- అర్ధరాత్రి దాటాక నాలుగో యూనిట్లో ప్రమాదం
- లోపల చిక్కుకున్న కొందరు సిబ్బంది
అమ్రాబాద్: శ్రీశైలం ఎడమగట్టు భూగర్భ జల విద్యుత్తు ఉత్పత్తి కేంద్రంలో గురువారం రాత్రి భారీ అగ్నిప్రమాదం జరిగింది. తొలుత ప్యానల్ బోర్డులో అకస్మాత్తుగా మంటలు చెలరేగి భారీ శబ్దాలు రావడంతో సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. మొత్తం ఆరు యూనిట్లలో దట్టంగా పొగలు కమ్ముకున్నాయి. పొగలు రావడాన్ని గమనించి డీఈ పవన్కుమార్తో పాటు ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ సిబ్బంది కొందరు వెంటనే బయటకు పరుగులు తీశారు. ప్రమాదం జరిగిన సమయంలో విద్యుత్ కేంద్రంలో 30 మంది సిబ్బంది ఉన్నారు. వీరిలో 15 మంది సొరంగ మార్గం ద్వారా బయటపడ్డారు. సహాయక సిబ్బంది మరో ఆరుగురిని రక్షించారు. మిగిలిన తొమ్మిది మంది లోపలే చిక్కుకు పోయారు. వెంటనే అప్రమత్తమైన అధికారులు విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో తెల్లవారుజాముకు మంటలు అదుపులోకి వచ్చాయి. మంటలు అదుపులోకి వచ్చినా లోపల దట్టంగా పొగలు వ్యాపించడంతో సహాయక చర్యలకు ఆటంకమేర్పడింది. లోపల చిక్కుకున్న వారిని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. అగ్నిప్రమాదంలో గాయపడిన డీఈ పవన్ కుమార్, ప్లాంట్ జూనియర్ అసిస్టెంట్ రామకృష్ణ, డ్రైవర్ పాలంకయ్య, మాతృ, కృష్ణారెడ్డి, వెంకటయ్య ఈటలపెంట జెన్కో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రం సిబ్బంది కూడా సహాయక చర్యల్లో పాల్గొన్నారు.
సిబ్బందిని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నాం: మంత్రి జగదీశ్రెడ్డి
ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి, కలెక్టర్ శర్వన్, ట్రాన్స్కో, జెన్కో సీఎండీ ప్రభార్ రావు, టీఎస్ జెన్కో సీఈ రమేష్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు తదితరులు పరిశీలించారు. జల విద్యుత్ కేంద్రంలో చిక్కుకున్న సిబ్బందిని బయటకు తీసుకొచ్చేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి జగదీశ్ రెడ్డి తెలిపారు. అగ్నిమాపక సిబ్బంది, సహాయక బృందాలు సిబ్బందిని కాపాడే ప్రయత్నం చేస్తున్నామన్నారు. గురువారం రాత్రి 10.30 గంటల సమయంలో విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలోని యూనిట్ 1లో మంటలు చెలరేగినట్లు తెలిపారు. ప్రమాద సమయంలో జల విద్యుత్ కేంద్రంలో జెన్కో సిబ్బంది ఉన్నారని.. వారిలో 10 మంది బయటకు రాగా, మరో 9 మంది లోపలే చిక్కుకుపోయారని వెల్లడించారు. ప్లాంట్ ఆపే ప్రయత్నం చేసినా అది సాధ్యం కాలేదన్నారు. విద్యుత్ కేంద్రంలో పొగ దట్టంగా అలుముకోవడంతో లోపల ఉన్న సిబ్బంది శ్వాస ఇబ్బందులు ఎదుర్కొన్నారని మంత్రి
చెప్పారు.
సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి
శ్రీశైలం జలవిద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో అగ్ని ప్రమాద ఘటనపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అక్కడి పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. ప్లాంట్లో చిక్కుకున్న వారిని సురక్షితంగా బయటకు తీసురావాలని అధికారులను ఆదేశించారు. ప్లాంట్ వద్ద ఉన్న మంత్రి జగదీష్రెడ్డి, ట్రాన్స్కో, జెన్ కో సీఎండీ ప్రభాకరావుతో సీఎం ఫోన్లో మాట్లాడారు. ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు.
Courtesy Eenadu