– జీడీపీ మైనస్ 24 శాతం క్షీణత
– 40 ఏండ్లలో మహా పతనం :జూన్ త్రైమాసికం గణంకాల వెల్లడి
– వ్యవసాయమొక్కటే దన్ను
– తయారీ రంగం ఢమాల్
న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్ల ఎప్పుడూ లేని విధంగా స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) పాతాళానికి పడిపోయింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21) ఏప్రిల్ నుంచి జూన్తో ముగిసిన తొలి త్రైమాసికం (క్యూ1)లో ఏకంగా మైనస్ 23.9 శాతం క్షీణించిందని కేంద్ర గణంకాల కార్యాలయం (ఎన్ఎస్ఓ) సోమవారం వెల్లడించింది. గడిచిన 40 ఏండ్లలో ఇదే అత్యల్పం కాగా.. 1996 నుంచి ప్రకటిస్తున్న త్రైమాసిక జీడీపీ గణంకాల్లో ఇదే అత్యంత పేలవం. కరోనా కట్టడికి మోడీ సర్కార్ సరైన కార్యాచరణ లేకుండా మార్చి 25 నుంచి లాక్డౌన్ ప్రకటించడంతో మొత్తం ఆర్థిక కార్యకలాపాలు నిలిచిపోయాయి. తయారీ రంగమూ కుప్పకూలింది. ప్రజల ఉపాధి తీవ్రంగా దెబ్బతినిడంతో వారి కొనుగోలు శక్తి హరించుకుపోయింది. అంతిమంగా ఆ ప్రభావం స్థూల దేశీయోత్పత్తిపై పడింది. 2020 మార్చి త్రైమాసికంలో జీడీపీ 3.1 శాతం క్షీణించి.. 17 ఏండ్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. కాగా 2019-20 జూన్ త్రైమాసికంలో 5.2 శాతం వృద్థి రేటు నమోదైంది. గత రెండేండ్లుగా క్రమంగా పడిపోతూ వస్తోన్న జీడీపీకి కరోనా తోడవడంతో క్రితం త్రైమాసికంలో తీవ్ర అగాథంలోకి జారుకున్నట్లయ్యింది. మరోవైపు వరుసగా ఐదో మాసంలోనూ కీలక రంగాలు పేలవ ప్రగతిని కనబర్చాయి.
ఎన్ఎస్ఓ గణంకాల ప్రకారం.. క్రితం జూన్తో ముగిసిన త్రైమాసికంలో ఒక్క వ్యవసాయ రంగం మినహా మిగితావన్నీ కుప్పకూలాయి. స్థూల విలువ జోడింపు (జీవీకే) ఆధారిత వృద్థి రేటు 22.8 శాతం పడిపోయింది. తయారీ రంగం ఏకంగా 39.3 శాతం, గనులు 23.3 శాతం చొప్పున క్షీణించాయి. విద్యుత్ 7 శాతం, నిర్మాణ రంగం 50.3 శాతం చొప్పున పతనమయ్యాయి. వాణిజ్యం, హోటళ్లు, రవాణ, కమ్యూనికేషన్ రంగాలు 47 శాతం క్షీణించాయి. జీడీపీలో 14 శాతం వాటా కలిగిన వ్యవసాయ, వ్యవసాయ ఆధారిత కార్యకలాపాలు మాత్రమే 3.4 శాతం వృద్థిని సాధించాయి. ఈ ఒక్క రంగం మాత్రమే సానుకూల ప్రగతిని నమోదు చేసింది.
ఇతర దేశాల కంటే పేలవం..
ఇతర దేశాల ఆర్థిక వ్యవస్థలతో పోల్చినా భారత్ అత్యంత పేలవ వృద్థిని చవి చూడటం గమనార్హం. జూన్ త్రైమాసికంలో చైనా 3.20 శాతం పెరిగింది. బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ 21.7 శాతం, జర్మనీ 10.10 శాతం, అమెరికా 9.10 శాతం చొప్పున ప్రతికూల వృద్థిని నమోదు చేశాయి. కాగా భారత్ ఏకంగా 24 శాతం మేర క్షీణించింది. జూన్ త్రైమాసికంలో భారత జీడీపీ 20 శాతం తగ్గొచ్చని ఇక్రా రేటింగ్ ఎజెన్సీ అంచనా వేసింది. 19.2 శాతం పడిపోవచ్చని బ్లూమ్బర్గ్ తొలుత పేర్కొంది. అనేక ఎజెన్సీలు 15 నుంచి 20 శాతం పతనం ఉండొచ్చని పేర్కొన్నాయి. దీనికి భిన్నంగా 24 శాతం మేర పడిపోవడం ఆర్థిక వ్యవస్థలోని బలహీనతలను ఎత్తి చూపుతోంది.
అగాథంలోనే కీలక రంగాలు..
న్యూఢిల్లీ: వరుసగా ఐదో మాసం లోనూ ప్రధాన మౌలిక వసతుల రం గాలు కుప్పకూలాయి. ప్రస్తుత ఏడాది జులైలోనూ ఎరువులు మినహా.. బొగ్గు, ముడి చమురు, సహజ వాయువు, రిఫైనరీ, స్టీల్, సిమెంట్, విద్యుత్ రంగాల ఉత్పత్తి క్షీణించింది. ఈ ఎనిమిది కీలక రంగాలు 9.6శాతం ప్రతికూల వృద్థి రేటును చవి చూశా యి. ఇంతక్రితం మాసంలో 12.9 శాతం క్షీణతను నమోదు చేశాయి. మేలో 22 శాతం, ఏప్రిల్లో 37 శాతం చొప్పున పతనమయ్యాయి. కాగా 2019 జులైలో 2.6శాతం పెరుగుదలను నమోదు చేశాయి. ఎరువుల ఉత్పత్తిలో 6.9శాతం వృద్థి రేటు నమోదమైంది. 2019 ఇదే జులైలో 1.5 శాతం పెరుగుదల ఉంది. క్రితం జులైలో స్టీల్ 16.5శాతం, రిఫైనరీ ఉత్పత్తులు 13.9శాతం, సిమెంట్ 13.5 శాతం, సహజ వాయువు 10.2 శాతం, ముడి చమురు 4.9 శాతం, విద్యుత్ 2.3 శాతం చొప్పున ప్రతికూల వృద్థి రేటును చవి చూశాయి. 2020-21 ఏప్రిల్ జూన్ కాలంలో ఈ కీలక రంగాల ఉత్పత్తి ఏకంగా 20.5 శాతం క్షీణించింది. గతేడాది ఇదే సమయంలో 3.2 శాతం వృద్థిని సాధించాయి. మొత్తం పారిశ్రామిక ఉత్పత్తిలో వీటి వాటా 40 శాతంగా ఉంది.
Courtesy Nava telangana