గువహతి : అసోంలో వివాదాస్పద జాతీయ పౌర రిజిస్టార్ (ఎన్నార్సీ)లో పేర్లు గల్లంతయ్యిన దాదాపు 19 లక్షల మందికి పైగా ‘తిరస్కరణ స్లిప్పు’లను జారీ చేయనున్నారు. ఈ ప్రక్రియను ఈనెల 20 నుంచి చేపట్టడానికి ఎన్నార్సీ యంత్రాంగం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది. ఈ విషయాన్ని అసోం రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర అసెంబ్లీలో వెల్లడించింది. ఎన్నార్సీ తుది జాబితా నుంచి ఒక వ్యక్తిని ఎందుకు తొలగించారన్న దానిపైగల కారణాలు సదరు ‘తిరస్కరణ స్లిప్పు’ల్లో ఉండనున్నాయి. ‘దీనికి సంబంధించిన పని పూర్తయ్యాక.. తిరస్క రణ స్లిప్పులను ఈనెల 20 నుంచి జారీ చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం’ అని కాంగ్రెస్ ఎమ్మెల్యే రెకిబుద్దీన్ అహ్మద్ ప్రశ్నకు సమాధానంగా అసోం మంత్రి చంద్ర మోహన్ పొటోవారీ రాష్ట్ర అసెంబ్లీలో తెలిపారు. ఎన్నార్సీ నవీకరణ ప్రక్రియ కోసం రూ. 1348.13 కోట్లను కేటాయించినట్టు మరొక ఎమ్మెల్యే ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. గతేడాది ఆగస్టు 31న విడుదల చేసిన ఎన్నార్సీ తుది జాబితా నుంచి 19 లక్షల మందికి పైగా తమ పేర్లు కోల్పోయిన విషయం విదితమే. దీంతో అసోంలో ఎన్నార్సీ ప్రక్రియపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి.
Courtesy: NT