- భారీ ఆర్డర్ ఇచ్చిన వైఎస్.. పదేళ్లపాటు పని
- తెలంగాణ వచ్చాక తగ్గిన, ఆగిన ఆర్డర్లు
- నవ్యాంధ్ర సర్కారు అడిగినా ససేమిరా
- మూలనపడిన రూ.6 కోట్ల సరుకు
- రోడ్డునపడ్డ వరంగల్ చేనేత కార్మికులు
వరంగల్ అర్బన్, సెప్టెంబరు 29: వరంగల్ కొత్తవాడ చేనేత కార్మికులు నేసిన దర్రీలను తెలంగాణ సర్కారు తీసుకోవడం లేదు. మాకు కావాలని ఆంధ్రప్రదేశ్ అడిగినా ఇవ్వడం లేదు. పదేళ్లుగా ప్రైవేటు మార్కెట్ బందయింది! వెరసి, రాత్రింబవళ్లు కష్టపడి తయారు చేసిన చేనేత బట్టలు మూలనపడ్డయి. ఇప్పటికీ ఆరు కోట్ల రూపాయల విలువైన సరుకు గోడౌన్లలో మూలుగుతోంది. వరంగల్ దర్రీలకున్న ప్రత్యేకత కారణంగా దేశ, విదేశాలకు ఎగుమతి అయ్యేవి. వారంలో రెండు సార్లు కనీసం నాలుగు లారీల సరుకు కొత్తవాడ నుంచి హైదరాబాద్ వెళ్లేది. చేతినిండా పనితో కడుపునిండా తిండితో చేనేత కార్మికులు హాయిగా ఉండేవారు. 2004లో వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రోత్సాహం మరింత పెరిగింది. సంక్షేమ హాస్టళ్లకు కావాల్సిన కార్పెట్, బెడ్షీట్లను వరంగల్ నుంచే సరఫరా చేసేవారు. నిజానికి, అప్పటి వరకూ పెద్ద సైజ్ కార్పెట్లు, షత్రంజీలు, టెంట్హౌజ్ కార్పెట్లు ఎగుమతి చేసేవారు. ఇందుకు పెద్ద సైజులో ఉండే మగ్గాలను వాడేవారు.
కానీ, విద్యార్థులకు అందించే కార్పెట్లు, బెడ్షీట్ల తయారీకి చిన్న సైజు మగ్గాలు అవసరం. ప్రభుత్వ ఆర్డర్ రావడంతో పెద్ద సైజ్ మగ్గాల స్థానంలో చిన్న సైజ్ మగ్గాలను సమకూర్చుకున్నారు. 2014 వరకు అంటే.. తెలంగాణ ఏర్పాటయ్యే వరకు ఈ ప్రభుత్వపరమైన ఆర్డర్లు కొనసాగాయి. రాష్ట్ర విభజనతో సగం ఆర్డర్లు తగ్గాయి. ఒక్కో విద్యార్థికి ఒక్క కార్పెటే ఇవ్వాలని తెలంగాణ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. కార్పెట్లను తమకు సరఫరా చేయాలని నవ్యాంధ్ర ప్రభుత్వం కోరినా.. తెలంగాణ ప్రభుత్వం ఒప్పుకోలేదు. దీంతో అప్పటికే తయారు చేసిన ఉత్పత్తులను కొనే నాథుడు లేక చెదలు పట్టాయి. దీంతో, తిరిగి ప్రైవేట్ మార్కెట్లో సరుకును అమ్ముకునేందుకు ప్రయత్నించారు. పదేళ్లుగా తమకు వరంగల్ నుంచి ఉత్పత్తులు రాకపోవడంతో హైదరాబాద్ వ్యాపారులు హరియాణా, ఢిల్లీ తదితర ప్రాంతాల నుంచి సరుకును కొనుగోలు చేసుకుంటున్నారు. అంతేనా.. ప్రభుత్వ ఆర్డర్లు పెద్దఎత్తున వస్తున్నాయని పెద్ద మగ్గాలను తీసేసి చిన్న మగ్గాలను ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పుడు మళ్లీ పెద్ద మగ్గాలను మార్చుకుంటే తప్ప ప్రైవేట్ మార్కెట్ ఉండదు. కానీ, వాటిని మార్చుకునేందుకు తమ ఆర్థి క శక్తి సరిపోదని చేనేతకార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సిరిసిల్లకు బతుకమ్మ.. మాకు శివరాత్రి: కరీంనగర్ జిల్లా నేతల ప్రత్యేక శ్రద్ధతో సిరిసిల్ల చేనేత కార్మికులకు బతుకమ్మ ‘పండుగ’ అయింది! మాకు మాత్రం ‘శివరాత్రి’ (ఉపవాసం)లా ఉంది. మా రాష్ట్రం మాకొస్తే మా కష్టాలు తీరుతయని సంబరపడ్డం. సబ్బండ వర్ణాలతో కలిసి తెలంగాణ కోసం జైకొట్టినం. తెలంగాణొచ్చింది. పండుగ చేసుకున్నం. ఆడినం.. పాడినం.. కానీ, మా సంబురం ఎంతో కాలం నిల్వలేదు. రాష్ట్రం వచ్చింది. ఆంధ్రప్రదేశ్కు ఆర్డర్లు ఆగినయి. మా సరుకును తెలంగాణ సర్కార్ తీసుకుంటలేదు. రాష్ట్రం ఎందుకొచ్చిందన్న బాధ లేదు. మమ్మల్ని సక్కగ చూసుకునేటోడే లేరు కదా అన్న వేదన మాత్రం ఉంది.
– బేతి రమేశ్, పరమేశ్వరి మ్యాక్స్ సొసైటీ
ఆర్డర్లు ఇస్తేనే.. : వరంగల్ చేనేత కార్మికుల ఆకలి కేకలు ఆగాలంటే సంక్షేమ పాఠశాలల విద్యార్థులకు గతంలో ఇచ్చినట్టు మరో జత కార్పెట్, బెడ్షీట్ ఇవ్వాలి. తద్వారా, వారికి భారీ ఊరట లభిస్తుంది. ఇప్పటికే నిల్వ ఉన్న సరుకు వెంటనే అమ్ముడుపోవడానికి ఇది వెంటనే తీసుకోవాల్సిన నిర్ణయం. ఇక, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్తో సత్సంబంధాలు ఉన్నాయి. కనక, అక్కడి విద్యార్థులకు కూడా టెస్కో ద్వారా సరఫరా చేసే ఒప్పందం కుదుర్చుకోవాలి. ఇక, శాశ్వత పరిష్కారానికి టెస్కో ద్వారా మార్కెటింగ్ పరిశోధన జరిపించాలి. ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా కార్పెట్ల తయారీలో మార్పులు చేయాలి. అందుకు అవసరమైన ప్రత్యేక శిక్షణ, పరికరాలను ప్రభుత్వం సమకూర్చాలి.
Courtesy Andhrajyothi…