- ఏళ్ల తరబడి శారీరకంగా హింసించారు
- గర్భం దాల్చడంతో అబార్షన్ చేయుంచారు
- నగ్న చిత్రాలు, వీడియోలు తీశారు
- వారి నుంచి నాకు ప్రాణ హాని ఉంది
- పోలీసులకు యువతి ఫిర్యాదు.. కేసు
- నిందితుల్లో ఓ మాజీ ఎంపీ పీఏ పేరు
- సినిమావాళ్లు, విద్యార్థి నాయకులూ..
పంజాగుట్ట : ‘నాపై 143 మంది ఏళ్ల తరబడి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. గర్భం దాల్చడంతో అబార్షన్ చేయించారు. నగ్నంగా చిత్రాలు, వీడియోలు తీశారు. సిగరెట్లతో కాలుస్తూ శారీరకంగా హింసించారు. ఎవరికైనా చెబితే చంపేస్తామని తుపాకీతో బెదిరించారు. వారిలో విద్యార్థి సంఘాల నాయకులు, రాజకీయ నాయకుల పీఏలతో పాటు సినీ పరిశ్రమ వారూ ఉన్నారు. ఇప్పుడు వారి నుంచి నాకు ప్రాణహాని ఉంది’ అంటూ ఓ యువతి పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసింది. 100 పేజీల ఫిర్యాదులో ఆమె పలు అంశాలను పేర్కొంది. తనపై సామూహిక అత్యాచారాలు, వేధింపులు తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు పలు రాష్ట్రాల్లో జరిగాయని తెలిపింది. వారు తనను వదిలిపెట్టరని, ఇదే చివరి వాంగ్మూలమని పేర్కొంది. యువతి ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీసులు వివిధ సెక్షన్ల కింద 143 మందిపై కేసు నమోదు చేశారు.
నిందితుల్లో ఓ మాజీ ఎంపీ పీఏ కూడా ఉన్నారు. ఫిర్యాదులో యువతి పేర్కొన్న వివరాల ప్రకారం.. నల్లగొండ జిల్లాకు చెందిన యువతికి మిర్యాలగూడకు చెందిన వ్యక్తితో 2009 జూన్లో వివాహమైంది. అత్తవారింట్లో వేధింపులు తట్టుకోలేక 2010 డిసెంబరులో పెద్దల సమక్షంలో విడాకులు తీసుకున్నారు. పుట్టింట్లో ఉండి చదువుకుంటుండగా విద్యార్థి సంఘం నాయకులతో పాటు పలువురితో పరిచయం ఏర్పడింది. కొంతకాలం క్రితం రాజ్భవన్ రోడ్డులోని అపార్ట్మెంట్లో అద్దెకు దిగింది. ఈ క్రమంలో తనపై మాజీ ఎంపీ పీఏ, విద్యార్థి సంఘం నాయకులు ముగ్గురు, మరో 139 మంది కొన్నేళ్లుగా అత్యాచారానికి పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొంది.
మరికొందరు యువతులపైనా..
తనతో నగ్నంగా నృత్యాలు చేయించేవారని, ఫొటోలు, వీడియోలు తీస్తూ ఆనందం పొందేవారని, వారి స్నేహితులతో కూడా గడపాలని బెదిరించేవారని, సహకరించకపోతే చంపుతామనేవారని యువతి తెలిపింది. కులం పేరుతో దూషించేవారని, నగ్న చిత్రాలను సామాజిక మాధ్యమాల్లో పెడతామన్నారని ఫిర్యాదు చేసింది. వారు మరికొందరు యువతులపైనా అఘాయిత్యాలకు పాల్పడ్డారని తెలిపింది. న్యాయం చేయాలని, రక్షణ కల్పించాలని పోలీసులను వేడుకుంది. ఆమె ఫిర్యాదు మేరకు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీతో పాటు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఇన్స్పెక్టర్ నిరంజన్రెడ్డి తెలిపారు. కేసు తీవ్రత దృష్ట్యా దర్యాప్తును సీసీఎస్ లేదా సీఐడీకి అప్పగించే అవకాశాలున్నాయి.
Courtesy Andhrajyothi