- మహిళల కనీస వివాహ వయసు పెంపు దిశగా కేంద్రం చర్యలు.. వెల్లువెత్తుతున్న అభ్యంతరాలు
- ఈ నిర్ణయంతో దళిత, ఆదివాసీలకు నష్టం.. సర్కారు చర్యల్ని వ్యతిరేకిస్తున్నవారి వాదన
- ఇద్దరి వివాహ వయసూ ఒకటిగానే ఉండాలి.. ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించేవారి వాదన
న్యూఢిల్లీ : మహిళల వివాహ వయస్సు పెంచే దిశగా కేంద్రం చేపడుతున్న చర్యలపై పలు అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, గత బడ్జెట్ ప్రసంగంలో అంశాన్ని ప్రస్తావించగా.. ప్రధాని మోదీ కూడా ఆగస్టు 15న చేసిన స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో దీనిపై మాట్లాడారు. ‘‘బాలికల్లో పౌష్టికాహారలేమిని అరికట్టడానికి, వారి వివాహ వయస్సును నిర్వహించడానికి మేం ఒక కమిటీని వేశాం’’ అన్నారు. ఆ కమిటీ త్వరలోనే ఇచ్చే నివేదిక ఆధారంగా నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
ప్రస్తుతం వివాహానికి చట్టబద్ధమైన వయస్సు.. మహిళలకు 18 సంవత్సరాలు, పురుషులకు 21 సంవత్సరాలు. నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న బాల్య వివాహాల కారణంగా గర్భం దాల్చిన బాలికల్లో రక్తహీనత, పౌష్టికాహార లేమి సమస్య ఎక్కువగా ఉంటోంది. దీనివల్ల మాతృ మరణాల రేటు, శిశు మరణాల రేటు ఎక్కువగా ఉంటోంది. దీన్ని అరికట్టడానికే మహిళల వివాహ వయసు పెంచడానికి గల అవకాశాలను కేంద్రం పరిశీలిస్తోంది.
ఇందుకు ప్రముఖ సామాజిక కార్యకర్త, ఎంపీ జయా జైట్లీ నేతృత్వంలో జూన్లో ఒక టాస్క్ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేసింది. మహిళలు ఏ వయసులో గర్భం దాల్చవచ్చు, కాన్పు సమయంలో మరణాల రేటును తగ్గించ డం, పౌష్టికాహారస్థాయులను పెంచ డం వంటి అంశాలను టాస్క్ఫోర్స్ పరిశీలించి సూచనలు చేయాలి. జూ లై31 నాటికే నివేదిక ఇవ్వాలి. కానీ ఇప్పటిదాకా సమర్పించలేదని సమాచారం.
వ్యతిరేకించేవారి వాదన..
మహిళల కనీస వివాహ వయసును పెంచడంలో కేంద్రానికి ఉన్నది సదుద్దేశమే అయినా.. అంతిమంగా ఈ నిర్ణయంతో మహిళా సాధికారతకు బదులు దళిత, ఆదివాసీలకు అన్యాయం జరుగుతుంది. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (ఎన్ఎ్ఫహెచ్ఎ్స-4) డేటా 2015-16 ప్రకారం.. పట్టణ ప్రాంతాల మహిళలతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు చిన్నవయసులోనే పెళ్లి చేసుకుంటారు. 12 ఏళ్లపాటు చదువుకున్న మహిళలు.. అలా చదువుకోనివారితో పోలిస్తే ఆలస్యంగా పెళ్లి చేసుకుంటున్నారు.
అంటే.. చదువు చెప్పించడం వల్ల ఆడపిల్లల్లో అవగాహన పెరిగి, చైతన్యం కలిగి బాల్యవివాహాలు తగ్గుతాయి తప్ప.. నిర్బంధంగా వివాహ వయసును పెం చడం వల్ల కాదు. అంతేకాదు.. కులాంతర ప్రేమ వివాహాలు జరిగినప్పుడు అగ్రవర్ణాల తల్లిదండ్రులు వయసునే సాకుగా చూపి దళితులు, ఆదివాసీలపై కేసులు పెడుతున్నారు. వివాహ వయసును పెంచితే వారి అరాచకాలు మరింత పెరిగే ప్రమాదం ఉంది. జాతీయ మానవ హక్కుల కమిషన్ నివేదిక ప్రకారం.. పెద్ద చదువులు చదువుకున్న మహిళలు చిన్నప్పుడే పెళ్లి చేసుకోవట్లేదు. అందుకే.. విద్యాహక్కు చట్టం, 2009 18 ఏళ్ల దాకా వర్తించేలా చేయాలని కమిషన్ సూచించింది.
ప్రస్తుతం 14 నుంచి 18 ఏళ్లవారు ఆ చట్టం పరిధిలో లేరు. కాబట్టి ప్రభుత్వం వివాహ వయసును పెంచే ప్రయత్నం మానుకొని ఆడపిల్లలకు ఉన్నత చదువులు చెప్పించే దిశగా చర్య లు తీసుకోవాలి. ఓటేసే హక్కును 18 ఏళ్లకే పొందుతున్నవారికి, అదే వయసులో పెళ్లి చేసుకునే హక్కు ఎందుకు ఉండకూడదు? కాబట్టి మగపిల్లల పెళ్లి వయసును కూడా 18గా చేయాలి.
పెంచాలనే వారి వాదన..
మహిళల కనీస వివాహ వయసును 18 నుంచి 21 ఏళ్లకు పెంచేదిశగా కేంద్రం తీసుకుంటున్న చర్యలు స్వాగతించదగ్గవి. చిన్నవయసులో గర్భధారణ వల్ల కడుపులో ఉన్న బిడ్డలకూ ఆరోగ్య సమస్యలు ఎదురుకావొచ్చు. వారికి అవగాహన లేకపోవడం వల్ల పౌష్టికాహార లోపాని కి గురయ్యే అవకాశం ఉంది. దీనివల్ల మాతృ, శిశుమరణాలు పెరిగే ముప్పు అధికమవుతుంది. రాజ్యాంగం ప్రకారం స్త్రీ, పురుషులిద్దరూ సమానం. కాబట్టి వారి వివాహ వయసుల్లో తేడా ఉండడానికి వీల్లేదు.
చాలా కాలంగా చర్చ..
మహిళల వివాహ వయస్సుపై చాలాకాలంగా చర్చ జరుగుతోంది. స్త్రీ, పురుషులిద్దరికీ వివాహవయసు ఒకటే ఉండాలని జాతీయ మానవహక్కుల కమిషన్ కూడా అభిప్రాయపడింది. ప్రపచం వ్యాప్తంగా 140 దేశాల్లో స్త్రీ, పురుషులిద్దరి వివాహ వయస్సూ 18 ఏళ్లుగానే ఉంది. కుటుంబచట్టాలకు సంబంధించి 2018లో ‘లా కమిషన్’ సమర్పించిన కన్సల్టేటివ్ పేపర్లో ఇదే సూచన చేసింది. అందరికీ వివాహ వయస్సును 18 ఏళ్లుగా చేయాలని పేర్కొంది.
బాల్యవివాహాలు, టీనేజ్ గర్భధారణలకు సంబంధించి బాలల హక్కుల పరిరక్షణ జాతీయ కమిషన్, యంగ్లైవ్స్ అనే స్వచ్ఛంద సంస్థ కలిసి 2018లో విడుదల చేసిన నివేదిక ప్రకారం.. 2005-06 నాటితో పోలిస్తే 2015-16 నాటికి 15 నుంచి 19 ఏళ్లలోపు బాలికల పెళ్లిళ్ల శాతం 26.6 శాతం నుంచి 11.9 శాతానికి తగ్గింది. అయితే.. 15 నుంచి 19 ఏళ్లలోపు పెళ్లయిన బాలికల్లో 31.5 శాతం మంది తల్లులైనట్టు తేలింది. 15-16 ఏళ్ల బాలికల్లో కనీసం 25 శాతం మంది ఒక బిడ్డకు జన్మనిచ్చారు.
చదువు పూర్తిచేసేలా చూడాలి
కొత్తగా పెళ్లయిన మహిళలు, బాలికలకు కుటుంబసభ్యులు, బంధువులు చుట్టుపక్కలవారి నుంచి తీవ్రమైన ఒత్తిడి ఉంటుంది. పెళ్లయిన నెల రోజుల నుంచే.. ‘ఏమైనా విశేషమా’ అని అడగడం మొదలుపెడతారు. ఆ సమయంలో లైంగిక, పునరుత్పత్తి ఆరోగ్యం గురించి వారికి చాలా తక్కువ అవగాహన ఉంటుంది. జీవిత భాగస్వామితో కుటుంబ నియంత్రణ విధానాల గురించి చర్చించలేరు. దీనివల్ల త్వరగా గర్భం దాలుస్తారు. శారీరకంగాగానీ, మానసికంగాగానీ గర్భధారణకు సంసిద్ధులై ఉండరు. ఫలితంగా వారిలో ఒత్తిడి పెరిగి పోస్ట్పార్టమ్ హేమరేజ్, హైపర్టెన్సివ్ డిజార్డర్స్ వంటివాటి బారిన పడుతున్నారు. దీనివల్ల మాతృమరణాల రేటు పెరుగుతోంది.
దేశంలో మాతృమరణాల రేటు అత్యధికంగా ఉన్నది.. 18 ఏళ్లలోపువారిలో కాదు. 20-25 ఏళ్లలోపువారిలోనే ఆ రేటు ఎక్కువ. ఎందుకంటే గతంతో పోలిస్తే 18 ఏళ్లలోపు ఆడపిల్లలకు పెళ్లి చేయడం తగ్గుతోంది. కాబట్టి, ప్రభుత్వాలు వివాహ వయసును పెంచే బదులు ఆడపిల్లలందరూ బడిలో చేరేలాగా, మధ్యలో మానేయకుండా చదువు పూర్తి చేసేలా చూడాలి. వారి లైంగిక, పునరుత్పత్తి హక్కుల గురించి పూర్తిగా తెలుసుకునేలాగా చేయాలి.
– పూనమ్ ముత్రేజా, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, పాపులేషన్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా
Courtesy Andhrajyothi