– ఆసియా దేశాల్లో మనకన్నా ఎక్కువ పన్ను
– ఇండియాలో మాత్రం తగ్గించారు..!
– అమెరికా, చైనా, జపాన్, బ్రిటన్లో 22శాతం కన్నా ఎక్కువ
– కొత్త పెట్టుబడులకు 17శాతమే : ఆర్థిక విశ్లేషకులు కార్పొరేట్ పన్నును 22శాతానికి తగ్గిస్తూ మోడీ సర్కార్ తీసుకున్న నిర్ణయం సామాన్యులకు, పేదలకు ఎలాంటి మేలు చేయదన్న అభిప్రాయం ఆర్థిక విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. ‘పన్ను రేట్ల‘లో తెచ్చిన మార్పుల ఫలితంగా, నూతన పెట్టుబడులతో ఆర్జించే ఆదాయంపై కార్పొరేట్లు చెల్లించే పన్ను 17శాతమే ఉంటుందన్నారు. ఆసియాలోనేకాదు, ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ‘చైనా‘లో కూడా ఇలాంటి పన్ను రేట్లు లేవనీ, అనేక దేశాల్లో కార్పొరేట్లకు, అత్యంత ధనికులకు ఇలాంటి పన్ను మినహాయింపులు ఇవ్వలేదనీ వారు గుర్తుచేస్తున్నారు.
న్యూఢిల్లీ : ప్రధాని మోడీ నేతృత్వంలో ఎన్డీయే ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి రాగానే ‘పన్ను సంస్కరణల’పై పెద్ద ఎత్తున దృష్టిసారించింది. తమపై విధించిన పన్నులను తగ్గించాలని మోడీ సర్కార్పై కార్పొరేట్ వర్గం ఎప్పట్నుంచో ఒత్తిడి చేస్తోంది. ఈ నేపథ్యంలో వారికి అనుకూలంగా పన్నురేట్లను మార్చాలని కూడా కేంద్రం నిర్ణయించుకున్నట్టు మీడియాలో కథనాలు వెలువడ్డాయి. అయితే ఆ నిర్ణయం నేపథ్యంలో ప్రజల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత రాకూడదనే ఉద్దేశంతో ఇన్నాండ్లు ఆగారనీ, ఆర్థికమాంద్యం, తయారీరంగం దెబ్బతినటాన్ని ఆసరాగా చేసుకొని పన్ను రేట్లును మార్చారనీ ఆర్థిక విశ్లేషకులు చెబుతున్నారు. ఇంతకు ముందు ఎన్నడూలేని విధంగా కార్పొరేట్ పన్నులను తగ్గించారనీ, ఆసియాలో మనకన్నా మెరుగ్గా ఉన్న అనేక దేశాల్లో సైతం కార్పొరేట్ పన్నులు ఎక్కువగా ఉన్నాయనీ వారు గుర్తుచేస్తున్నారు.
కార్పొరేట్ బేస్ ట్యాక్స్ను 35 నుంచి 22శాతానికి తగ్గిస్తూ నాలుగురోజుల క్రితం కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ కీలకమైన విధాన ప్రకటన చేశారు. తయారీరంగంలో కార్పొరేట్లు, అత్యంత ధనవంతుల(సూపర్ రిచ్) పెట్టుబడులపై పన్ను 17శాతం విధించారు. అసలు కిటుకంతా ఇక్కడే ఉందని మార్కెట్ విశ్లేషకులు, ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. స్టాక్మార్కెట్ సహా అనేకరంగాల్లో తమ పెట్టుబడులను ‘కార్పొరేట్ వర్గం’ ఇప్పటికే ఉపసంహరించుకుందనీ, తగ్గించిన పన్నుల విధానంలో(కొత్తవాటికి 17శాతం) మరింత లబ్దిని పొందే ఎత్తుగడ ఇందులో ఉందనీ వారు చెప్పారు. తద్వారా ఆ తగ్గించిన 22శాతం కార్పొరేట్ పన్ను కట్టేది కూడా పెద్దగా ఏముండదనీ, ఎక్కువ సంఖ్యలో ’17శాతం’తో పన్నులు చెల్లిస్తారనీ వారు అన్నారు.
వియత్నాంలో ఎందుకు తక్కువుంది?
వియత్నాం, తైవాన్, యూకే, సింగపూర్, థాయిలాండ్ దేశాల్లో మనకన్నా కార్పొరేట్ పన్ను తక్కువగా ఉంది. అయితే ఈ దేశాలతో భారత్ను పోల్చలేమని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. కారణం, ఉదాహరణకు వియత్నాంనే తీసుకుంటే…అక్కడ సాధారణంగా ఉన్న కార్పొరేట్ పన్ను 17శాతం. ఇది 10 ఏండ్ల సుదీర్ఘకాల పెట్టుబడులకు అమలవుతుంది. అలాగే 15ఏండ్లు పెట్టుబడులు పెడితే 10శాతం పన్ను కడితే చాలు. మరొక ముఖ్య నిబంధన కూడా ఉంది. విద్యా, వైద్యం, ఉన్నత సాంకేతికత, నిర్మాణరంగ అభివృద్ధి, పునరుద్పాకత శక్తి…రంగాల్లో పెట్టుబడి పెడితేనే 10శాతం లేదా 17శాతం పన్ను ఉంటుంది. కానీ మనదగ్గర ఇలాంటి నిబంధనలు లేవు కదా? అని నిపుణులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. కార్పొరేట్ పన్ను వియాత్నం, తైవాన్, సింగపూర్ తక్కువగా అమలుజేస్తున్నారని మనం తగ్గించటం గుడ్డిగా అనుసరించటమేనని వారు అన్నారు.
ఏంటా పన్ను ఏమా కథ?
మనదేశంలో ఏదైనా కంపెనీ ‘కార్పొరేట్’ విభాగం కిందకు వస్తే చెల్లించాల్సిన ఆదాయపు పన్ను 34.94శాతం(మొన్నటివరకు). అత్యంత ధనికులు, పెట్టుబడిదారుల(రూ.2కోట్లు మించి) వ్యక్తిగత ఆదాయంపై చెల్లించాల్సిన పన్ను కూడా ఇదే. వీరంతా చెల్లించాల్సిన 34.94శాతం పన్నును మోడీ సర్కార్ నాలుగురోజుల క్రితం 22శాతానికి తగ్గించింది. 1 అక్టోబరు 2019 తర్వాత స్థాపించే ఏ కంపెనీ అయినా ఈ 22శాతమూ కట్టాల్సిన అవసరం లేదు. 17శాతం కడితే చాలు. సర్ఛార్జీ, సెస్ ఇందులోనే. ఈ రకమైన పన్నుల విధానం మన పన్ను ఆదాయానికి చేటు తెస్తుందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.
బడా కంపెనీలకే లబ్ది: క్రిసిల్
ప్రస్తుతం దేశంలో తీవ్ర స్థాయిలో ఉన్న ఆర్థిక మాంద్యం నుంచి బయటపడేందుకు విప్లవాత్మకమైన ఉద్దీపన చర్యలు చేపడుతున్నామని కేంద్రంలోని బీజేపీ సర్కార్ చెబుతున్నది. అయితే అవి దేశాన్ని మాంద్యం నుంచి రక్షించేవిగా లేవనీ, కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా మారుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం నెలకొన్న మాంద్యం ప్రధానంగా ప్రజల కొనుగోలు శక్తి పడిపోవడం వలన ఏర్పడింది. దీనికి నిరుద్యోగిత వంటి అనేక కారణాలు కూడా ఉన్నాయి. ఇలాంటి సమయంలో ప్రజలకు ఉపాధి కల్పించి వారి కొనుగోలు శక్తిని పెంచి డిమాండ్ కల్పించాల్సిన ప్రభుత్వం ఆ దిశగా మాత్రం దృష్టి సారించట్లేదు. కార్పొరేట్లకూ, ఎగుమతిదారులకూ రాయితీలు కల్పించి పెట్టుబడులను పెంచుతామని కేంద్రం చెబుతున్నది. ఈ నేపథ్యంలో కేంద్రంలోని మోడీ సర్కార్ తీసుకుంటున్న నిర్ణయాలు కార్పొరేట్ శక్తులకు వేలాది కోట్ల రూపాయలను ఆదా చేస్తున్నది. తాజాగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ‘కార్పొరేట్ పన్ను తగ్గింపు’ నిర్ణయం రిలయన్స్, టాటా, వేదాంత, అదానీ వంటి దాదాపు వెయ్యి కంపెనీలకు రూ.37 వేల కోట్లను ఆదా చేస్తోందని ప్రపంచవ్యాప్తంగా పలు అంశాలపై విశ్లేషణలు అందించే ‘క్రిసిల్’ అనే సంస్థ ఆదివారం విడుదల చేసిన తన నివేదికలో పేర్కొంది. 80 రంగాలకు సంబంధించి, స్టాక్ ఎక్సేంజీలో దాదాపు 70 శాతానికి పైగా పెట్టుబడులు ఉన్న ఈ కంపెనీలపై అధ్యయనం జరిగింది. ఈ కంపెనీలన్నీ గత ఐదేండ్ల కాలంలో పెద్దమొత్తంలో పన్నులు చెల్లించాయని పేర్కొంది. ఆయిల్ అండ్ గ్యాస్, ఆర్థిక సేవలు వంటి సంస్థలతో కూడివున్న ఈ సంస్థలు చెల్లించే పన్ను వ్యవస్థీకృత రంగంలో నాలుగింట మూడొంతులు ఉండేదని నివేదిక పేర్కొంది. అయితే కేంద్రం తాజాగా తీసుకున్న నిర్ణయం ద్వారా ఈ కంపెనీలకు రూ.37 వేల కోట్లు మిగులుతుంది.
30 శాతానికి పైగా అధిక పన్నుల వలన వినియోగదారులకు అనుసంధానించబడిన విభాగాలకు అధిక మొత్తంలో లబ్ది చేకూరుతుంది. ఎగుమతి ఆధారిత రంగాలైన ఐటీ, ఫార్మా వంటివి ఇప్పటికే తక్కువ పన్ను చెల్లింపుల కేటగిరీలో ఉండడంతో వాటి వలన 5-6 శాతం మాత్రమే లబ్ది చేకూరుతుందని క్రిసిల్ తన నివేదికలో పేర్కొంది. అయితే దీనికి విరుద్ధమైన నిర్ణయాలను కేంద్ర ప్రభుత్వం జులై 5న ప్రకటించిన బడ్జెట్ సందర్భంగానే పేర్కొంది. రూ.400 కోట్ల వరకూ టర్నోవర్ ఉన్న కంపెనీలు చెల్లిస్తున్న పన్నును 27.8 శాతానికి( సర్చార్జి, సెస్లతో కలిపి) తగ్గించారు. ఈ విధంగా ఉదారంగా పన్ను కోత విధించడం వలన 99 శాతం కంపెనీలకు లబ్ది చేకూరింది. కేవలం 1 శాతం కంపెనీలకు మాత్రమే 34.94 శాతం పన్ను రేట్ (సర్చార్జి, సెస్ లేకుండా 30 శాతం)ను ఉంచింది. ఈ అధిక టర్నోవర్ కలిగిన కంపెనీల జాబితాలో రిలయన్స్ ఇండిస్టీస్, టాటా, ఆదిత్య బిర్లా గ్రూప్ లాంటివి ఉన్నాయి. అయితే ఉన్న పన్నులో కూడా కోత విధిస్తూ తాజాగా కేంద్ర ఆర్థిక మంత్రి చేసిన ప్రకటన వలన ఈ సంస్థలకు పెద్దమొత్తంలో లబ్ది చేకూరనున్నది.
30 శాతం ఉన్న కార్పొరేట్ పన్నును 22 శాతానికి తగ్గించేందుకు తీసుకున్న నిర్ణయం ద్వారా దాదాపు రూ.1.45 లక్షల కోట్ల ప్రజల సొమ్మును కార్పొరేట్లకు కట్టబెట్టేలా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీంతో పాటు కొత్తగా ఉత్పత్తి పరిశ్రమలు స్థాపించే దేశీయ కంపెనీలకు పన్నును 15 శాతానికి కుదించింది. అదనంగా ఆయా కంపెనీలు చెల్లించే కనీస ప్రత్యామ్నాయ పన్ను(ఎంఏటీ)ని కూడా తొలగించింది. ఈ విధంగా కార్పొరేట్ పన్నును తగ్గించడం ద్వారా మధ్యతరహా పరిశ్రమల కంటే రిలయన్స్, టాటా, వేదాంత, అదానీ వంటి కార్పొరేట్ కంపెనీలకు లబ్ది చేకూరనున్నదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
– ఇప్పటివరకూ భారత్లో వసూలు చేసిన కార్పొరేట్ పన్ను 30శాతం. సెస్, సర్చార్జ్లు అదనం. దీంతో కలుపుకుంటే దాదాపు 35శాతం దాటుతుంది. దీనిని 22శాతానికి తగ్గించారు.
– కొత్తగా ప్రారంభమయ్యే కంపెనీలకు (సెస్, సర్చార్జ్లు కలుపుకొని) 17శాతం కార్పొరేట్ పన్ను వర్తిస్తుంది.
– ఆసియాలోని ఇతర దేశాలతో పోల్చితే అనేక దేశాల్లో మనకన్నా ఎక్కువగా ‘కార్పొరేట్ పన్ను’ వసూలు అవుతోంది.
– చైనాలో 25శాతం, ద.కొరియాలో 25శాతం, బంగ్లాదేశ్లో 25శాతం, మలేసియాలో 24శాతం, జపాన్లో 23.2శాతం కార్పొరేట్ పన్ను వసూలు చేస్తున్నారు.