బెంగళూరు : ఇటీవల రామన్ మెగసెసే అవార్డు అందుకున్న ప్రముఖ జర్నలిస్టు, ఎన్డిటివి ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ రావీష్ కుమార్.. గౌరీ లంకేశ్ మెమోరియల్ తొలి అవార్డును అందుకొన్నారు. ఆదివారం బెంగళూరులో ఈ అవార్డు ప్రదానం చేశారు. ప్రముఖ జర్నలిస్ట్ గౌరీ లంకేశ్ రెండవ వర్ధంతిని పురస్కరించుకొని ఈనెల 5న గౌరీ లంకేష్ మెమోరియల్ ట్రస్ట్ ఈ అవార్డును ప్రకటించింది. సీనియర్ జర్నలిస్ట్ సిద్ధార్థ్ వరదరాజన్, విద్యావేత్త రహమత్ తారికెరే, ఉద్యమకారుడు తీస్తా సెతల్వాద్లతో కూడిన కమిటీ రావీష్ కుమార్ను ఈ అవార్డుకు ఎంపిక చేసింది. ఈ సందర్భంగా రావీష్ కుమార్ మాట్లాడుతూ ‘నాథూరాం గాడ్సేను దేశభక్తుడిగా, గాంధీజీని ఉగ్రవాదిగా చూసే కాలంలో మనం జీవిస్తున్నాం. అంతేకాక దేశంలో అసమ్మతివాదులను.. దేశ వ్యతిరేకులు, అర్బన్ నక్సల్స్, పాకిస్తాన్కు అనుకూలురుగా చిత్రీకరిస్తున్నారు. మన దేశ ప్రజాస్వామ్యం విధానానికి వ్యతిరేక దిశగా వెళుతోంది’ అని ఆయన పేర్కొన్నారు. ఈ అవార్డును ప్రదానం చేసిన హెచ్ఎస్ దొరస్వామి మాట్లాడుతూ పడిపోతున్న వ్యవస్థలను కాపాడాల్సిన ప్రభుత్వం దేశ ప్రజలపై భాషను రుద్దేపనిలో ఉందని విమర్శించారు. గౌరీ లంకేశ్ను బెంగళూరులోని ఆమె ఇంటి ముందు సెప్టెంబర్ 5, 2017న దుండగుడు అతి దారుణంగా కాల్చి చంపిన విషయం తెలిసిందే.
Courtesy Prajashakthi..