– యురేనియంపై వ్యతిరేక పోరు
– చెంచులకు రాజ్యాంగ రక్షణ
– భూమి బదలాయింపు అక్కడ నిషేధం
– పీసా చట్టంతో స్వయం నిర్ణయాధికారం
– 2013 భూసేకరణ చట్టం వర్తింపు
– అటవీ హక్కుల చట్టమూ కీలకమే కొండూరి రమేశ్బాబు
నల్లమలలో యురేనియం తవ్వకాలకు ఆదివాసీ చట్టాలే ప్రతిబంధకం కానున్నాయి. ఈ చట్టాలే ఆయు ధాలుగా ఆదివాసీలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై న్యాయ పోరాటం చేసే అవకాశం ఉన్నది. మన్ననూరులోని సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ పరిధిలో ఉన్న 23 గ్రామ పంచాయితీలు రాజ్యాంగంలోని ఐదవ షెడ్యూలు ప్రాం తంలో ఉన్నాయి. ఇక్కడ నివసించే చెంచుల అనుమతి లేకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు అడుగేయ లేవు. అయితే ఈ చట్టాలను పట్టించుకోకుండా యురేనియం సర్వే కోసం కేంద్ర ప్రభుత్వ సన్నాహాలు చేస్తున్నది. నల్లమల అటవీ ప్రాంతంలో భూమి బదలాయింపు నిషేధిత చట్టం అమల్లో ఉన్నది. గ్రామసభల అనుమతి లేకుండా ఇక్కడ భూమిని సేకరించటం చట్టం విరుద్ధం. 2013 భూసేకరణ చట్టంలో కూడా ఇదే అంశాన్ని పొందుపర్చారు. యురేనియం సహా అటవీ ప్రాంతంలో ఎలాంటి ఖనిజాలు తవ్వాలన్నా గ్రామ సభల అనుమతి అవసరం. షెడ్యూల్డ్ ప్రాంతాలకు పంచాయితీరాజ్ విస్తరణ (పీసా) చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత ఒడిషాలో బాక్సైట్ తవ్వకాలను అక్కడి ఆదివాసీలు గ్రామసభల తీర్మానాలతో తిప్పి కొట్టారు. దీనితో పోస్కో, వేదాంత సంస్థలు తిరుగుముఖం పట్టాయి. నల్లమల అటవీ ప్రాంతంలో అటవీ హక్కుల చట్టం కూడా వర్తిస్తుంది. ఈ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత కేవలం 1,850 ఎకరాలకు మాత్రమే హక్కు పత్రాలను ఇచ్చింది. వీటిలో 43 మంది చెంచులకు సంబంధించిన 86 ఎకరాలు మాత్రమే వ్యక్తిగత క్లైయిమ్లు కాగా మిగిలిన 1,770 ఎకరాలను కమ్యూనిటీ క్లైయిమ్లు కావటం విశేషం. సముదాయిక హక్కు పత్రాలతో తమకు ఎటువంటి ప్రయోజనం లేదని చెంచులు అంటున్నారు. నల్లమల అటవీ ప్రాంతాన్ని టైగర్ జోన్గా ప్రకటించటంతో అక్కడ అటవీ హక్కుల చట్టాన్ని పూర్తిగా అమలు చేయలేదు. ఇప్పుడు యురేనియం తవ్వకాల కోసం యురేనియం కార్పొరేషన్కు అప్పగించిన 1,301 ఎకరాల అటవీ భూమిలో కొంత భాగాన్ని చెంచులు పోడు చేసుకుంటున్నారు. అటవీ హక్కుల చట్టం ప్రకారం కూడా గ్రామసభలు నిర్వహించాల్సి ఉన్నది. ఏజెన్సీ ప్రాంతంలో ఖనిజాల తవ్వకాలు చేపట్టాలంటే గ్రామసభల అనుమతి తీసుకోవాల్సి ఉన్నది.
గ్రామసభలే కీలకం…
యురేనియం తవ్వకాలను చట్ట పరిధిలో వ్యతిరేకించా లంటే గ్రామసభల సమావేశాలు నిర్వహించుకుని తీర్మానా లు చేసే అవకాశం ఉన్నది. యురేనియం తవ్వకాలను అసెంబ్లీ తీర్మానం ద్వారా వ్యతిరేకించిన రాష్ట్ర ప్రభుత్వం ఇది కంటి తుడుపు చర్య కాదని నిరూపించుకోవాల్సిన అవసరం ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వమే గ్రామసభల నిర్వహణ కోసం ఆదేశిస్తే యురేనియం తవ్వకాలను వ్యతిరేకిస్తూ ఏకగ్రీవ తీర్మానాలు చేయటానికి చెంచులు సిద్ధంగా ఉన్నారు. తమంతట తాముగా గ్రామసభలను నిర్వహించుకునే అవకాశం ఉన్నప్పటికీ వీటికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తిస్తాయో లేదోననే ఆందోళన చెంచుల్లో ఉన్నది. పోలవరం ప్రాజెక్టు విషయంలో ఇదే జరిగింది. ఆదివాసీలు తమంతట తాముగా గ్రామసభలు నిర్వహించుకుని చేసిన తీర్మానాలను కేంద్రం పట్టించుకోలేదు. రాష్ట్ర ప్రభుత్వమే గ్రామసభలను నిర్వహిస్తే వీటి ఆధారంగా సుప్రీం కోర్టుకు వెళ్లే అవకాశం ఉంటుంది.
భూమిని వెనక్కి తీసుకోవాలి…
యురేనియం తవ్వకాల కోసం నల్లమలలోనూ, కర్మాగారం నిర్మాణానికి నల్లగొండ జిల్లాలోనూ రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన భూమిని వెంటనే వెనక్కి తీసుకోవాలి. ప్రజాగ్రహంతోనే రాష్ట్ర ప్రభుత్వం యురేనియం తవ్వకాల కోసం తీర్మానం చేసింది. నల్లమలలో 1,300 ఎకరాల అటవీ భూమినీ, నల్లగొండ జిల్లా మల్లాపూర్ వద్ద కర్మాగారం నిర్మాణానికి 650 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం యురేనియం కార్పొరేషన్కు అప్పగించింది. ఆదివాసీలకు పోరాటాల ద్వారా సంక్రమించిన రాజ్యాంగ హక్కులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కాలరాస్తున్నాయి. భూసేకరణ, అటవీ హక్కులు, పీసా చట్టాల ప్రకారం నల్లమల అటవీ ప్రాంతంలో యురేనియం తవ్వకాలు చేపట్టరాదు. ఈ విషయంలో కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో పోరాటం చేయాలి.
-డాక్టర్ మిడియం బాబూరావు,
చైర్మెన్, ఆదివాసీ అధికార్ రాష్ట్రీయ మంచ్