- పంపిణీకి సన్నద్ధం కావాలంటూ రాష్ట్రాలకు సీడీసీ లేఖ
- అధ్యక్ష ఎన్నికల వేళ ట్రంప్ సర్కారు కీలక నిర్ణయం
- వైరస్ రూపు మారుతున్న వేళ వ్యాక్సిన్ ఓ చాలెంజ్
- ప్రపంచమంతా ఒకే టీకా కష్టమే: సీసీఎంబీ డైరెక్టర్
వాషింగ్టన్ : అమెరికాలో నవంబరు 1 నాటికి కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి రానుంది. అధ్యక్ష ఎన్నికల ముంగిట ట్రంప్ ప్రభుత్వం ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకుంది. వ్యాక్సిన్ పంపిణీకి సిద్ధం కావాలంటూ అన్ని రాష్ట్రాల గవర్నర్లకూ సీడీసీ (సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్) లేఖలు రాసింది. ఇందుకుగాను ఈ వ్యాక్సిన్ సరఫరాకు సంబంధించి సీడీసీ నుంచి కాంట్రాక్టు పొందిన ‘మెక్కెస్సాన్ కార్ప్’ సంస్థకు అన్ని విధాలుగా సహకరించాల్సిందిగా కోరింది. ఈ సంస్థకు కావలసిన అన్ని రకాల మినహాయింపులు, అనుమతులూ వేగంగా మంజూరు చేయాలని సూచించింది. అలాగే, ఈ మినహాయింపుల వల్ల ప్రజారోగ్యానికి సంబంధించి ఎలాంటి ఇబ్బందులూ ఎదురుకావని రాష్ట్రాలకు హామీ ఇచ్చింది. ఈ మేరకు ఆగస్టు 27న సీడీసీ డైరెక్టర్ రాబర్ట్ రెడ్ఫీల్డ్ రాష్ట్రాల కు లేఖ రాశారని అమెరికా మీడియా పేర్కొంది.
వ్యాక్సిన్ ఎలా వేయాలి, ఎలాంటి ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలనే విషయాలను తెలుపుతూ 3 దస్త్రాలను వైద్య ఆరోగ్య విభాగాలకు సీడీసీ పంపిందని తెలిపింది. అక్టోబరు చివరి నాటికి మొత్తం రెండు వ్యాక్సిన్లు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నది. కాగా, అధ్యక్ష ఎన్నికలకు 2 రోజుల ముందే వ్యాక్సిన్ తేవాలన్న ప్రభుత్వ హడావిడి నిర్ణయంపై నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకునే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని విమర్శిస్తున్నారు. ఇంకా క్లినికల్ ట్రయల్స్ కూడా పూర్తికాలేదని, కొన్ని సంస్థలైతే వలంటీర్లను నియమించుకునే దశలోనే ఉన్నాయని అంటున్నారు. ఈ దశలో అక్టోబరులోపు ఈ ప్రక్రియ ఎలా పూర్తవుతుందని వారు వాదిస్తున్నారు. ఇది ప్రజారోగ్యంతో ముడిపడి ఉన్న సమస్య కావడంతో హడావిడి నిర్ణయాలు సబబు కాదని వ్యాఖ్యానిస్తున్నారు.
నొవావాక్స్ టీకా తొలిదశ క్లినికల్ ట్రయల్స్ విజయవంతం
నొవావాక్స్ కరోనా వ్యాక్సిన్ తొలిదశ క్లినికల్ ట్రయల్స్ విజయవంతమయ్యాయి. 108 మంది ఆరోగ్యవంతులపై జరిపిన ఈ పరీక్షల్లో మంచి ఫలితాలు వచ్చాయని, అధిక శాతం మందిలో ఆశించిన స్థాయిలో ప్రతిరక్షకాలు విడుదలయ్యాయని న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్ బుధవారం ప్రచురించింది. శాస్త్రవేత్తలు 108 మందికి ఈ వ్యాక్సిన్ ఇచ్చారు. వారిలో 83మందికి సహాయకులను ఏర్పాటు చేశారు. వీరంతా 60 ఏళ్ల లోపు వారే. వీరికి 3 వారాల్లో 2 డోసుల వ్యాక్సిన్ ఇచ్చారు. తొలి డోసు ఇచ్చిన 35 రోజుల తర్వాత వీరికి పరీక్షలు నిర్వహించగా.. కొందరిలో మాత్రం కొద్దిపాటి జ్వరం ఉన్నట్లు తేలింది. రెండో డోసు ఇచ్చిన అనంతరం వలంటీర్లు అందరూ ఆరోగ్యంగా ఉన్నారు. అలాగే.. వ్యాక్సిన్ తీసుకున్న వలంటీర్లతో పాటు 83 మంది సహయకుల్లో కూడా ప్రతిరక్షకాలు విడుదలయ్యాయని, అవి కొవిడ్ బారి నుంచి కోలుకున్న వారిలో కంటే అధికంగా ఉన్నాయని తేలింది.
Courtesy Andhrajyothi