- ఈనెల 8నుంచి జీహెచ్ఎంసీలో 500 లోపే..
- క్షేత్రస్థాయిలో పరిస్థితులు మరో విధంగా..
- ప్రైవేటు ల్యాబ్లలో 34ు పాజిటివ్ రేటు
- ఇళ్లవద్దే సొంతంగా యాంటీజెన్ టెస్టులు
- చేసిన టెస్టుల వివరాలు చెప్పని కొన్ని ల్యాబ్లు
- జీహెచ్ఎంసీ పరిధిలో ఆగస్టు 8 నుంచి 500 లోపే పాజిటివ్లు
హైదరాబాద్ : వైద్య ఆరోగ్య శాఖ లెక్కల ప్రకారం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కరోనా నెల రోజులుగా తగ్గుతోంది. గత ఏడు రోజుల్లో కేవలం 2,148 కేసులే నమోదయ్యాయి. నిజానికి టెస్టులు తక్కువ చేస్తున్నపుడే రాజధానిలో రోజుకు 1500-1800 కేసులు వచ్చాయి. ఆ తర్వాత సంఖ్య బాగా తగ్గిపోయింది. ఉదాహరణకు.. జూలై 1న 881 కేసులు రాగా, జూలై 15న 557 వచ్చినట్లు బులెటిన్లో పేర్కొన్నారు. ఆగస్టు 8 నుంచి రోజూ 500లోపే పాజిటివ్లు వస్తున్నాయి. ఆగస్టు 17న కేవలం 235 కేసులే నమోదయ్యాయి. బుధవారం నాటికి రాష్ట్రంలో 95,700 కేసులే నమోదయ్యాయి. అందులో గ్రేటర్ హైదరాబాద్వే 75 శాతం అనుకున్నా.. సర్కారీ లెక్కల ప్రకారం జీహెచ్ఎంసీలో 75 వేల కేసులున్నట్లు లెక్క. కానీ క్షేత్రస్థాయి పరిస్థితులు వేరని.. బాధితులు అంతకుమించి ఉండొచ్చని వైద్యనిపుణులే చెబుతున్నారు. ఎందుకింత తేడా?
గుట్టుగా పరీక్షలు
సర్కారీ పరీక్ష కేంద్రాల్లో కరోనా టెస్టు కష్టంగా మారింది. దీంతో కొందరు యాంటీజెన్ కిట్లను బ్లాక్ మార్కెట్లో కొని, ఇంటివద్దే తెలిసిన ల్యాబ్ టెక్నిషీయన్స్ ద్వారా పరీక్ష చేయించుకుంటున్నారు. రూ.700 పెడితే ఒక యాంటీజెన్ కిట్ దొరకుతోంది. లేదా తెలిసిన వైద్యుడి వద్దకు వెళ్లినా లభ్యం అవుతోందని, ప్రధానంగా దంత వైద్యుల దగ్గర ఈ కిట్లు చాలా ఉన్నాయని చెబుతున్నారు. ఇలాంటి టెస్టులేవీ రికార్డులకు ఎక్కడం లేదు. అలాగే ప్రైవేటు ల్యాబ్స్లో కూడా ఓటీపీ లేకుండా టెస్టులు చేయడం, రికార్డుల్లో నమోదు చేయకపోవడం లాంటి చర్యలకు పాల్పడుతున్నారు. కొన్ని ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ ఈ తంతు నడుస్తోంది. కొందరు సామాజిక బహిష్కరణ భ యంతో రహస్యంగా టెస్టులు చేయించుకుంటున్నారు. ఇలా వస్తున్న పాజిటివ్లేవీ నమోదు కావట్లేదు.
అసలు టెస్టులు కాకుండా..
లక్షణాలున్న కొందరు ఆర్టీపీసీఆర్, యాంటీజెన్ కాకుండా.. హెమటాలజీ, బయోకెమికల్స్, ఇన్ఫ్లమేటరీ మార్కర్, కోయాగ్యులేషన్ పరీక్షలు చేయించుకుంటున్నారు. ఇన్ఫ్లమేటరీ మార్కర్ పరీక్షలో సి-రియాక్టివ్ ప్రొటీన్ (సీఆర్పీ), ఫెరిటిన్, ప్రోకాల్షిటోనిన్, ఇంటర్ల్యూక్ (ఐఎల్-6) పెరిగితే కచ్చితంగా కొవిడ్ ఇన్ఫెక్షన్ ఉన్నట్టు భావించి చికిత్స పొందుతున్నారు. మరికొందరు సీటీ స్కాన్ చేయించుకుని అందులో తేడా ఉంటే కరోనా చికిత్స తీసుకుంటున్నారు. ఇలాంటివేవీ రికార్డుల్లోకి ఎక్కట్లేదు. కొందరికి కరోనా సోకినా ఏ లక్షణాలూ బయటపడక రికార్డుల్లోకి చేరడం లేదు.
ఇప్పటికీ ఎక్కువే..
హైదరాబాద్ నగరంలో పాజిటివ్ రేటు ఇప్పటికీ ఎక్కువగానే ఉన్నట్లు ప్రైవేటు ల్యాబ్లలో వస్తోన్న రిపోర్టులను బట్టి అర్థం అవుతోంది. కొన్ని ల్యాబ్లలో చేస్తున్న పరీక్షల్లో పాజిటివ్ రేటు ఇప్పటికి 32-34 శాతం వస్తున్నట్లు సమాచారం. కొద్ది రోజుల క్రితం వరకూ అది 40 శాతంగా ఉండేదని ల్యాబ్ నిర్వాహకులు చెబుతున్నారు.
మా పరీక్షల్లో 34% పాజిటివ్
ప్రస్తుతం మా వద్ద చేస్తున్న ఆర్టీపీసీఆర్ టెస్టుల్లో 34 శాతం పాజిటివ్ రేటు వస్తోంది. వర్షాల వల్ల వారం రోజులుగా రోజుకు కేవలం 650-700 టెస్టులే చేస్తున్నాం. అంతకుముందు రోజుకు 1400 వరకూ టెస్టులు చేసేవాళ్లం. అప్పుడు పాజిటివ్ రేటు 40-47% వరకూ నమోదయింది.
ఓ ప్రముఖ డయాగ్నస్టిక్స్ సంస్థ నిర్వాహకులు
వాస్తవానికి దూరంగా..
జీహెచ్ఎంసీ పరిధిలో కరోనా కేసులకు సంబంధించి వైద్య ఆరోగ్యశాఖ చెబుతున్న లెక్కలు వాస్తవానికి దగ్గరగా అనిపించట్లేదు. సీసీఎంబీ చేసిన అధ్యయనం కూడా ఇదే చెబుతోంది. ఆ విశ్లేషణ ప్రకారం చూస్తే ప్రజలు పెద్దయెత్తున వైరస్ బారినపడినట్లుగా భావించాలి.
డాక్టర్ బుర్రి రంగారెడ్డి, ప్రెసిడెంట్, ఇన్ఫెక్షన్ కంట్రోల్ అకాడమీ ఆఫ్ ఇండియా
Courtesy Andhrajyothi