– కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్కైలాబ్బాబు
బీబీనగర్ : యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం రంగాపురం రెవెన్యూ పరిధిలోని దళితుల భూములను కాజేసిన నార్నే రంగారావుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్కైలాబ్బాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం ఆయన రంగాపురం గ్రామాన్ని సందర్శించారు. దళితుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ.. వందల ఏండ్లుగా దళితులు సాగు చేసుకుంటున్న భూములు అమ్మినట్టుగా తప్పుడు పత్రాలు సృష్టించి రెవెన్యూ అవినీతి అధికారుల సహకారంతో అన్యాక్రాంతం చేశారన్నారు. వెంటనే దీనిపై ప్రభుత్వం స్పందించి, దళితుల భూములను వారికి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎయిమ్స్ నిర్మాణంలో భూములు కోల్పోయిన వారందరికీ ప్రత్యామ్నాయంగా భూములు కొనుగోలు చేసి ఇవ్వాలని, భూ నిర్వాసితులకు ఉద్యోగ అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట కేవీపీఎస్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు అన్నంపట్ల కృష్ణ, సిర్పంగి స్వామి, సీఐటీయు జిల్లా అధ్యక్షులు కోమటిరెడ్డి చంద్రారెడ్డి తదితరులున్నారు.
Courtesy: NT