- ఏసీబీ వలలో అదనపు కలెక్టర్.. నాగరాజు తరహాలో భారీ లంచం
- 112 ఎకరాల భూమికి ఎన్వోసీ కోసం 1.12 కోట్ల లంచం డిమాండ్
- 40 లక్షలిచ్చిన బాధితుడు.. మిగిలిన మొత్తానికి బ్లాంక్ చెక్కులు
- ఐదెకరాల భూమి అగ్రిమెంట్.. ఆధారాలతో ఏసీబీ వద్దకు బాధితుడు
- అదనపు కలెక్టర్ నివాసంలో ఏసీబీ సోదాలు.. డాక్యుమెంట్లు స్వాధీనం
- నర్సాపూర్ ఆర్డీవో ఇంటిలో 28 లక్షలు, అరకిలో బంగారం స్వాధీనం
- అదనపు కలెక్టరు, ఆర్డీవో, మరో ముగ్గురు సిబ్బంది అరెస్టు
మెదక్/మెదక్ రూరల్ : అవినీతి నిరోధకశాఖ వలలో భారీ తిమింగలం పడింది. ఏకంగా ఓ జిల్లా అదనపు కలెక్టరే ఏసీబీ అధికారుల చేతికి చిక్కారు. 112 ఎకరాల భూమికి సంబంధించి నిరభ్యంతర పత్రం(ఎన్వోసీ)ని ఇచ్చేందుకు 1.12 కోట్ల లంచం డిమాండ్ చేసిన మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ నగే్షను ఏసీబీ అరెస్టు చేసింది. ఆయనతోపాటు ఆర్డీవో అరుణారెడ్డి, తహసీల్దార్ సత్తార్, మరో ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకుంది. అవినీతిలో కూరుకుపోయిన రెవెన్యూశాఖను ప్రక్షాళన చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నూతన రెవెన్యూ చట్టాన్నిశాసనసభలో ప్రవేశపెట్టిన సమయంలోనే.. రెవెన్యూ శాఖలో ఓ జిల్లాస్థాయి అధికారి ఏసీబీకి చిక్కడం గమనార్హం.
ఇదీ అసలు కథ
మెదక్ జిల్లా రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లికి చెందిన కె.లింగమూర్తి ఈ ఏడాది ఫిబ్రవరిలో మరికొందరి వ్యక్తులతో కలిసి మెదక్జిల్లా నర్సాపూర్ మండలం చిప్పల్తుర్తి గ్రామంలోని సర్వేనంబర్లు 59/31, 59/40, 58/1, 58/2లలోని 112.21 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. ఈ భూమి నిషేఽధిత భూముల జాబితా అయిన 22-ఏలో ఉండడంతో ఎన్వోసీ కోసం లింగమూర్తి జూలై 21న అప్పటి నర్సాపూర్ ఇన్చార్జి తహసీల్దార్ సత్తార్కు దరఖాస్తు చేసుకున్నారు. జూలై 23న ఆ దరఖాస్తును నర్సాపూర్ ఆర్డీవోకు పంపగా నర్సాపూర్ ఆర్డీవో అరుణారెడ్డి అదేనెల 25న కలెక్టరేట్ కార్యాలయానికి పంపారు. 112 ఎకరాలకుగానూ ఎకరాకు రూ.లక్ష చొప్పున రూ.1.12 కోట్లు లంచం ఇవ్వాలంటూ లింగమూర్తిని అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ డిమాండ్ చేశారు రెండు విడతల్లో రూ.40 లక్షలను అదనపు కలెక్టర్కు లింగమూర్తి అందజేశారు. మిగిలిన రూ.79 లక్షలకు సంబంధించి నగేష్ బినామీ అయిన సికింద్రాబాద్కు చెందిన జీవన్గౌడ్ పేరిట ఐదెకరాల భూమిని అగ్రిమెంట్ చేశారు. దాంతోపాటు సంతకం చేసిన 8 బ్లాంక్ చెక్కులను ష్యూరిటీగా లింగమూర్తి నుంచి అదనపు కలెక్టర్ తీసుకున్నారు అదనపు కలెక్టర్ సూచనల మేరకు ఏడీ సర్వేయర్ అండ్ లాండ్ రికార్డు కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న వసీమ్అహ్మద్ లింగమూర్తినుంచి మరో 5 లక్షలు నగదు తీసుకున్నాడు. ఆగస్టు 22న రంగారెడ్డి జిల్లా డీఎస్పీ సూర్యనారాయణకు ఆధారాలతో సహా లింగమూర్తి ఫిర్యాదు చేశారు. అదనపు కలెక్టర్ నగే్షతో వివిధ సందర్భాల్లో లంచం చెల్లింపుల గురించి జరిగిన సంభాషణల ఆడియో రికార్డులను సమర్పించారు. దీంతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు బుధవారం ఉదయం మెదక్ మండలం మాచవరంలోని జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ క్యాంపు కార్యాలయం (అధికారిక నివాసం) లో సోదాలు నిర్వహించారు. లింగమూర్తి ఇచ్చిన 8 బ్లాంక్ చెక్కులు, నగేష్ బినామీ పేరిట ఐదెకరాల భూమి రాసినట్లు కుదుర్చుకున్న ఒప్పంద పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. నగేష్ సతీమణి మమతను అదుపులోకి తీసుకొన్న ఏసీబీ అధికారుల బృందం ఒకటి హైదరాబాద్ కొంపల్లిలో ఆయనకు చెందిన విల్లాలో తనిఖీలు నిర్వహించారు.
ఆర్డీవో నివాసంలో నగదు స్వాధీనం
ఏసీబీ అధికారులు రాష్ట్రవ్యాప్తంగా 12 చోట్ల ఏకకాలంలో దాడులు చేశారు. రంగారెడ్డి జిల్లా చౌదరిగూడలో ఉన్న నర్సాపూర్ ఆర్డీవో అరుణారెడ్డి నివాసంలో సోదాలు చేసి రూ.28 లక్షల నగదు, అరకిలో బంగారు ఆభరణాలు స్వాదీనం చేసుకున్నారు. చిల్పచెడ్ తహసీల్దార్ అబ్దుల్ సత్తార్ నివాసంలోనూ తనిఖీలు చేశారు. జూనియర్ అసిస్టెంట్ వసీమ్ అహ్మద్, అదనపు కలెక్టర్ బినామీ అయిన కోళ జీవన్గౌడ్ నివాసాల్లోనూ సోదాలుచేసి పలు పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. అదనపు కలెక్టర్ నగేష్, నర్సాపూర్ ఆర్డీవో అరుణారెడ్డి, తహసీల్దార్ అబ్దుల్ సత్తార్, ఏడీ సర్వే అండ్ లాండ్రికార్డ్స్ జూనియర్ అసిస్టెంట్ మహ్మద్ వసీం, జీవన్గౌడ్ను అరెస్టు చేసినట్లు అవినీతి నిరోధక శాఖ డైరెక్టర్ జనరల్ ప్రకటించారు. వీరిని హైదరాబాద్లోని ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపర్చనున్నట్లు పేర్కొన్నారు. బుధవారం రాత్రి 11 గంటల ప్రాంతంలోనూ సోదాలు కొనసాగుతున్నాయి.
ప్రతి పనికీ ముడుపులివ్వాల్సిందే
మెదక్ అదనపు కలెక్టర్ నగే్షపై చాలా కాలంనుంచి అవినీతి ఆరోపణలున్నాయి. మనోహరాబాద్ మండలంలోని ఓ భూమి మ్యుటేషన్ విషయంలో ఎకరం స్థలాన్ని తన బినామీల పేరిట రిజిస్ట్రేషన్ చేయాలని ఆయన డిమాండ్ చేసినట్లు ఆరోపణలున్నాయి. అదేవిధంగా హెచ్ఎండీఏ పరిధిలోని తూప్రాన్, మనోహరాబాద్, నర్సాపూర్ మండలాల్లో పెద్దఎత్తున అవినీతికి పాల్పడినట్లు సమాచారం. ముఖ్యంగా రెవెన్యూ కోర్టు కేసులు, ఎన్వోసీ ల విషయంలో భారీ వసూళ్లకు పాల్పడినట్లు తెలుస్తోంది.
మరో ఏడాదిలో ఐఏఎస్ అయ్యేవారు
అదనపు కలెక్టర్ నగేష్ నిజామాబాద్ జిల్లాకు చెందిన వారు. గ్రూప్ -2 ద్వారా సెక్రటేరియట్ సర్వీ్సకు ఎంపికయ్యారు. సెక్రటేరియట్లో ఏఎ్సవో, ఎస్వోగా పనిచేసి.. డిప్యూటీ కలెక్టర్గా పదోన్నతి పొందారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పరిధిలోని కామారెడ్డిలో గతంలో ఆర్డీవోగా పనిచేశారు. కొత్త జిల్లాలు ఏర్పాటైన తర్వాత జగిత్యాల డీఆర్వోగా బదిలీపై వెళ్లారు. తర్వాత మెదక్కు అదనపు కలెక్టర్గా వెళ్లారు. మరో సంవత్సరంలో కన్ఫర్డ్డ్ హోదాలో ఐఏఎస్ అయ్యే అవకాశం ఉన్న సమయంలో ఏసీబీకి పట్టుబడ్డారు.
Courtesy Andhrajyothi