటీలు సంఘటితంగా నిలిస్తే హిందూ మతతత్వశక్తులని ఓడించవచ్చని నిరూపించింది. మహారాష్ట్రలో ఈ ఓటమి 14 లక్షలు అంటే 14% ఓట్లు సాధించింది. రాష్ట్రంలో తమతో కలిసి రమ్మని ప్రకాష్ అంబేద్కర్ ఆహ్వానించినప్పటికీ సానుకూలంగా స్పందించని కాంగ్రేస్ తత్ఫలితాన్ని దారుణంగా అనుభవించింది. ప్రకాశ్ అంబేద్కర్, అసదుద్దీన్ ఒవైసీ కూటమి కట్టటం మరో రకంగా ముస్లిం పార్టీల సైద్ధాంతిక ప్రగతి శీలతకు బాటలు వేస్తుందని మనం ఆశించవచ్చు.
-రచయిత, సీనియర్ జర్నలిస్ట్ మొబైల్ 9989692001