370, 35ఏ అధికరణలను పునరుద్ధరించాలి
కశ్మీర్లోని ఆరు ప్రధాన రాజకీయ పార్టీల తీర్మానం
శ్రీనగర్/న్యూఢిల్లీ, ఆగస్టు 23: కశ్మీర్ ప్రజల అంగీకారం లేకుండా తీసుకునే ఏ నిర్ణయాల్నీ అంగీకరించేది లేదని జమ్మూ కశ్మీర్, లద్దాఖ్ కేంద్రపాలిత ప్రాంతాల్లోని ఆరు రాజకీయ పార్టీలు స్పష్టం చేశాయి. కశ్మీర్ ప్రత్యేక హోదా-35ఏ అధికరణల రద్దు, 370వ అధికరణ నిర్వీర్యం పూర్తిగా అప్రజాస్వామికమని ఆరోపించాయి. గత ఏడాది ఆగస్టు 5కు ముందున్న పరిస్థితి తిరిగి నెలకొల్పేందుకు కలిసి కృషి చేస్తామని ఉమ్మడిగా ప్రతిజ్ఞ చేశాయి. ఈ మేరకు గుప్కార్ డిక్లరేషన్-2 పేరిట తీర్మానంపై సంతకం చేశాయి.
ఈ తీర్మానం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా, పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ, జమ్మూకశ్మీర్ కాంగ్రెస్ చీఫ్ జీఏ మిర్, పీపుల్స్ కాన్ఫరెన్స్ నేత సజ్జాద్ లోన్, రాష్ట్ర సీపీఎం నేత ఎంవై తరిగామి, జమ్మూకశ్మీర్ ఆవామీ నేషనల్ కాన్ఫరెన్స్ సీనియర్ ఉపాధ్యక్షుడు ముజఫర్ షా దీనిపై సంతకాలు చేశారు. గత ఏడాది ఆగస్టు 5న కేంద్రం కశ్మీర్లో 370వ అధికరణను రద్దు చేసిన సంగతి తెలిసిందే. కశ్మీర్లోని ఆరు ప్రధాన పార్టీలు అబ్దుల్లాకు చెందిన గుప్కార్ నిలయంలో ఆ ముందురోజు సమావేశమయ్యాయి. కశ్మీర్ స్థితిగతులను మార్చరాదని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ గుప్కార్ డిక్లరేషన్పై ఆయా పార్టీల నేతలు సంతకాలు చేశారు.
అనంతరం తమ అందరిపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర ఆంక్షలు విధించిందని, ఒకరితో ఒకరు కనీస సమాచారం అందించుకునేందుకు కూడా వీలు లేని పరిస్థితిని కేంద్రం కల్పించిందని తాజా గుప్కార్ డిక్లరేషన్-2లో నేతలు స్పష్టం చేశారు. మేము తొలి తీర్మానానికి కట్టుబడి ఉన్నాం. 370, 35ఏ అధికరణలను తిరిగి అమలులోకి తీసుకురావాలి. గత ఏడాది ఆగస్టు 5కు ముందున్న పరిస్థితిని తిరిగి నెలకొల్పాలి. రాష్ట్రాన్ని విభజించడాన్ని మేము అంగీకరించడం లేదు. మా అనుమతి లేకుండా మా గురించి నిర్ణయాలు తీసుకోవడాన్ని ఏకగ్రీవంగా వ్యతిరేకిస్తున్నాం. కేంద్రం తీసుకున్న ఈ ద్వేషపూరిత నిర్ణయం దురదృష్టకరం.
అందువల్ల కశ్మీర్కు కేంద్రానికి మధ్య బంధంలో గుర్తుపట్టలేనన్ని మార్పులు వచ్చాయి. కశ్మీర్ ప్రజల ఉనికికే ఈ నిర్ణయం సవాలు. మా అస్తిత్వాన్ని మార్చేందుకు చేస్తున్న ప్రయత్నం ఇది. ప్రజల్ని అణగదొక్కేందుకు బలవంతంగా చేసిన ఈ అప్రజాస్వామిక నిర్ణయంపై మేము ఐకమత్యంగా పోరాడతాం. మా ప్రత్యేక హోదాను, రాజ్యాంగపరమైన హామీలను తిరిగి పొందేందుకు ఐకమత్యంగా పోరాడాలని నిర్ణయించాం. కశ్మీర్కు ఒకప్పటి హోదాను తిరిగి తీసుకురావడమే మా లక్ష్యమని హామీ ఇస్తున్నాం. కశ్మీరుకు అండగా నిలబడిన పార్టీలకు, ప్రజలకు, మేధావులకు మా కృతజ్ఞతలు. మా పూర్వ హోదాను తీసుకురావడంలో మీరంతా అదే మద్దతును కొనసాగించాలని కోరుకుంటున్నాం అని తీర్మానంలో ఆయా పార్టీల నేతలు పేర్కొన్నారు.
ప్రస్తుతం గృహనిర్బంధంలో ఉన్న మెహబూబా ముఫ్తీ ఈ తీర్మానం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ తీర్మానాన్ని స్వాగతిస్తున్నట్లు మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ నేత పి.చిదంబరం పేర్కొన్నారు. మరోవైపు కశ్మీర్ బీజేపీ అధ్యక్షుడు రవీందర్ రైనా తీర్మానాన్ని ఖండించారు. 370 అధికరణను పునరుద్ధరించడం అసాధ్యమన్నారు.
Courtesy Andhrajyothi