దిల్లీ: అంతర్రాష్ట్ర ప్రయాణాల విషయంలో ఆంక్షలు విధించొద్దని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం సూచించింది. వ్యక్తులు, వస్తువుల రవాణాపై ఎలాంటి ఆంక్షలు ఉండకూడదని స్పష్టం చేసింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా లేఖ రాశారు. రాష్ట్రం పరిధిలో గానీ, అంతర్రాష్ట్ర ప్రయాణాల విషయంలోగాని ఆంక్షలు విధించొద్దని సూచించారు.
ఇలాంటి ఆంక్షల వల్ల సప్లయ్ చైన్, ఆర్థిక కార్యకలాపాలు, ఉపాధిపై ప్రభావం పడుతుందని అజయ్ భల్లా తన లేఖలో పేర్కొన్నారు. ఎవరైనా ఆంక్షలు విధిస్తే హోంశాఖ నిబంధనల ఉల్లంఘన కింద పరిగణించాల్సి ఉంటుందని తెలిపారు. అంతర్రాష్ట్ర ప్రయాణానికి ప్రత్యేకంగా ఎలాంటి అనుమతులు గానీ, ఈ-పర్మిట్లుగానీ అవసరం లేదని పునరుద్ఘాటించారు. అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు హోంశాఖ నిబంధనలను కచ్చితంగా పాటించాలని సూచించారు.
దేశవ్యాప్త లాక్డౌన్ నేపథ్యంలో అంతర్రాష్ట్ర ప్రయాణాలపై ఆంక్షలు కొనసాగిన సంగతి తెలిసిందే. క్రమక్రమంగా ఆంక్షలను కేంద్రం సడలించింది. తాజాగా అన్లాక్ 3.0 మార్గదర్శకాల్లో అంతర్రాష్ట్ర ప్రయాణాలపై ఎలాంటి ఆంక్షలు విధించొద్దని హోంశాఖ మార్గదర్శకాల్లో పేర్కొంది. అయినప్పటికీ కొన్ని రాష్ట్రాలు అంతర్రాష్ట్ర ప్రయాణానికి అనుమతులు కోరుతుండడం, జిల్లా స్థాయిలోనూ ఆంక్షలు విధిస్తుండడం కేంద్రం దృష్టికి రావడంతో హోంశాఖ కార్యదర్శి ఈ లేఖ రాశారు.
Courtesy Eenadu