- టిక్టాక్లో పరిచయమైన దేవరాజ్ రెడ్డితో ప్రేమ
- అతడి వేధింపుల వల్లే ఆత్మహత్య చేసుకుందన్న కుటుంబ సభ్యులు
- కుటుంబం, మరో వ్యక్తి వేధింపుల వల్లే: దేవరాజ్
- కేసు నమోదు.. కొనసాగుతున్న దర్యాప్తు
హైదరాబాద్ సిటీ/అమీర్పేట : మనసు మమత, మౌనరాగం వంటి సీరియళ్లతో పాపులర్ అయిన బుల్లితెర నటి శ్రావణి (26) అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ నియోజకవర్గం గొట్టిప్రోలుకు చెందిన శ్రావణి 8 ఏళ్ల క్రితం నగరానికి వచ్చి టీవీ సీరియళ్లలో నటిస్తోంది. ఆర్థికంగా పుంజుకోవడంతో స్వగ్రామంలో ఉంటున్న తల్లిదండ్రులను, సోదరుణ్ని కూడా తనవద్దకే పిలిపించుకుంది. ఏడాది క్రితం టిక్టాక్లో ఆమెకు.. కాకినాడకు చెందిన దేవరాజ్రెడ్డి అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం క్రమంగా ప్రేమగా మారింది. తర్వాత అతడు ఆమె ఇంట్లోనే ఉండసాగాడు. శ్రావణి అతడికి కూడా సీరియళ్లలో అవకాశం ఇప్పించింది. ఈ క్రమంలోనే దేవరాజ్ రెడ్డి ఆమెను డబ్బుల కోసం వేధించాడని.. డబ్బులు ఇవ్వకుంటే.. ఇద్దరూ కలిసి దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో పెడతానని బెదిరించేవాడని శ్రావణి కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. దేవరాజ్రెడ్డి వేధింపులు భరించలేక శ్రావణి ఈ ఏడాది జూన్లో పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు చెప్పారు. దేవరాజ్రెడ్డిపై పోలీసులు అప్పట్లో కేసు నమోదు చేశారుగానీ.. ఆ తర్వాత మూడురోజులకే శ్రావణి కేసును వాపసు తీసుకుంది. దేవరాజ్ శ్రావణి ఇంటిని వదిలి వెళ్లిపోయి వేరుగా ఉంటున్నాడు. దేవరాజ్ రెడ్డి ఇంటి నుంచి వెళ్లిపోయినప్పటికీ శ్రావణిని కలుస్తున్నట్టు సమాచారం.
వారం రోజుల క్రితం శ్రావణి అతడితో కలిసి పంజగుట్టలోని ఓ రెస్టారెంట్లో ఉండగా తల్లి దండ్రులు గమనించారని.. మరోసారి ఆమెను బైకుపై డ్రాప్ చేయడం చూశారని.. అతణ్ని కలవడం మానేయాలని మందలించారని తెలుస్తోంది. ఈ క్రమంలో.. మంగళవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో శ్రావణి అనుమానాస్పద స్థితిలో మరణించింది. శ్రావణి తన గదిలో నుంచి ఎంతసేపటికీ బయటకు రాకపోవడంతో కుటుంబసభ్యులు బలవంతంగా తలుపులు తెరిచిచూడగా ఫ్యానుకు వేలాడుతూ కనిపించింది. వెంటనే చికిత్స నిమిత్తం ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే ఆమె చనిపోయినట్లు వైద్యులు వెల్లడించారు. తమ కూతురు మరణానికి దేవరాజ్ రెడ్డి కారణమని.. అతను నిత్యం పెడుతున్న బాధలు, బెదిరింపులు భరించలేకనే ఆత్మహత్యకు పాల్పడిందని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాధులో తల్లి పాపారత్నం పేర్కొన్నారు. అతడిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోరారు. వారి ఫిర్యాదు మేరకు దేవరాజ్ రెడ్డిపై కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టమ్ నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.
నాకు సంబంధం లేదు: దేవరాజ్రెడ్డి
శ్రావణి ఆత్మహత్యకు తాను కారణమంటూ వైరల్ అవుతున్న వార్తలను దేవరాజ్ ఖండించాడు. ఆమె మృతికి, తనకు సంబంధం లేదని ఓ వీడియో రికార్డు విడుదల చేశాడు. శ్రావణి ఆత్మహత్యకు ఆమె కుటుంబ సభ్యులతో పాటు, సాయికృష్ణ అనే మరో వ్యక్తి కారణమని.. తనను కలవద్దంటూ కుటుంబ సభ్యులు ఆమెను కొట్టడంతోనే మనస్తాపం చెంది శ్రావణి ఆత్మహత్య చేసుకుందన్నారు. ఈ విషయం శ్రావణి చివరిసారిగా తనకు ఫోన్ చేసి చెప్పిందన్నారు. తాను ఆమె వద్ద డబ్బులు డిమాండ్ చేసినట్లు వస్తున్న ఆరోపణలు అవాస్తవమని దేవరాజ్ తెలిపాడు. కుటుంబసభ్యుల ఒత్తిడితోనే జూన్లో ఆమె తనపై పోలీస్ కేసు పెట్టిందని పేర్కొన్నాడు. నిజానికి శ్రావణి తనను ప్రేమించిందని చెప్పాడు. గతంలో తాను, శ్రావణి కలిసి డిన్నర్కి వెళ్లామని.. అక్కడికి సాయి అనే వ్యక్తి వచ్చి శ్రావణిపై చేయి చేసుకున్నట్టు దేవరాజ్ చెప్పాడు. ‘‘మా నాన్న, అమ్మ చాలా దారుణంగా కొట్టారు. మా తమ్ముడు నన్ను హింసించాడు. సాయి అనే వ్యక్తి రోడ్డుపై జుట్టు పట్టుకుని కొట్టాడు. వీళ్ల మొహాలు జీవితంలో చూడ దలుచుకోలేదు. నా చావుకు కారణం సాయి’’ అని శ్రావణి చివరిగా తనతో చెప్పిందని దేవరాజ్ వీడియోలో పేర్కొన్నాడు.
Courtesy Andhrajyothi