- పెల్లెట్లు, బాష్పవాయువు ప్రయోగించిన పోలీసులు
- 40 మందికి గాయాలు
- కరోనా నేపథ్యంలో మతపరమైన కార్యక్రమాలు నిషేధం: అధికారులు
- ఎన్కౌంటర్లో ముగ్గురు ఉగ్రవాదులు హతం
శ్రీనగర్/జమ్ము : జమ్మూకశ్మీర్లోని శ్రీనగర్లో శనివారం చేపట్టిన మొహర్రం ఊరేగింపు ఉద్రిక్తంగా మారింది. ఊరేగింపులో పాల్గొన్న వారిపై పోలీసులు పెల్లెట్లు, బాష్పవాయువును ప్రయోగించారు. దీంతో 40 మంది గాయపడ్డారని ‘ద కశ్మీర్ వాలా’ పేర్కొంది. కరోనా నేపథ్యంలో మతపరమైన కార్యక్రమాలు నిర్వహించడంపై నిషేధం ఉందని, ఈ నిషేధాన్ని ఉల్లంఘిస్తూ కొంతమంది స్థానికులు ఊరేగింపు నిర్వహించారని శ్రీనగర్ పోలీసు సూపరింటెండెంట్ హసీబ్ మొఘల్ చెప్పారు. పరిస్థితులను అదుపులో ఉంచేందుకు, కరోనా వ్యాప్తి కట్టడికే పోలీసులు స్వల్ప మోతాదులో బాష్పవాయువును ప్రయోగించారని ఆయన పేర్కొన్నారు.
‘‘శాంతిభద్రతలను ఉల్లంఘించి, అల్లరి మూకలు రాళ్లు విసిరినపుడు, పరిస్థితులను అదుపు చేయడానికి, జాతీయ రహదారిని పునరుద్ధరించడానికి బాష్పవాయువు, పెల్లెట్లను ప్రయోగించాం. అనవసరంగా పోలీసులు బలప్రయోగం ఎందుకు చేస్తారు?’’ అని హసీబ్ పేర్కొన్నారు. అయితే ఎంతమంది గాయపడ్డారో అధికారులు స్పష్టంగా వెల్లడించలేదని ‘ద అసోసియేటెడ్ ప్రెస్’ తెలిపింది. దాదాపు 500 మంది ఊరేగింపులో పాల్గొన్నారని, వీరిలో మహిళలు కూడా ఉన్నారని ఓ ప్రత్యక్ష సాక్షి చెప్పాడు. ప్రశాంతంగా సాగుతున్న ఊరేగింపుపై పోలీసులు పెల్లెట్లు ప్రయోగించారని ఆ సాక్షి పేర్కొన్నాడు. గాయపడిన వారిలో ఓ 16 ఏళ్ల యువకుడు కూడా ఉన్నాడని ‘ద వైర్’ పేర్కొంది. అతడి కుడి కంట్లో నాలుగు పెల్లెట్లు దిగబడ్డాయని, కంటి నరం దెబ్బతిందని ఆ యువకుడికి చికిత్స అందించిన వైద్యుడు తెలిపారు. గాయపడిన వారిని ఇమామ్ హుస్సేన్ ఆస్పత్రికి తరలించారు. 40 మందికి పెల్లెట్ గాయాలయ్యాయని పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఆస్పత్రి అధికారులు చెప్పిన్నట్లు ‘ద కశ్మీర్ వాలా’ పేర్కొంది. కాగా కరోనా మహమ్మారి నేపథ్యంలో మొహర్రం ఊరేగింపునకు సుప్రీంకోర్టు అనుమతి ఇవ్వలేదు.
ఎన్కౌంటర్లో ముగ్గురు ఉగ్రవాదులు హతం
జమ్మూకశ్మీర్లో ఆదివారం జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు లష్కరే తాయిబా ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ ఘటనలో అసిస్టెంట్ ఎస్ఐ బాబురాం వీర మరణం పొందారు. శనివారం రాత్రి శ్రీనగర్లోని పంథా చౌక్లో ఈ ఘటన జరిగింది. మరోవైపు రాజౌరీ జిల్లాలోని నియంత్రణ రేఖ వద్ద పాకిస్థాన్ సైనికుల కాల్పుల్లో జూనియర్ కమిషన్డ్ అధికారిగా పనిచేస్తున్న నాయబ్ సుబేదార్ రాజ్విందర్ సింగ్ వీర మరణం పొందారని అధికారులు తెలిపారు. భారత సైనికులు జరిపిన ప్రతికాల్పుల్లో పాక్ సైనికులు కూడా గాయపడ్డారని వెల్లడించారు.
Courtesy Andhrajyothi