– గత సివిల్స్ పరీక్షల ఫలితాల్లో తేలిన వాస్తవాలు
– ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు తీరని అన్యాయం
– సామాజిక న్యాయం బుట్టదాఖలు
– అగ్రవర్ణాల మెప్పు పొందేందుకే బీజేపీ యత్నం: విశ్లేషకుల అభిప్రాయం
న్యూఢిల్లీ : ఆర్థికంగా వెనుకబడిన తరగతుల (ఈడబ్ల్యూఎస్) కోటా బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందిన పదిహేను రోజుల తర్వాత మదురైలో జరిగిన ఒక ర్యాలీలో ప్రధాని మోడీ మాట్లాడుతూ.. ‘మేం తీసుకొచ్చిన రిజర్వేషన్ పాలసీతో దళతులు, గిరిజనులు, ఓబీసీల రిజర్వేషన్లకు ఎలాంటి హాని కలగదు..’ అని వ్యాఖ్యానించారు. దీనిమీద విమర్శలు చేస్తున్న వారిని ‘ప్రతికూల శక్తులు’ గా ఆయన అభివర్ణించారు. సరిగ్గా 2019 లోకసభ ఎన్నికలకు ముందు ప్రయోగించిన ఈ అస్త్రంతో అగ్రవర్ణాలు మళ్లీ మోడీకే జై కొట్టాయి. కానీ ఈడబ్ల్యూఎస్ కోటా వల్ల ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు తీరని అన్యాయం జరుగుతున్నదని ఆ వర్గాల ప్రజలు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ కోటా కారణంగా తమకు ప్రభుత్వ ఉద్యోగాల్లో తీరని అన్యాయం చేస్తున్నారని వారు వాపోతున్నారు. దీన్ని రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో ఇప్పటికే 30 కి పైగా పిటిషన్లు దాఖలయ్యాయి.
మోడీ చెప్పినట్టు.. తాము ఉద్యోగాల్లో ఇతర వర్గాలకు కేటాయించిన రిజర్వేషన్లు (మొత్తం 49.5 శాతం కాగా ఇందులో ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 7.5 శాతం, ఓబీసీలకు 27 శాతం) తీసుకోవడంలేదనీ, జనరల్ కేటగిరీలో ఉన్న 50 శాతం రిజర్వేషన్లలోంచే ఈడబ్ల్యూఎస్ కోటా (10 శాతం) ఇస్తున్నామనేది కాగితాల్లో తార్కికంగా అనిపించినా వాస్తవానికి విరుద్ధంగా ఉంది. ఇది ఆధిపత్య వర్గాలకు మరింత దోచిపెడుతూ, నియామకాల్లో సామాజికంగా వెనుకబడిన వర్గాలకు అన్యాయం చేసే విధంగా ఉన్నదని సామాజిక, హక్కుల విశ్లేషణవేత్తలు ఆరోపిస్తున్నారు. ఉదాహరణకు.. ఒక ఓబీసీ అభ్యర్థి పరీక్షల్లో (ఉద్యోగ) అగ్ర స్థానాన్ని సాధిస్తే అతడు/ఆమె తనకు రిజర్వు చేసిన కేటగిరీలో కాకుండా జనరల్ కేటగిరీలోనే నియామకమవుతాడు. అతడు/ఆమె కోసం కేటాయించిన సీటు తిరిగి ఓబీసీ అభ్యర్థి చేతే (జనరల్ కేటగిరీ కన్నా మార్కులు తక్కువగా ఉన్నా) భర్తీ చేయబడుతుంది. మరింత విపులంగా చెప్పుకుంటే… ఓబీసీలకు 100 పోస్టులు రిజర్వు చేశారనుకుందాం. జనరల్ కేటగిరీ గ్రేడ్ మార్కుల కంటే ఎక్కువ ఎవరికీ రాకుంటే ఆ వంద మందే నియామకం అవుతారు. కానీ జనరల్ కేటగిరీ గ్రేడ్ కంటే మరో 10 మంది ఓబీసీలు ఎక్కువ మార్కులు సాధిస్తే.. అప్పుడు మొత్తంగా 110 మంది ఓబీసీలు నియామకం అవుతారు. ఇదే విధానం ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ కోటాలోనూ అమలవుతున్నది. ఇదే సమయంలో ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు రిజర్వు చేసిన (49.5 శాతం) దానికంటే ఎక్కువ ఉద్యోగాలిస్తున్నామని కేంద్ర ప్రభుత్వం చెప్పుకుండటం గమనార్హం.
ఈడబ్ల్యూఎస్ కోటా కింద ఇస్తున్న 10 శాతం రిజర్వేషన్ల కారణంగా ఇతర వర్గాలకు ఉద్యోగాల్లో కోతపడటమే కాక.. ప్రభుత్వ వ్యవస్థల్లో అగ్ర వర్ణాల ఆధిపత్యం గణనీయంగా పెరుగుతుందని విశ్లేషకులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే సామాజికంగా, ఆర్థికంగా అట్టడుగు వర్గాల కంటే ఎంతో ఉన్నత స్థితిలో ఉన్న ఆధిపత్య వర్గాలకు ఇవి మరింత లాభం చేకూర్చడమే గాక, నిమ్న వర్గాలకు తీరని అన్యాయమని చెబుతున్నారు. 2019 సివిల్స్ పరీక్షల ఫలితాల్లో కట్ ఆఫ్ మార్కులను చుస్తే ఈ ఆరోపణ నిజమనిపించక మానదు.
సివిల్ సర్వీసెస్ (సీఎస్) ఎక్జామినేషన్ – 2019 కట్ ఆఫ్ మార్కులు
పరీక్ష జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ ఎస్సీ ఎస్టీ
సీఎస్ (ప్రిలిమ్స్) 98 90 95 82 77
సీఎస్ (మెయిన్) 751 696 718 706 699
సీఎస్ (ఫైనల్) 961 909 925 898 893
పై పట్టిక ప్రకారం.. సీఎస్ ఫైనల్ లో ఈడబ్ల్యూఎస్ వర్గాలకు కట్ ఆఫ్ మార్కులు ఓబీసీలకంటే తక్కువగా ఉన్నాయి. సీఎస్ మెయిన్ లో ఓబీసీలు, ఎస్సీ, ఎస్టీలకంటే కూడా తక్కువగా ఉన్నాయి. ఇప్పుడు పైన చెప్పుకున్న ఉదాహరణను ఇక్కడ అన్వయించుకుంటే… జనరల్ కేటగిరీలో సాధారణంగానే కట్ ఆఫ్ మార్కులు పెరిగి ఆ ఉద్యోగాలనూ ఉన్నత వర్గాలు ఎగరేసుకుపోతున్నారు. రిజర్వేషన్ కూడా కలిసి రావడంతో ఆ వర్గాలే ఎక్కువ ఉద్యోగాలు పొందుతున్నాయి. ఇక ఈడబ్ల్యూఎస్ కోటా కింద జనరల్ కేటగిరీలో పది శాతం రిజర్వేషన్ కోల్పోవడంతో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలు ప్రభుత్వ ఉద్యోగాల్లో ఆ మేర తగ్గిపోతున్నారు.
నిమ్న వర్గాలు గడిచిన పదేండ్లుగా సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు కనబరుస్తున్న తరుణంలో మోడీ సర్కారు ఈ కోటాను తీసుకురావడం గమనార్హం. 2016, 2017 లలో ఓబీసీలు సీఎస్ఈ లో టాప్ ర్యాంకు సాధించారు. 2015 లో ఈ గౌరవాన్ని ఎస్సీలు పొందారు. ఇక తమిళనాడులో ఇటీవలే జరిగిన ఎస్బీఐ జూనియర్ అసిస్టెంట్ పోస్టుల్లో.. ఈడబ్ల్యూఎస్ కట్ ఆఫ్ మార్కులు 28.5 గా ఉన్నాయి.
ఇదే ఎస్సీ లకు 61.25, ఎస్టీలకు 53.75 కాగా.. జనరల్, ఓబీసీలకు 61.25 గా ఉన్నాయి. కుల, మత రాజకీయాలు దేశాన్ని ఏలుతున్న నేపథ్యంలో ఓటుబ్యాంకు రాజకీయాలు నడుపుతున్న రాజకీయ పార్టీలు దీని మీద మౌనం దాల్చుతున్నాయి. దీనికి వ్యతిరేకంగా మాట్లాడితే ఆ వర్గాల ఓట్లు కోల్పోవాల్సి వస్తుందని అనుకుంటున్నాయి. కానీ ఇది అట్టడుగు, నిమ్న వర్గాలకు తమకు తెలియకుండానే పూడ్చలేని అన్యాయం జరుగుతుందని విమర్శకులు అంటున్నారు. అగ్రవర్ణాల పార్టీగా పేరున్న బీజేపీ.. ఆ వర్గాలను సంతప్తిపరుస్తూ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలను నట్టేట ముంచుతున్నదని వారు ఆరోపిస్తున్నారు.
Courtesy: NT