A Poem by Rallapally Rajavali
అన్నీ తెలుసు..
బాగా చదువుకున్నవాళ్లే..
లోకజ్ఞానం ఉన్న మనుషులే..
అయినా కులంలోనే కూరుకుపోయారు!
మనిషి గొప్పా?
కులం గొప్పా? అంటే
కులమే గొప్పనే వాళ్లున్న దేశం మనది.
దళితులు, పేదలు..
చిన్నపాటి తప్పుచేసినా,
వాళ్లు ప్రశ్నిస్తూ మాట్లాడినా..
ఆనందంగా మాట్లాడినా..
*నువ్వెంత.. నీకులమెంత…
నీ గతెంత, నీ కథ ఎంత* అంటారు ..
ఆ కొందరు అగ్రవర్ణాలనబడే వాళ్లు!
అదేంటో కులాన్నిబట్టి..
మనిషి ప్రతిభ..
మనిషి జీవితం.. హక్కులూ..
ఉంటాయా?
లౌకికసర్వసత్తాకగణతంత్రప్రజాస్వామ్యదేశమా..
నువ్వు రాసుకున్న ఆదేశసూత్రాలేవీ..
ప్రాథమిక హక్కుల జాడేదీ?
తక్కువ కులమనబడే వాళ్లుండే వాడ..
వాళ్ల ఇళ్లు, నీళ్లు..
టీ, కాఫీలు..
వాళ్ల బువ్వ, కురాకు..
మనసూ, మాటలూ..
అదేంటో..
అగ్రజుల ముందు..
విలువను కోల్పోతాయి.
మలినమవుతాయి..
తక్కువ వుతాయి.
నాకర్థం కానిదేంటంటే..
ఆ పరిస్థితుల్లో..
వాళ్ల అందమైన స్త్రీలు,
కరుకైన మగాళ్ల ఒళ్లు..
ఆ అగ్రజులనబడే వాళ్లకి..
కులమంటదు..
మనిషిగానే ..
వాళ్ల చర్మం రాపిడికి గురవుతుంది!
కులవర్గ దేశంలో..
చిన్నోడు.. తక్కువవాడనే మైండ్సెట్ను..
బీసీ, ఎస్సీ, ఎస్టీ హాస్టల్లంటూ..
ప్రభుత్వాలే సమాజంనుంచి వాళ్లను విడగొడుతున్నాయ్..
ఓట్లకోసమైతే ఖండఖండాలే!
వారిలో మరింత కోపాన్ని కూరుతున్నాయి.
ఆ కొందరూ ..
అదేపనిగా పనిగట్టుకుని
వాళ్లను అలాగే తీర్చిదిద్దుతున్నారు..
పద్ధతిగా!