హైదరాబాద్ : మహిళలకు ఉపాధి, ఆహార భద్రత, ఆరోగ్యం, హింసల నుంచి రక్షణ కల్పించాలని ఐద్వా, ఎన్ఎఫ్ఐడబ్ల్యూ, పీవోడబ్య్లూ, ఏఐఎమ్ఎస్ఎస్, సీఎమ్ఎస్, పీవోడబ్య్లూలతో కూడిన మహిళా సంఘాల ఐక్య వేదిక డిమాండ్ చేసింది. అన్లాక్లోనూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న మహిళలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేయూత అందించాలని కోరుతూ శుక్రవారం హైదరాబాద్ కలెక్టర్ కార్యాలయం వద్ద్ద ప్ల కార్డులు, జెండాలు పట్టుకొని భౌతిక దూరం పాటిస్తూ నిరసన చేపట్టారు. ఉదయం – గంటల నుంచి – గంటల వరకు జరిగిన ఆందోళన కార్యక్రమంలో ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) రాష్ట్ర కార్యదర్శి మల్లు లక్ష్మి మాట్లాడుతూ కరోనా కాలంలో అన్ని రంగాల్లోని మహిళలు తీవ్ర కష్టాలను, వివక్షను ఎదుర్కొంటున్నారని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేదలను వెంటనే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. దేశంలో ఇప్పటికీ 53 శాతం మంది మహిళలు రక్తహీనతతో బాదపడుతున్నారనీ, పోషకాహార లోపంతో మరణాలు సంభవించకుండా నిత్యావసర సరుకులన్ని రేషన్ షాపుల ద్వారా అందించాలని కోరారు. వృద్దులు, పిల్లలు, గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లులకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు.
పీవోడబ్య్లూ నాయకురాలు సంద్య మాట్లాడుతూ కరోనా సృష్టించిన కల్లోలం వల్ల ఏర్పడ్డ సంక్షోభం నుంచి ప్రజలను ఆదుకునేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏలాంటి చర్యలు చేపట్టడం లేదని విమర్శించారు. పేదలకు, వలస కార్మికులకు నగదు సహాయం అందిస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం మూడు నెలల పాటు నెలకు రూ.1,500 అందించి చేతులు దుపులుకుందని ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా సంక్షోభాన్ని తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన టాస్క్ఫోర్స్ను 50 శాతం మహిళలతో పునర్నిర్మాణం చేయాలనీ, రాష్ట్ర ప్రభుత్వం సైతం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. పీవోడబ్య్లూ నాయకురాలు ఝాన్సి మాట్లాడుతూ మహిళలపై హింస, నేరాలు అరికట్టడానికి ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. సీఏఏ, ఎన్ఆర్సీ, ఎన్పీఆర్ను వ్యతిరేకిస్తున్న వారిపై ఊపాలాంటి తప్పుడు కేసులు పెట్టడం మానుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఐద్వా రాష్ట్ర అధ్యక్షురాలు కెఎన్.ఆశాలత, ఉపాధ్యక్షులు, టి.జ్యోతి, వినోద, అరుణజ్యోతి, ఏఐఎమ్ఎస్ఎస్ నాయకురాలు హేమలత, నాయకులు కృష్ణకుమారి, పద్మ, తదితరులు పాల్గొన్నారు.
Courtesy Nava telangana