ఒక్కొక్కటిగా బయటపడుతున్న నిత్యానంద చీకటి లీలలు
అహ్మదాబాద్: తన ఆశ్రమంలో ఉన్న బాలికలపై లైంగికదాడి పాల్పడం, బలవంతంగా నిర్బధించటం, కిడ్నాప్లకు పాల్పడటం వంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న వివాదాస్పద మత బోధకుడు స్వామి నిత్యానంద చీకటి లీలలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. గుజరాత్లోని అహ్మదాబాద్లో తన ఆశ్రమంలో ఉన్న చిన్నారులకు బలవంతంగా నీలిచిత్రాలు (పోర్న్) చూపించారని పోలీసులు వెల్లడించారు. ఇప్పటికే ఆయనపై పలు కేసులు నమోదవ్వగా.. తాజాగా పోక్సో చట్టం కింద మరో కేసు నమోదయినట్టు తెలిపారు. ఆ ఆశ్రమంలో ఉన్న గిరీశ్ తుర్లపతి నీలిచిత్రాల విషయాన్ని మొదట కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఆయన దాఖలు చేసిన ఫిర్యాదును విచారించిన అహ్మదాబాద్ న్యాయస్థానం.. నిత్యానందపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని వివేకానంద నగర్ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో నిత్యానందతో పాటు మరో 14 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు పోలీసులు వెల్లడించారు. నిందితుల్లో శిశు సంక్షేమ కమిటీ (సీడబ్ల్యూసీ) సభ్యులు ఉండటం గమనార్హం. కాగా, గతేడాదిలోనూ ముగ్గురు పిల్లలను కిడ్నాప్ చేశారంటూ నిత్యానందపై కేసు నమోదైన సంగతి తెలిసిందే.
దీనిపై తుర్లపతి గిరీశ్ మాట్లాడుతూ.. నిత్యానంద.. చిన్నారులను, మహిళలను బంధించి, తీవ్ర ఇబ్బందలకు గురిచేస్తూ.. బలవంతంగా వారికి నీలిచిత్రాలు చూపించేవాడన్నారు. యువతులకు సంబంధించి వారి ఫొటోలను, వీడియోలను మార్ఫింగ్ చేసి బ్లాక్మెయిల్ చేసేవాడని ఆరోపించారు. కాగా, కేసుల్లో నిందితుడిగా ఉన్న నిత్యానంద.. 2018లో దేశం విడిచి పారిపోయారు. ఈ నేపథ్యంలోనే ఆయన ఆచూకీ కోసం ఇంటర్పోల్ బ్లూ కార్నర్ నోటీసులు సైతం జారీ చేసింది. కాగా, నిత్యానందను తమ ముందు హాజరు పర్చాలని ఇటీవల కర్నాటక హైకోర్టు పోలీసులకు ఆదేశాలు జారీ చేయగా.. ఆయన ఆధ్యాత్మిక పర్యటనలో ఉండటంతో న్యాయస్థానం ఎదుటకు తీసుకురాలేక పోయామని పోలీసులు వెల్లడించటం గమనార్హం.