రాష్ట్రంలో 5 ఎకరాల్లోపు భూమిఉన్నవారు 90.75 శాతం
రైతుబంధు పంపిణీలో వెల్లడి
హైదరాబాద్: రాష్ట్రంలోని మొత్తం రైతాంగంలో 90.75 శాతం మంది సన్న, చిన్నకారు రైతులేనని వ్యవసాయ శాఖ స్పష్టంచేసింది. రైతుబంధు నిధుల పంపిణీ ఆధారంగా ఏ రైతుకు ఎంత భూమి ఉందనే లెక్కలను ఈ శాఖ తయారుచేసింది. ప్రస్తుత వానాకాలం(ఖరీఫ్) సీజన్లో రైతుబంధు పథకం కింద రూ.7,209 కోట్లను అన్నదాతల బ్యాంకు ఖాతాల్లో వ్యవసాయ శాఖ జమచేసింది. ఈ నిధులు అందుకున్న ఒక్కో రైతుకు ఎంత భూమి ఉందనే వివరాలను ముఖ్యమంత్రి కేసీఆర్ శాసనమండలిలో ప్రకటించారు.
రాష్ట్రంలో మొత్తం 60.95 లక్షల మంది రైతులకు కోటిన్నర ఎకరాల భూములున్నాయి. వీరిలో 55.31 లక్షల (90.75 శాతం) మందికి 5 ఎకరాల్లోపే ఉంది. మొత్తం భూ విస్తీర్ణం కోటిన్నర ఎకరాల్లో వీరి వద్ద ఉన్న భూమి 69.41 శాతం.
మిగిలిన 9.25 శాతం మంది భూస్వాముల చేతిలో 30.59 శాతం భూములున్నాయి.
25 ఎకరాలకుపైగా భూమి గల వారి సంఖ్య 6,679 కాగా వారి వద్ద మొత్తం 2.24 లక్షల ఎకరాలుండగా రూ.112.30 కోట్ల రైతుబంధు సొమ్ము పొందారు. ఈ 6,679 మందికి ప్రభుత్వం రైతుబంధు కింద వానాకాలం సీజన్లో సగటున ఒక్కొక్కరికి రూ.1,68,238 చొప్పున అందజేసింది.
రాష్ట్రంలో 20 ఎకరాలకుపైగా భూమి ఉన్న రైతులు మొత్తం 14,046 మంది ఉన్నారు. వానాకాలంలో వీరికి రూ.193.93 కోట్లు ఇచ్చినట్లు వ్యవసాయశాఖ తెలిపింది.
* ఈ పథకం కింద ప్రతి సీజన్లో ఎకరానికి రూ.5 వేల చొప్పున రైతు ఖాతాలో వ్యవసాయ శాఖ జమచేస్తోంది. అంటే ఏడాదిలో వానాకాలం, యాసంగి కలిపి మొత్తం రూ.10 వేల చొప్పున ఒక్కో ఎకరానికి అందుతాయి.
Courtesy Eenadu