- సెన్సెక్స్ 1,941 పాయింట్లు డౌన్
- రూ.7 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరి
- స్టాక్ మార్కెట్ చరిత్రలోనే భారీ నష్టం
- 538 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ
- ఓఎన్జీసీ.. రిలయన్స్ షేర్లు విలవిల
- మరింత పతనమైన రూపాయి విలువ
- క్రూడాయిల్ ధర పతనమూ కారణమే
- 31 డాలర్లకు చేరుకున్న బ్యారెల్ ధర
- పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గే అవకాశం
- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగ్గిస్తాయా!?
- క్రూడాయిల్: 31 డాలర్లు
- ఓఎన్జీసీ: 26 శాతం
- రిలయన్స్: 35 శాతం
ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన చైనాలో 50 కోట్ల మంది ఇళ్లల్లోనే ఉన్నారు! ఇటలీలో 1.6 కోట్ల మంది పరిస్థితి కూడా ఇంతే! ప్రపంచవ్యాప్తంగా 100 దేశాలకు కరోనా విస్తరించింది. ఫలితంగా.. జన జీవనం స్తంభించింది. రవాణా నిలిచిపోయింది. రోడ్లపై కార్లు, బైకులు లేవు.. ఆకాశంలో విమానాలు తగ్గిపోయాయి! ఇంధన వినియోగం భారీగా పడిపోయింది. వివిధ సంస్థల కార్యకలాపాలు ఆగిపోవడంతో లావాదేవీలూ లేవు. ఇది ప్రపంచ వాణిజ్యంపై తీవ్ర ప్రభావం చూపింది. జపాన్ మొదలుకుని అమెరికా వరకూ సోమవారం మార్కెట్లు క్రాష్ అయ్యాయి! భారత్లోనూ స్టాక్ మార్కెట్ చరిత్రలోనే అత్యధికంగా పతనమైంది. హోలీ సందర్భంగా మంగళవారం మార్కెట్లకు సెలవు! ఇక, బుధవారం పరిస్థితి ఏమిటో!?
న్యూఢిల్లీ, ముంబై, మార్చి 9: కరోనా వైరస్ మనుషులనే కాదు.. మార్కెట్నూ పట్టి కుదిపేసింది! భారత స్టాక్ మార్కెట్ చరిత్రలోనే అతి పెద్ద పతనం సోమవారం నమోదైంది! ఒక్క రోజులోనే సెన్సెక్స్ ఏకంగా 1,941 పాయింట్లు; నిఫ్టీ 538 పాయింట్లు నష్టపోయాయి! సోమవారం ట్రేడింగ్ ప్రారంభమైన వెంటనే 1000 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్.. ఆ తర్వాత వేగంగా పతనమవుతూనే ఉంది! ఒక దశలో చరిత్రలోనే అత్యధికంగా 2,467 పాయింట్లు క్షీణించాయి! రూ.7 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపదను కరోనా మింగేసింది! భారత కుబేరుడు ముఖేశ్ అంబానీ సంపద ఒక్క రోజులోనే రూ.45 వేల కోట్లు పతనమైంది. అంతేనా.. రూపాయి విలువ కూడా మరింత పడిపోయింది. డాలర్తో మారకం రేటు 30 పైసలు బలహీనపడి.. 74.17కు చేరుకుంది. మార్కెట్ల పతనానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా కరోనాయే కారణం! కరోనా కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ రూ.1.78 కోట్ల కోట్లు (2.4 ట్రిలియన్ డాలర్లు) నష్టపోతుందని నిపుణులు హెచ్చరించారు. ఈ భయాందోళనల మధ్యే వివిధ దేశాల్లోని మార్కెట్లు కుదేలయ్యాయి. తొలుత జపాన్లో మార్కెట్ పతనం మొదలైంది. ఆ తర్వాత సింగపూర్, హాంకాంగ్, ఆస్ట్రేలియా తదితర మార్కెట్లూ కుదేలయ్యాయి.
ఈ ప్రభావం భారత్పైనా పడింది. మన మార్కెట్ కూడా షేకయ్యింది. చివరికి, అమెరికా మార్కెట్ కూడా క్రాష్ అయ్యింది. అక్కడి స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. సోమవారం ట్రేడింగ్ ప్రారంభమైన వెంటనే సూచీలు 2000 పాయింట్లు కోల్పోయాయి. దాంతో 15 నిమిషాలపాటు ట్రేడింగ్ నిలిపేశారు. తర్వాత తిరిగి ప్రారంభమైనా మార్కెట్లు కోలుకోలేదు. ఇక, కరోనా పరోక్ష ప్రభావం కూడా మార్కెట్ పతనానికి కారణమే. ప్రపంచవ్యాప్తంగా రవాణా పడిపోవడంతో చమురుకు డిమాండ్ తగ్గిపోయింది. దాంతో, ఉత్పత్తి తగ్గిద్దామని ఓపెక్ దేశాలు ప్రతిపాదించాయి. ఇందుకు అందులో భాగస్వామ్య దేశమైన రష్యా ససేమిరా అంది. రష్యాను దెబ్బతీయడానికి మిగిలిన ఓపెక్ దేశాలు కూడ్రాయిల్ ధరను తగ్గించాయి! గల్ఫ్ యుద్ధం తర్వాత గత 30 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా సోమవారం ఒక్క రోజులోనే క్రూడాయిల్ ధర 30 శాతం పడిపోయింది. బ్యారెల్ ధర మార్కెట్లో 31 డాలర్లకు చేరుకుంది. ఈ ప్రభావం స్టాక్ మార్కెట్ను కుదిపేసింది! చమురు ఉత్పత్తి రంగంలో కీలకంగా ఉన్న ఓఎన్జీసీ, రిలయన్స్ షేర్లు భారీగా పతనమయ్యాయి.
మరోవైపు, చమురు ఎగుమతి దేశాల మధ్య యుద్ధం.. క్రూడాయిల్ ధర తగ్గడం భారత్కు సానుకూలంగా మారే పరిణామాలు. కానీ, వాటిని అందిపుచ్చుకునే స్థితిలో మన దేశం లేదు. ఇందుకు కారణం.. దేశంలో పెద్దఎత్తున చమురు నిల్వకు అవకాశాలు లేకపోవడమే!! అమెరికా, చైనా వంటి దేశాల్లో 60 రోజులకు సరిపడా నిల్వ సదుపాయం ఉంటే.. మన దేశంలో రెండు వారాలకు మించి చమురు నిల్వ సదుపాయం లేదు. క్రూడాయిల్ ధర భారీగా తగ్గిపోవడంతో పెట్రోలు, డీజిల్ ధరలు కూడా తగ్గనున్నాయి. అయితే, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆ వెసులుబాటును వాహనదారులకు చేరనిస్తాయా లేక పన్నులు పెంచేసి అడ్డుకుంటాయా అనే అంశంపై నిపుణులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
Courtesy Andhrajyothi