– ఏడాది కాలంలో భారీగా ఉద్యోగాల కోత
– దినసరి కూలీలు 1.1కోట్ల మంది..
– 62లక్షల మంది వృత్తి నిపుణులు..
– 50లక్షల మంది పారిశ్రామిక కార్మికుల.. ఉపాధి గల్లంతు
– వర్తక, వాణిజ్యాన్ని దారుణంగా దెబ్బకొట్టిన లాక్డౌన్ : రాజకీయ విశ్లేషకులు
న్యూఢిల్లీ : కారణాలేమైనా..గత ఏడాది కాలంలో దేశవ్యాప్తంగా ఉపాధిరంగం అనూహ్యంగా ప్రభావితమైంది. సీఎంఐఈ(సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ) లెక్కల ప్రకారం, ఆగస్టు 2019-ఆగస్టు 2020 మధ్య సుమారుగా 2.1కోట్లమంది ఉపాధి గల్లంతైంది. వృత్తి నిపుణులు, వివిధ పరిశ్రమల్లో పనిచేసే కార్మికులు, దినసరి కూలీలు పెద్ద సంఖ్యలో వీధినపడ్డారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. కరోనా వైరస్ రాకముందే దేశంలో ఉన్న ఆర్థికమాంద్యం, వైరస్ వచ్చాక ఆర్థికవ్యవస్థ మరింత దెబ్బతినటం కోట్లాది మందిని నిరుద్యోగులుగా మార్చిందని గణాంకాలు చెబుతున్నాయి. ఒక్క లాక్డౌన్ వల్ల 1.1కోట్లమంది దినసరి కూలీలు పనిలేక నానా అవస్థ పడటానికి దారితీసింది. సీఎంఐఈ విడుదల చేసిన గణాంకాల ప్రకారం, 1300 సూక్ష్మ, మధ్య, చిన్న తరహా పరిశ్రమల మొదటి త్రైమాసిక ఫలితాలు పరిశీలించాక…వాటి ఉత్పత్తి, సేవలు 41శాతం క్షీణించాయి. కంపెనీల వేతన బిల్లులు 15శాతం తగ్గాయి. దీనినిబట్టి ఈ పరిశ్రమల్లో పెద్ద ఎత్తున ఉద్యోగాల, జీతాల కోత కనపడుతున్నదని విశ్లేషకులు అంచనావేస్తున్నారు.
తిరిగి ఉపాధి పొందినవారు
పేరొందిన సంస్థల్లో వృత్తి నిపుణులు, డెస్క్ సిబ్బంది, బీపీఓ, కేపీఓ ఉద్యోగులు, డాటా ఎంట్రీ ఆపరేటర్లు… మొదలైనవారంతా సగం జీతాలకే పనిచేయాల్సి వస్తోంది. ఇక్కడ ఎవరికీ కూడా మునపటి స్థాయి ఉద్యోగ జీవితం లేదు. లాక్డౌన్ ఎత్తేసాక వ్యాపార కార్యకలాపాలు మునపటిలా సాగటం లేదు.
ఎవరెవరు?
ఇంజనీర్లు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, టీచర్లు, అకౌంటెంట్లు, విషయ నిపుణులు, ప్రయివేటు రంగంలో పనిచేస్తున్న వృత్తి నిపుణులు. పరిశ్రమల్లో పనిచేసే కార్మికులు, వంటవాళ్లు, ఇంటి పనిచేసేవారు, సెక్యూరిటీ గార్డులు, దినసరి కూలీలు, హోటళ్లు, పర్యాటకరంగంలోని డెస్క్ సిబ్బంది…ఎక్కువ సంఖ్యలో ఉద్యోగాలు కోల్పోయారు.
ఎంతమంది ?
గత ఏడాది కాలంలో 1.1కోట్లమంది దినసరి కూలీలు ఉపాధి కోల్పోయారు. పేరొందిన సంస్థల్లో 62లక్షల మంది వృత్తి నిపుణులు, 50లక్షల మంది పరిశ్రమల్లో పనిచేసిన కార్మికులు…ఇప్పుడు పని కోసం వెతుక్కుంటున్నారు. లాక్డౌన్ ఎత్తేశాక కూడా జులై నెలలో 48 లక్షలు, ఆగస్టులో 33లక్షల రెగ్యులర్ ఉద్యోగాలు పోయాయి. నిర్మాణరంగంలో ప్రాజెక్ట్లన్నీ ఆగిపోవటంతో ఎంతమంది ఉపాధి కోల్పోయారన్నదానిపై లెక్కలేదు.
Courtesy: NT