– మోడీ ప్రభుత్వ విధానాలను ఎండగడతా..
– హిందూత్వ.. కార్పొరేట్ రాజకీయాలపై అలుపెరగని పోరు
– ఎమర్జెన్సీనే ఎదుర్కొన్నా… ఈ ప్రభుత్వానికి బెదిరేది లేదు
– సీఏఏ వ్యతిరేక నిరసనలకు ఢిల్లీ అల్లర్లకు లింకు పెట్టాలని బీజేపీ కుట్ర : ఏచూరి
న్యూఢిల్లీ : ప్రధాని మోడీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం తన గొంతు నొక్కేయాలని చూస్తుందని సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి వ్యాఖ్యానించారు. తనలాగే మోడీ ప్రభుత్వ వైఫల్యాలు, హిందూత్వ రాజకీయాలు, కార్పొరేట్ విధానాలను ప్రశ్నిస్తున్న నాయకులు, విద్యావేత్తలు, సామాజిక కార్యకర్తలు, జర్నలిస్టులు, విద్యార్థులను ఇబ్బంది పెట్టాలని కుట్ర చేస్తున్నా రని వెల్లడించారు. తాను అత్యయిక పరిస్థితి (ఎమర్జెన్సీ)నే ఎదుర్కొన్నవాడిననీ ఈ ప్రభుత్వానికి బెదిరేది లేదని ఆయన స్పష్టం చేశారు. దాంతోపాటు, సీఏఏ వ్యతిరేక నిరసనలకు ఢిల్లీ అల్లర్లకు లింకు పెట్టాలని బీజేపీ, దాని సైద్ధాంతిక గురువు ఆర్ఎస్ఎస్ తీవ్రంగా యత్నిస్తున్నట్టు చెప్పారు. అందుకే ఢిల్లీ అల్లర్ల కేసు అభియోగ పత్రంలో తన పేరు పెట్టారన్నారు. ము ఖ్యంగా ఈవిషయంలో కేంద్ర హౌంశాఖ మంత్రి అమిత్షా కుట్ర చేస్తున్నట్టు ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ఢిల్లీ పోలీసులు ఆయన పరిధి కిందకే వస్తారన్న విషయం అందరికీ తెలిసిందేనని అన్నారు. అందుకే తాము ఈఅంశంలో ప్రభుత్వ చర్యలను ఖండిస్తు న్నట్టు వెల్లడించారు. సెప్టెంబర్12వ తేదీన సీపీఐ (ఎం) పోలిట్బ్యూరో ఆన్లైన్లో జరిగింది. ఈ సమావేశంలో తాజా రాజకీయ పరిస్థితులపై పీబీ చర్చించింది. ఆ అంశాలను సీతారాం ఏచూరి ఆదివారం సీపీఐ(ఎం) కేంద్ర కార్యాలయం (ఏకేజీ భవన్)లో మీడియాకి వివరించారు. కరోనా వల్ల దేశమంతా అతలాకుతలమైందనీ, మోడీ అనాలోచిత చర్యల కారణంగా ప్రపంచంలో అతి ఎక్కువ బాధిత దేశంగా భారత్ తయారైందని ఏచూరి చెప్పారు.
స్వాతంత్య్రం వచ్చాక అతిపెద్ద ఆర్థిక సంక్షోభం ..
మోడీ ప్రభుత్వ అసమర్థ విధానాల కారణంగా భారతదేశ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిపోయిందని ఏచూరి ఆరోపించారు. దీంతో వేలాది మంది ప్రజానీకం రోడ్డు మీద పడ్డారని తెలిపారు. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఇదే అతి పెద్ద ఆర్థిక సంక్షోభం అని అన్నారు. జీఎస్టీ, నోట్లరద్దుతో అప్పటికే మందగమనంలో ఉన్న భారత ఆర్థిక వ్యవస్థ.. తాజా పరిస్థితుల కారణంగా మరింత ఇబ్బందుల్లో పడిందన్నారు. మోడీ ప్రభుత్వ విధానాలు, కరోనా కారణంగా మైనస్ 24 శాతానికి జీడీపీ పడిపోయిందని వివరించారు. ఆత్మనిర్భర్ ఏమైనా ఉపయోగపడుతుందా? అనుకుంటే.. మోడీ దానిని ‘ఆత్మ సమర్పణ్’ చేశారని విమర్శించారు. ప్రజల దగ్గర ఏమైనా కొనేందుకు కూడా డబ్బులు లేని దారుణ పరిస్థితి క్షేత్రస్థాయిలో నెలకొందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వమే పెద్ద ఎత్తున డబ్బులు ఖర్చు చేయాలని సూచించారు. కానీ మోడీ సర్కారు తన అనుకూల బడా పెట్టుబడిదారులకు వ్యతిరేక నిర్ణయం తీసుకునే స్థితిలో లేదన్నారు. తాజాగా సుమారు 15 కోట్ల మంది యువత ఉపాధి కోల్పోయినట్టు వాపోయారు. కరోనా వల్ల నెలవారీ జీతాలు పొందే 2.1 కోట్లమంది ఉద్యోగాలు గల్లంతైనట్టు వెల్లడించారు. ఇంతటి క్లిష్ట పరిస్థితులున్నాయనే తమ పార్టీ ఆదాయ పన్ను పరిధిలోకి రాని ప్రతి ఒక్క కుటుంబానికి రూ.7,500 ఇవ్వాలని డిమాండ్ చేసినట్టు గుర్తు చేశారు. దాంతోపాటు, గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో వలసలు, నిరుద్యోగాన్ని కట్టడి చేసేందుకు ‘నరేగా’కి మరిన్ని నిధులు పెంచి… గోడౌన్లలో ఉన్న ఆహారధాన్యాలను పంచి పెట్టాలని సూచించారు. మోడీ సర్కారు వీటిపై ఎందుకు దష్టి పెట్టడం లేదని నిలదీశారు.
కేరళకు సాధ్యమైనప్పుడు కేంద్రానికి ఎందుకు కాదు?
కరోనా మహమ్మారిని కట్టడి చేయడంలో కేంద్రం పూర్తి విఫలమైందని ఏచూరి అన్నారు. వామపక్షాల సారథ్యంలోని విజయన్ సర్కారు ఆ రాష్ట్రంలోని ప్రతి పౌరుడికి ఉచిత చికిత్స అందించినట్టు వెల్లడించారు. 2 శాతం ప్రజానీకం మాత్రమే ఆ రాష్ట్రంలో ప్రయివేటు ఆస్పత్రులకు వెళ్ళినట్టు చెప్పారు. మిగతావారంతా ప్రభుత్వ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నట్టు గుర్తు చేశారు. కేరళ చేసినట్టు ఇతర రాష్ట్రాల్లో, కేంద్ర ప్రభుత్వం ఎందుకు చేయలేకపోయిందని ప్రశ్నించారు. కరోనా వచ్చినప్పటి నుంచి కేరళలో సుమారు 78 లక్షల మందికి ఉచిత భోజనం అందజేస్తున్నట్టు వివరించారు. ఎనిమిది లక్షల మందికి సామాజిక భద్రత పింఛన్లు ఇస్తున్నట్టు వివరించారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు అధికారంలో ఉన్న దగ్గర ఈ పనులు ఎందుకు చేయలేకపోతున్నారని ప్రశ్నించారు. కరోనాతో ఒక వైపు పోరాడుతూనే… మరోవైపు ప్రజానీకాన్ని ఆదుకునేందుకు బాధ్యతగా ప్రభుత్వం వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు.
ఈ సమయంలో కాషాయ, కార్పొరేట్ ఎజెండా..?
మోడీ ప్రభుత్వం కరోనాని సాకుగా తీసుకొని తన కాషాయ, కార్పొరేట్ ఎజెండా అమలుకు వేగంగా అడుగులు వేస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. జాతి సంపదని ప్రయివేటు, కార్పొరేట్ శక్తులకి దోచిపెట్టేందుకు కీలకంగా పని చేస్తున్నట్టు ఆగ్రహం వ్యక్తం చేశారు. దాంతోపాటు, కార్మికులు పోరాడి సాధించికున్న హక్కులను పార్లమెంటరీ ఫోరంలో ఎటువంటి చర్చలు లేకుండా రద్దు చేయడాన్ని ఖండిస్తున్నామని అన్నారు. రాష్ట్రాలకు జీఎస్టీ బకాయిలు ఇవ్వకుండా సమాఖ్య వ్యవస్థకు తూట్లు పొడుస్తున్నట్టు ఆరోపించారు. తక్షణమే వాటిని రాష్ట్రాలకు చెల్లించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో కేంద్రమే అప్పు తీసుకొని రాష్ట్రాలకు ఇవ్వాలన్నారు. రాష్ట్రాలను అప్పులు తీసుకోమని చెప్పడం లేదా ‘దేవుడే కాపాడగలడ’నే అర్థరహిత మాటలు సరికాదని తెలిపారు. జీఎస్టీ చట్ట రూపకల్పన, పార్లమెంట్లో ఆ బిల్లుపై చర్చ జరిగినప్పుడు రాష్ట్రాలకు జీఎస్టీ బకాయిలు వేగంగా చెల్లిస్తామని కేంద్రం చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. మరి ఇప్పుడు మాట తప్పారా… చెప్పాలన్నారు.
ఢిల్లీ అల్లర్లలో నిందితులను అరెస్టు చేయకుండా…. దళితులు, మైనార్టీలే లక్ష్యంగా దాడులు చేస్తున్నట్టు ఆందోళన వ్యక్తం చేశారు. సీఏఏ వ్యతిరేక నిరసనల్లో పాల్గొన్న వారిని కరోనా కాలంలో అరెస్టు చేసి వేధించినట్టు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలను పూర్తిగా దుర్వినియోగం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలు బీజేపీ ప్రయోజనాలకి ఉపయోగపడుతున్నాయని వివరించారు. రాజ్యాంగ విలువలు, ప్రజాస్వామ్య సూత్రాలను మోడీ సర్కారు ధ్వంసం చేస్తుందన్నారు. వివిధ కేసుల్లో అరెస్టైన అమాయక దళితులు, మైనార్టీలను తక్షణమే విడుదల చేయాలని తమ పార్టీ పొలిట్బ్యూరో డిమాండ్ చేసినట్టు వెల్లడించారు. అంతేగాక దేశంలోని సహజ వనరులను ప్రయివేటు శక్తులకి అప్పగిస్తూ మోడీ సర్కారు పచ్చజెండా ఊపడం బాధాకరమన్నారు. పర్యావరణం పూర్తిగా ధ్వంసమయ్యే ప్రమాదం ఉందని తెలిసినా పట్టించుకోకుండా ముందడుగు వేయడం ప్రమాదకరమని ఏచూరి వాపోయారు. ప్రముఖ సోషల్ మీడియా సైట్ ఫేస్బుక్ తో బీజేపీ ఏర్పరుచుకున్న సంబంధంపై కనీసం మోడీ ప్రభుత్వం సమాధానం కూడా ఇవ్వడం లేదన్నారు. దీనిపై జేపీపీతో విచారణ జరిపించాలన్నారు. అధికార పార్టీ దాని అనుబంధ సంస్థల ఫేక్ న్యూస్ ఏ సోషల్ మీడియాలో రాకుండా చేయాలని పిలుపునిచ్చారు. దీనివల్ల మత సామరస్యత దెబ్బతినదన్నారు.
చైనా భారత్ల మధ్య ఉన్న అభిప్రాయ బేధాలు వివాదాలుగా మారకుండా కేంద్ర ప్రభుత్వం చర్చలు జరపాలని సూచించారు. మిలిటరీ, డిప్లామిటిక్, పొలిటికల్ సొల్యూషన్ కోసం ప్రయత్నం చేయాలన్నారు. ఇటీవల రెండు దేశాల విదేశాంగ శాఖ మంత్రుల స్థాయి సమావేశంలో ఈ మేరకు చర్చ జరగలేదన్నారు. కేవలం ఎల్ఏసీ వద్ద ఉద్రిక్త పరిస్థితులను తగ్గుముఖం పట్టించేందుకే పరిమితం అయిందన్నారు.
ఫాసిస్టు విధానాలపై దేశవ్యాప్త నిరసనలు
మోడీ ప్రభుత్వం అవలంభిస్తున్న ఫాసిస్టు, కార్పొరేట్ విధానాలకి వ్యతిరేకంగా తమ పార్టీ దేశవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించాలని నిర్ణయించినట్టు వెల్లడించారు. భారత రాజ్యాంగాన్ని పరిరక్షించుకునేందుకు… సంవిధాన మూల సూత్రాలైన స్వేచ్ఛ, సెక్యులరిజం, సౌభ్రాతృత్వం, ప్రజాస్వామ్యం, తదితర అంశాలను కాపాడుకుంటేనే రానున్న తరాలకు మంచి దేశాన్ని అందించే దిశగా తమ పార్టీ పని చేస్తుందన్నారు. ఇక ఢిల్లీ అల్లర్ల కేసులో తన పేరు అభియోగపత్రంలో లేదని పోలీసులు చెబుతున్నట్టు వస్తున్న వార్తలను ఏచూరి ఖండించారు. అసలు ఆ చార్జీషీట్ సోషల్ మీడియాలోకి ఏ విధంగా వచ్చిందో కేంద్ర హౌంశాఖ మంత్రి అమిత్ షా సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. శాంతియుతంగా సీఏఏ వ్యతిరేక నిరసన కార్యక్రమాలు నిర్వహించడం తప్పా? అని ఆయన నిలదీశారు. విద్వేష వ్యాఖ్యలు చేసిన వారిపై ఎలాంటి చర్యలు లేకపోవడం ఏంటని అడిగారు. 57 మంది అమాయకుల ప్రాణాలు బలికావడానికి కారణమైన వారిని ఎందుకు ఇప్పటికీ అరెస్టు చేయలేదన్నారు. కేంద్ర ఆర్థిక సహాయ మంత్రే స్వయంగా మత సామరస్యత దెబ్బతినేలా వ్యాఖ్యలు చేయడంపై ప్రభుత్వం సమాధానం చెప్పకపోవడం దారుణం అన్నారు.
కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసులో సీపీఐ(ఎం) పీబీ సభ్యుడు కుమారుడు, ఆ రాష్ట్ర మంత్రిని కేంద్ర ప్రభుత్వ విచారణ సంస్థలు ప్రశ్నించాయనీ, ఈ పరిణామాలు ఏమైనా పార్టీకి రాబోయే ఎన్నికల్లో ఇబ్బందికరం అవుతాయా? అని ఓ మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకి సమాధానమిస్తూ.. ఈ అంశం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనిది కాదన్నారు. ఎయిర్పోర్టులో గోల్డ్ స్మగ్లింగ్ అంశం కేంద్ర ప్రభుత్వ అధికార పరిధిలోనిదనీ… ఈ కేసులో కొంతమంది పార్టీ నేతలు, వారి కుమారులను విచారణ సంస్థలు ప్రశ్నిస్తున్నాయని అన్నారు. అంతమాత్రాన వారంతా తప్పు చేశారని కాదని అన్నారు. విచారణ పూర్తి అయిన తర్వాత అన్ని విషయాలు తెలుస్తాయన్నారు.
మోడీ సర్కార్ను నిలదీయడానికి ప్రతిపక్షాలు సై
– ఢిల్లీ అల్లర్ల కేసులో ఏచూరి పేరు చేర్చడంపై అభ్యంతరం
– స్పీకర్ ఓంబిర్లాకి వాయిదా తీర్మానం నోటీసులిచ్చిన సీపీఐ(ఎం) కెకె రాగేష్
సంబంధం లేని వ్యక్తులను ఢిల్లీ అల్లర్లకు కారకులుగా చేస్తూ చార్జిషీటు దాఖలు చేయడాన్ని పార్లమెంట్ వేదికగా ప్రతిపక్షాలు మోడీ సర్కార్ను నిలదీసేందుకు సిద్ధమయ్యాయి. ఇప్పటికే ఇదే అంశంపై వివిధ పార్టీల నేతలు నోటీసులు ఇచ్చారు. పార్లమెంట్లో చర్చించాలని డిమాండ్ చేస్తూ నోటీసుల్లో పేర్కొన్నారు. ఢిల్లీ అల్లర్లకు కారకులను చేస్తూ సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, ఆర్థిక వేత్త జయతి ఘోష్, స్వరాజ్ అభియాన్ నేత యోగేంద్ర యాదవ్, ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ అపూర్వానందన్, డాక్యూమెంటరీ ఫిల్మ్ మేకర్ రాహుల్ రారులపై కేంద్ర హోం మంత్రిత్వ పరిధిలో ఉన్న ఢిల్లీ పోలీసులు చార్జీషీటు దాఖలు చేశారు. దీనిపై ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నాయి. సంబంధం లేని వ్యక్తులు, మేధావులపై ఇలాంటి బరితెగింపునకు పాల్పడటం దారుణమని ప్రతిపక్షనేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వామపక్ష ఎంపీలు ఉభయసభల్లో వాయిదా తీర్మాన నోటీసులు ఇచ్చారు. బిజినెస్ను సస్పెండ్ చేయాలని కోరుతూ సీపీఐ(ఎం) రాజ్యసభ ఎంపీి కెకె రాగేష్ రూల్ నెంబర్ 267 ప్రకారం వాయిదా తీర్మానం నోటీసులు ఇచ్చారు. అలాగే మరో సీపీఐ(ఎం) ఎంపీ ఎలమారం కరీం, సీపీఐ ఎంపీ బినరు విశ్వం కూడా రాజ్యసభలో ఇదే అంశంపై నోటీసులు ఇచ్చారు. లోక్సభలో సీపీఐ(ఎం) ఎంపీ ఎఎం ఆరీఫ్ వాయిదా తీర్మాన నోటీసులు ఇచ్చారు. కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ మాట్లాడుతూ.. చార్జీషీట్లో సీతారాం ఏచూరి, ఇతర మేధావుల పేర్లను నమోదుచేయడంపై తమ పార్టీ ఉభయసభల్లో లేవనెత్తుతుందని పేర్కొన్నారు.
Courtesy: NT