– ఆర్థిక కష్టాల్లో ఆర్టీసీ కార్మికులు
– కరోనా దెబ్బకు కోలుకోని బతుకులు
హైదరాబాద్ : శల్యుడి సారథ్యంలో కర్ణుడి రథచక్రం బురదలో కూరుకుపోయిందనీ, కర్ణుడి చావుకు అది చివరి కారణంగా మహాభారత గాథ చెప్తున్నది. నేడు ఆర్టీసీ కార్మికులకున్న శతకోటి సమస్యల్లో ప్రధానమైంది తమ సంస్థ బతికి బట్టకడ్తుందా అనేది. 2001లో ఏపీఎస్ఆర్టీసీలో జరిగిన 24 రోజుల సమ్మెలోనూ, మొన్న టీఎస్ఆర్టీసీలో 53+2 రోజుల సమ్మెలోనూ ఆ కార్మికుల ప్రధాన డిమాండ్ సంస్థ పరిరక్షణ. అందుకే యాభై వేల మంది తెగించి పోరాడారు. దారిలో కొందరు నేలకొరిగినా వారి పిడికిళ్ళు మరింత బిగిశాయే తప్ప గుండె ధైర్యం సడలలేదు. కార్మికుల ప్రస్థానం ముందుకే సాగింది. సమ్మె ముగిసింది 2019 నవంబరులో. వెంటనే కోవిడ్-19 బాధలు ముసురుకున్నాయి. 2020 మార్చి 24 నుంచి లాక్డౌన్ పర్వంలో పడ్డారు. తమ సంస్థ కరిమింగిన వెలగపండులా మిగుల్తుందేమోననే భయంలో కార్మికులున్నారు.
అసలే అంతంత మాత్రం జీతాలు, ఆపైన కరోనా మహమ్మారి రావడంతో కుటుంబాల్లో ఖర్చులు పెరిగాయి. వాటిని సర్దుకోవడం ఎలా? అప్పులు చేస్తే వాటిని తీర్చడం ఎలా? జిల్లా సర్వీసులు మామూలు సమయంలో తిరిగే వాటిలో 3వ వంతు మాత్రమే తిప్పుతుండటంతో సిబ్బందికి డ్యూటీలు దొరకడం లేదు. డ్యూటీలు ఇవ్వాల్సిన బాధ్యత యాజమాన్యానిది. కానీ డ్యూటీ దొరకని సిబ్బందికి జీతం చెల్లించకుండా, కార్మికునికి సెలవులు వేస్తున్నారు. ఫలితంగా సంవత్సరాల తరబడి జాగ్రత్తగా పోగు చేసుకున్న ఆర్జిత సెలవులు నెలకు 10 నుంచి 20 వరకు ఖర్చయిపోతున్నాయి. రిటైర్మెంట్ సమయంలో ఎన్క్యాష్ చేసుకొనే వీలున్న సెలవులు కోల్పోవడం కార్మికులకు తీరని నష్టంగా భావిస్తున్నారు. కార్మికుల నుంచి అనేక వినతులు వచ్చినా అధికారులు సరైన రీతిలో స్పందించడం లేదని వాపోతున్నారు. నిజానికి ఆర్టీసీ నెలకు రూ.300 కోట్లు ఆదాయం కోల్పోయింది. కరోనా మహమ్మారిని నియంత్రించడానికి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో భాగం తప్ప తాము కారణం కాదనీ, అయినా కార్మికులకు ఇవ్వాల్సిన వాటికి కోతలు పెడ్తున్నారని అంటున్నారు. 5000 మంది ముస్లిం సోదర, సోదరీమణులకు రంజాన్ పండుగకు ఇచ్చే అడ్వాన్స్ను (25 కోట్లు) కూడా ఇవ్వకుండా నిలిపివేశారు. రేపు దసరా పండుగకైనా ఇస్తారా? లేదా? అనే ఆందోళనలో కార్మికులున్నారు.
సీసీఎస్కు చెల్లించాల్సిన డబ్బుల్లో తక్షణమే రూ.200 కోట్లు చెల్లించాలని గౌరవ హైకోర్టు 2019 నవంబర్లోనే తీర్పు ఇచ్చింది. 9 నెలలు గడిచినప్పటికి ఆ సొమ్ము సీసీఎస్కు ఆర్టీసి యాజమాన్యం జమ చేయలేదు. కోర్టు తీర్పు తరువాత (సమ్మె ముగిసిన తర్వాత) అయినా ప్రతి నెలా సీసీఎస్ కోసం ఆర్టీసి చేస్తున్న రికవరీలను జమ చేయడంలేదు. ఫలితంగా సీసీఎస్ వద్ద నిధుల కొరత ఏర్పడింది. గత సంవత్సరం ఆగస్టు నుంచి రిటైరైన వారికి సెటిల్మెంట్లు ఇవ్వలేదు. కార్మికుల అవసరాలకు సాయపడే తమ సంస్థలో లోన్స్ కోసం అప్లై చేసుకొన్న 16,000 మంది ఆశతో ఎదురు చూస్తున్నారు. 16 లక్షల డిపాజిట్స్ వున్న వ్యక్తికి తన కూతురు పెళ్ళికోసం డబ్బులు రాక ఇబ్బందులు పడ్డారు. ఇటువంటివే అనేక ఘటనలు జరుగుతున్నాయి. ఆర్టీసీ యాజమాన్యం అనుసరిస్తున్న వైఖరి మూలంగా 1600 కోట్లు ఆస్తి కలిగి 52 వేల మంది సభ్యులు, 15వేల మంది డిపాజిటర్లు కలిగి వున్న కార్మికుల సంస్థ ఈ రోజు ఇబ్బందులపాలైందని, తక్షణమే ప్రభుత్వం జోక్యం చేసుకొని బకాయిలు చెల్లించేలా చూడాలనీ, ప్రతి నెలా రికవరీని 10 తేదీలోపు సీసీఎస్ సంస్థకు అందించాలని కార్మికులు కోరుకుంటున్నారు.
ఆర్టీసీలో రిటైరైన వారికి చెల్లించాల్సిన ఫైనల్ సెటిల్మెంట్లను 2018 ఏప్రిల్ నుంచి చెల్లించలేదు. ఒకప్రక్కన రిటైరై వుండి, అతి తక్కువ ఈపీఎస్ పెన్షన్ పొందుతున్న తమకు ఫైనల్ సెటిల్మెంటు డబ్బులు ఇవ్వకపోవడం అన్యాయమని, మరోవైపున కార్మికుల సొమ్ముతో నడుపుతున్న స్టాఫ్ రిటైర్మెంట్ బెనిఫిట్ (ఎస్ఆర్బీఎస్) నుంచి రావవాలసిన బెనిఫిట్కు ఆగస్టు నెలది నేటికి చెల్లించలేదు. తాము ఎలా బతకాలని వాపోతున్నారు.
ఆర్ధికపరమైన అంశాలను ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం పట్టించుకోవడం లేదని కార్మికులు ఆరోపిస్తున్నారు. ప్రతి సంవత్సరం జనవరి, జులైలో కరువు భత్యాన్ని ప్రకటించి అమలు చేస్తారు. 2019 జులై, 2020 జనవరి, జులై నెల కరువు భత్యాన్ని నేటికీ ప్రకటించలేదు. అమలుచేయలేదు. గతంలో ఇవ్వవలసిన కరువు భత్యం బకాయిలను చెల్లించలేదనీ, ఎప్పుడు చెల్లిస్తారో అగమ్యగోచరంగా వుందని కార్మికులు అంటున్నారు. రివైజ్డ్ పేస్కేలు (ఆర్పీఎస్) 2013కు సంబంధించిన బకాయిలు 8.5శాతం వడ్డీతో 5 సం||రాలు పూర్తవగానే చెల్లిస్తామన్న ప్రభుత్వ సూచనతో ఆర్టీసి యాజమాన్యం బాండ్లు విడుదల చేసింది.
వాటి విలువ 280 కోట్లు. 2020 అక్టోబర్తో వాటి కాలం ముగిసిపోతుంది. ఒక్కో కార్మికుడికి లక్షకు పైగా రావలసివుంది. వాటినైనా సరైన సమయంలో ఇస్తారా లేదా అని కార్మికులు ఆందోళన చెందుతున్నారు.
మరోవైపు పే స్కేలు 2017 పరిస్థితి ఏమిటి? 2021 ఏప్రిల్ 1 నుంచి రావలసిన నూతన పే స్కేలు వస్తుందా? రాదా? ప్రభుత్వరంగంలో అతి తక్కువ జీతంతో బతుకుతున్న తమకు 4 ఏండ్లపాటు ఒక పే స్కేలు ఇవ్వకపోవడం అన్యాయమని కార్మికులు భావిస్తున్నారు. కార్మికులంతా సమ్మెకు సిద్ధపడగా 2018 జులై నుంచి 16శాతం మధ్యంతర భృతి ఇస్తున్నారని, ఇప్పటికైనా 2017 ఏప్రిల్ 1 నుంచి అమలయ్యేలా పేస్కేలు ప్రకటించాలనీ, 2021 ఏప్రిల్ నుంచి రావలసిన పేస్కేలు ఎటువంటి ఆలస్యం లేకుండా అమలు చేయాలనీ, ఈ విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని కార్మికులు కోరుకుంటున్నారు.
ఇన్ని సమస్యలతో కార్మికులు సతమతమవుతున్న సమయంలో కార్మిక సంఘాల కార్యకలాపాలను అనుమతించకపోవడం వల్ల కార్మికులకు నష్టం కలుగుతున్నదనీ, తమ సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో తెలియడం లేదనీ, అందుకని కార్మిక సంఘాల కార్యకలాపాలను అనుమతించాలని కార్మికులు కోరుతున్నారు.
ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ఆర్టీసికి మరో వెయ్యి కోట్లు నిధులు ఇవ్వాలనీ, కరోనా సమయంలో ఆర్టీసికి వచ్చిన నిధుల కొరతని ప్రభుత్వం చెల్లించాలని కార్మికులు కోరుకుంటున్నారు.